అనంతమైన ఈ విశ్వంలో జీవుల ఆవిర్భావం ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన సమయంలో అనేక మంది శాస్త్రవేత్తలు పలురకాల ఆలోచనలను వెలిబుచ్చారు. కానీ అవి శాస్త్రీయతకు నిలబడ లేక పోయాయి. ఈ క్రమంలో జీవుల పుట్టుకపై పెద్దఎత్తున చర్చకు దారితీసిన గొప్ప సిద్దాంతం చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం. ఇది జీవుల పుట్టుక పూర్వోత్తరాలను ఛేదించడంలో అగ్రభాగాన నిలబడింది.
పారిశ్రామిక విప్లవ కాలంలో చార్లెస్ డార్విన్ కు ముందు జీవశాస్త్రంలో అనేక నూతన ఆవిష్కరణలు జరిగినప్పటికీ జీవుల పుట్టుక, పరిణామంపై సమగ్రమైన వివరణ ఇవ్వడంలో సఫలం కాలేదు. కానీ తదుపరి వచ్చిన చార్లెస్ సిద్ధాంతా లు మనిషి కోతి నుంచి వచ్చాడని, మనిషిని దేవుడు సృష్టించలేడనే ఆలోచన తెరమీదికి తేవడంతో శాస్త్ర ప్రపంచంలో తీవ్రమైన వాదోపవాదాలకు దారితీసింది. సామాజి కంగా, మతపరంగా విపరీతమైన వివాదానికి కూడా దారితీసింది. ఇది ఊహాత్మక సిద్ధాంతం కాదు.
చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇంగ్లాండ్కు చెందిన ఒక గొ ప్ప ప్రకృతి వాది. బిగీల్ అనే నౌకలో డార్విన్ ప్రకృ తి పరిశీలన నిమిత్తం ప్రపంచ యాత్ర చేసి జీవుల భిన్న లక్షణాలపై సమగ్రమైన వివరణ ఇచ్చారు. ఈ భూ మి మీద మానవునితో సహా ఇప్పుడున్న జీవజాతులు య థాతథంగా సృష్టించబడ్డాయన్న వాదనను సవా లు చేశాడు. దీనికి చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సి ద్ధాం తం ఆధారంగా పరిష్కారం చూపాడు. అయితే ఆనా డు జీవులు జీవపరిణామం ద్వారా ఆవిర్భవించాయనే భావనను సాంప్రదాయవాదులు తిరస్కరించేవారు. కానీ డార్విన్ జాతుల ఆవిర్భావం (origin of spe cies) అనే గ్రంథంలో పరిణామాల ద్వారా జీవులు ఆవిర్భవిస్తాయని చెప్పారు. జీవ పరిణామానికి ప్రకృతి వరణం(natural selection) కారణమని తిరుగు లేని విధంగా నిరూపించాడు. జీవులలో భిన్నత్వం ఉంటుందని, ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా భిన్న త్వం ఉంటుందని పేర్కొన్నారు. సృష్టిలోని పర్యావర ణ పరిస్థితులకు అనుకూలమైన లక్షణాలు గల జీవు లు బతుకుతాయి. ఆ లక్షణాలను తమ సంతతికి కూ డా ఇస్తాయని తన ప్రకృతి వరణం అనే సిద్ధాంతంలో పేర్కొన్నారు. అనగా మనుగడ కోసం జరిగే పోరాటం లో ప్రకృతికి తట్టుకోగల జీవులు బతుకుతాయని, మి గిలినవన్నీ నశిస్తాయనే సూత్రాన్ని ఆయన చెప్పాడు.
డార్విన్ చెప్పిన ఉత్తమ జీవులు మనుగడ అనే సూ త్రాన్ని పెట్టుబడిదారి పోటీ ప్రపంచంలో ఆనాడు దోపిడీని, వలస దోపిడిని సమర్థించుకోవడానికి అనేకమంది ఉపయోగించుకున్నారు.19వ శతాబ్దంలో తెల్లజాతీయులు ప్రపంచ దేశాలకు వలస వెళ్లి ఆధిప త్యం చేయడానికి డార్వి న్ సూత్రాన్ని అర్థం చేసుకొని బలహీన దేశాలను దోపిడీ చేయడం మొదలుపెట్టారు.
