రైతుల ఆదాయంపై పన్ను విధించాలనే ప్రతిపాదనను ముందుకు తేవడంలో మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేకత మరోసారి వెల్లడైంది. సాక్షాత్తూ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ చేత రైతులపై పన్ను భారం వేయాలంటూ పలికించడం మోదీ ప్రభుత్వ దుర్నీతికి అద్దం పడుతున్నది. తాను మొదటిసారి అధికారానికి రాకముందు ఎన్నికల సందర్భంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటూ ప్రచారం చేసుకున్న మోదీ గత ఎనిమిదేండ్లుగా వ్యవసాయదారుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు. రైతులను సంప్రదించకుండానే, పార్లమెంటులో తగురీతిలో చర్చించకుండానే మూడు వ్యవసాయ చట్టాలను రుద్దాలని ప్రయత్నించారు. ఏడాదిపాటు రైతులు ఉద్యమించడంతో క్షమాపణ చెప్పారే కానీ రైతు వ్యతిరేక దృక్పథాన్ని మాత్రం మార్చుకోలేదు. రైతుల వెన్ను విరిచే నిర్ణయాలను తీసుకుంటున్నారు.
ఎప్పుడో రాజుల కాలంలో, వలసవాదుల పాలనలో రైతులపై పన్ను ఉంది కనుక ఇప్పుడు ఎందుకు వేయకూడదంటూ మోదీ ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న వాదన వింతగొలిపేదిగా ఉన్నది. ప్రకృతి ధర్మం ప్రకారం ఆకలి మరణాలు ఉండవనీ, వలస పాలనలోనే పెచ్చరిల్లాయనేది మోదీ ప్రభుత్వానికి తెలువదా? వ్యవసాయానికి భరోసా లేకపోతే దేశానికి ఆహారభద్రత ఉంటుందా? భారతదేశంలో వ్యవసాయం ఇప్పటికీ వ్యాపారం కాదు. అదొక జీవనశైలి. రైతు కుటుంబం తన కష్టంతో ఎంత వస్తే అంత పండిస్తూనే ఉంటుంది. వారికి గిట్టుబాటు ఉండేలా చూడాలి తప్ప కుప్పకూలేలా ఉండకూడదు. హరిత విప్లవం తరువాత రైతులు ప్రభావిత వర్గాలుగా మారడం వల్ల వారిపై పన్నులు వేయడం లేదనే వాదన కూడా ఆమోదయోగ్యంగా లేదు. నిజంగానే రైతులకు అంత ఒత్తిడి తెచ్చి, డిమాండ్లు సాధించుకునే శక్తి గనుక ఉంటే ఉత్తరాదిలో, పంజాబ్లో, మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో, మహారాష్ట్ర, తమిళనాడులలో రైతుల ఆందోళనలు ఎందుకు చెలరేగినట్టు?
గత మూడు నాలుగు దశాబ్దాలుగా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలలో పారిశ్రామికులపై పన్నులు తగ్గించి, పేదలపై భారం మోపే పోకడ కనిపిస్తున్నది. కాకులను కొట్టి గద్దలకు పెట్టే విధానమూ మొదలైంది. మోదీ అధికారానికి వచ్చిన తరువాత ఈ పోకడ మరింత ఎక్కువైంది. మోదీ హయాంలో వచ్చిపడిన జీఎస్టీయే పరోక్ష పన్ను. దీనిని విస్మరించి ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా ఉండాలని సూక్తులు వల్లించడం ఆశ్చర్యకరంగా ఉన్నది. రాష్ర్టాలు తమ పరిధిలోని వ్యవసాయంపై పన్ను విధించాలనేది మోదీ ప్రభుత్వం పరోక్షంగా ఇచ్చిన సూచన ఇది. రాష్ర్టాల పరిధిని మోదీ ప్రభుత్వం ఎంత గౌరవిస్తున్నదో కేంద్ర చట్టాలను చూస్తేనే తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది కనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని ఇచ్చారు. మోదీ పాలనకు ముగింపు పలుకడంతోనే రైతులకు విముక్తి కలుగుతుందనేది వాస్తవం.