ఒడిశా ప్రమాదానికి కేంద్రం, రైల్వేశాఖ బాధ్యత వహించాలని పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ (పీసీపీఎస్పీఎస్) తేల్చిచెప్పింది. వేగం కన్నా భద్రతకే పెద్దపీట వేయాలని హితవు చెప్పింది. ఇలాంటి ఘోర రైలు దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై పీసీపీఎస్పీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ప్రమాద కారణాలపై నిపుణులతో విశ్లేషణలు జరిపించాలని, భద్రతా వ్యవస్థలను పటిష్ఠపరచాలని, మౌలిక వ్యవస్థ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించింది. ప్రముఖ విద్యావేత్తలు, న్యాయవేత్తలు, మాజీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలతో కూడిన కమిటీ విడుదల చేసిన ఆ ప్రకటనలోని ముఖ్యాంశాలు..
ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటనలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది తీవ్ర గాయాలపాలవడం అత్యంత దురదృష్టకరం. బాధితులకు సాయం అందించేందుకు తక్షణం రంగంలోకి దిగిన వేలాదిమంది గ్రామస్థుల చొరవ ప్రశంసనీయం. జాతీయ విపత్తు నివారణ దళం (ఎన్డీఆర్ఎఫ్) సకాలంలో స్పందించిన తీరు అభినందనీయం. ఈ దుర్ఘటన నేపథ్యంలో మా పరిశీలనకు వచ్చిన కొన్ని సూచనలు ఈ ప్రకటనలో పొందుపరుస్తున్నాం. రైల్వేల భద్రత, సామర్థ్యం పెంచే మౌలిక వసతుల కల్పనపై విధాన నిర్ణేతలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం విచారకరం. మౌలిక యంత్రాంగాన్ని మెరుగుపర్చడం, వ్యవస్థీకృత అంచనా చేపట్టడం ద్వారా రైల్వే భద్రతకు రైల్వేశాఖ భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భద్రతా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రైల్వే ప్రమాదాల కారణాలపై వృత్తి నిపుణుల ద్వారా అంచనా వేయించడంలో రైల్వేశాఖ వైఫల్యం విస్మయం కలిగిస్తున్నది.
సాంకేతిక, వ్యవస్థాపరమైన అంశాలను పట్టించుకోకుండా ప్రభుత్వ సీనియర్ నేతలు ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం, సానుభూతి వచనాలపైనే దృష్టి పెడుతున్నారు. రైల్వేల భద్రతపై డాక్టర్ అనిల్ కాకోద్కర్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా కమిటీ 2012లోనే పలు కీలక సూచనలు చేసింది. రైల్వేల భద్రతపై స్వతంత్ర ప్రాధికార సంస్థ ఏర్పాటుచేయడం, డిజైన్లు, ప్రమాణాలపై పరిశోధనను బలోపేతం చేయడం, యావత్తు ట్రంక్ రూట్లలో అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం అందులో ముఖ్యమైనవి. ఈ సిఫారసులు అందిన దశాబ్దకాలం తర్వాత కూడా వాటిని రైల్వేశాఖ అమలు చేయలేకపోయింది. ట్రంక్ రూట్లలో పెరిగిన రైళ్ల రద్దీ, జవాబుదారీతనం లేకపోవడం అనేవి భద్రత విషయంలో ఆందోళన కలిగిస్తున్నాయి. బుల్లెట్ రైళ్లు, వందేభారత్లు ఎడాపెడా ప్రారంభించే ముందు భద్రత మీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తున్నది. ఈ సరికే రద్దీగా ఉన్న సెక్షన్లలో దూరప్రాంత రైళ్ల వేగం పెంచడం వల్ల స్వల్ప, మధ్యస్థ దూరాలు ప్రయాణించే రైళ్ల రాకపోకల వేగం తగ్గిపోతుంది.
అల్పాదాయ వర్గాల ప్రయాణికులు, సరుకు రవాణా దెబ్బతింటాయి. ఓ వైపు రైళ్లలో రద్దీ 125 నుంచి 150 అధికంగా ఉంటున్నది. ప్రమాదాల్లో మృతుల సంఖ్య అధికంగా ఉంటున్నది. మరోవైపు రైల్వేట్రాక్ల ఆధునీకరణకు, కొత్త లైన్లు వేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కట్టుదిట్టమైన సిగ్నల్ లాకింగ్ అవసరాన్ని ఒడిశా ప్రమాదం నొక్కిచెప్తున్నది. హడావుడిగా దర్యాప్తును సీబీఐకి అప్పగించేశారు. దానికన్నా సమస్యపై వ్యవస్థీకృత సాంకేతిక అంచనా వేయించడం ముఖ్యం. సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యంపై నైరుతి రైల్వే చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గత ఫిబ్రవరి 9న ఇచ్చిన నివేదిక ఇక్కడ ప్రస్తావించాలి. మైసూరు డివిజన్లోని బీరూర్-చిక్జజూర్ సెక్షన్లో హోసదుర్గ రోడ్ స్టేషన్ వద్ద సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఓ గూడ్స్ రైలును ఢీకొనే ప్రమాదం తృటిలో తప్పింది. దాన్ని చూసైనా రైల్వేశాఖ సిగ్నలింగ్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరిపించిందా అన్న ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది.
ప్రమాదాలు పదే పదే జరగకుండా చూసేందుకు రైల్వేశాఖ తన విధానాలు, కార్యక్రమాలపై ఆత్మపరిశీలన జరపకుండా ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమని చెప్పజూస్తున్నది. ఎంతసేపూ రైల్వే ఆస్తుల ప్రైవేటీకరణ, అమ్మకంపైనే దృష్టి పెడుతున్నది కిందిస్థాయి ఉద్యోగులను బాధ్యులుగా నిలబెడుతున్నది. రైలుమార్గాల నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాల్లో 60 శాతం ఖాళీలున్నట్టు రైల్వే భద్రతపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఎత్తిచూపింది. దీనివల్ల రైలు పట్టాల తనిఖీ, నిర్వహణపై చాలా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మూడు లక్షల దాకా ఉన్న ఇత ర ఖాళీలను భర్తీ చేయకపోవడం, రెగ్యులర్ కాకుండా కాంట్రాక్టు సిబ్బందితో పనులు జరిపించడం కూడా సరికాదని తెలిపింది.