ఆనాటి మతగ్రంథాలు, సాంప్రదాయవాదులు చార్లెస్ డార్విన్ వాదనను ఎంతగా వ్యతిరేకించినా డార్విన్
పరిణామ వాదం జీవులను అవగాహన చేసుకోవడంలో గొప్ప విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. మరోవైపు అనేకమంది యువకులు జీవ శాస్త్రం పట్ల ఆసక్తి పెంచుకొని ఆ దిశలో పరిశోధనలు ప్రారంభించడానికి డార్విన్ నేచురల్ సెలక్షన్ గ్రంథం స్ఫూర్తినిచ్చింది. అదే విధంగా ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం జీవుల పుట్టుక, పరిణామంపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను నిలువరించడంలో కీలక పాత్ర పోషిస్తూ శాస్త్రీయ ఆలోచనలకు పునాది వేసింది.
కానీ భారతదేశంలో కొంతకాలంగా భారతీయ మేధావి, పాలకవర్గం పలు వేదికల దగ్గర భారత శాస్త్ర విజ్ఞానం తో పాటు ప్రపంచ శాస్త్ర విజ్ఞానానికి వక్రభాష్యం పలకడం మొదలు పెట్టింది. గతంలో జరిగిన జలంధర్సైన్స్ కాంగ్రెస్లో ప్రముఖ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు చార్లెస్ డార్విన్ సిద్ధాంతం మన పురాణాల్లోని దశావతారంలో మత్స్యావతారంగా పేర్కొన్నారు. నాలుగేండ్ల క్రితం కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న సత్యపాల్సింగ్ డార్విన్ సిద్ధాంతం తప్పని విద్యావ్యవస్థలో డార్విన్ సిద్ధాంతాన్ని సైన్స్ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించాలన్నారు. ఇలాంటి అసత్య, సూడో సైన్స్ వాదనలతో ప్రపంచ శాస్త్ర వారసత్వాన్ని అపహాస్యం చేయడం ద్వా రా మన శాస్త్ర ప్రగతి ఎటు పోతుందో అనే అనుమానం వ్యక్తమవుతున్నది.
మరోవైపు ఇటీవల నూతన విద్యా విధానానికి అనుగుణంగా కేంద్ర విద్యాశాఖ పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్సీఈఆర్టీ(National Council of Educational Research and Training) పదవ తరగతి సిలబస్ నుంచి డార్విన్ జీవపరిణామాల క్రమం, పునరుత్పత్తి పాఠ్యాంశాలను తొలగించడం వివాదంగా మారింది. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ 1800 మందికిపైగా శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేధావులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. శాస్త్రీయ దృక్పథం అలవరచుకోవడానికి డార్విన్ సిద్ధాంతం ఎంతో ఉపకరిస్తుందని, అందువల్ల దీన్ని సెకండరీస్థాయి పుస్తకాల్లో ఉంచాలని శాస్త్రవేత్తలు కోరారు. డార్విన్ పరిణామ క్రమాన్ని తొలగిస్తే భావి మస్తిష్కాకాలకు జీవుల పుట్టుక, ఆవిర్భావం గురించి ఏం చెప్పాలనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. దీనికి సైతం దైవత్వాన్ని ముడి పెడతారేమోనని అనుమానం పలువురిలో రేకెత్తుతున్నది.
శాస్త్రీయ పరిష్కారాన్ని చూపిన ఈ సిద్ధాంతం జీవ శాస్త్రంలో నూతన దృక్కోణాన్ని ఆవిష్కరించింది. తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రకృతికి, జీవుల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రీయంగా సైద్ధాంతికంగా నిరూపించి, మానవ సమాజానికి అనువర్తనం చేసిన గొప్ప శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఆయన సిద్ధాంతం నేటికీ ఆచరణీయమని చెప్పవచ్చు. దాన్ని విద్యార్థుల పాఠ్యాంశాలలో భాగం చేసి విస్తృత ప్రచారం కల్పించాలి. నేటి సాంకేతిక యుగంలో భారత్ సూడో సైన్స్ వాదనల నుంచి బయటపడాలి. శాస్త్ర ప్రగతిని, సైంటిస్ట్ ల సేవలను గుర్తించి, భావి తరాలకు అందించాలి.
సంపతి రమేష్ మహారాజ్: 7989579428