ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్కు సాధారణ పరిపాలనా బాధ్యతను అప్పగించడం భారత ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసినట్టేనని బుద్ధిజీవులు భావిస్తున్నారు. ఈ చర్యలను కాంగ్రెస్ ఖండించకపోగా, కొంతమంది కాంగ్రెస్ నాయకులు సమర్థించడం శోచనీయం.
భారతదేశ సమాఖ్య స్ఫూర్తి (Federalism) అనేక అంశాల్లో నేడు ఒత్తిడికి లోనవుతున్నది. రాజ్యాంగ, ఆర్థిక, రాజకీయ, ఎన్నికల ప్రక్రియలో ఈ ఒత్తిడిని మనం నిత్యం గమనిస్తున్నాం. భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా రాజ్యాంగంలోని ఆర్టికల్-1 అభివర్ణించింది. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యగా రాజ్యాంగ పరిషత్ చర్చల్లో పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలు సహకార సమాఖ్య విధానమే దేశ రాజకీయ విధానంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. వారి ఆశయాలకు విరుద్ధంగా సహకార సమాఖ్య-సంఘర్షణ సమాఖ్య మారడం మనం చూస్తున్నాం.
2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ 58th నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్లో, మన్మోహన్సింగ్ ప్రభుత్వం భారత రాజ్యాంగం సూచించిన సమాఖ్యవాదానికి తూట్లు పొడుస్తున్నదని ధ్వజం ఎత్తారు. రాష్ర్టాల పరిపాలనలో కేంద్రం అనవస ర జోక్యం చేసుకుంటున్నదని, రాష్ర్టాల గవర్నర్లు తమ పరిధిని దాటి, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే కేంద్ర ప్రభుత్వం సర్కరీయ కమిషన్ నివేదికను, పుంచి కమిషన్ నివేదికను అమలుపరచాలన్నారు. రాజ్యాంగంప్రతిపాదించిన సహకార సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేం ద్రం ప్రవేశపెట్టిన బిల్లులు, రాష్ర్టాల హక్కులను కాలరాసేవిధంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ర్టా ల అవసరాలకనుగుణంగా Flexibleగా లేవని, అందువల్లనే దేశం అభివృద్ధి చెందవలసిన మేరకు అభివృద్ధి చెందలేదని మోదీ నాడు అభిప్రాయపడ్డారు.
దేశ సమాఖ్య స్ఫూర్తి కోసం కృషిచేస్తానని 2014 ఎలక్షన్ల సందర్భంగా అనేక పర్యాయాలు మోదీ హామీ ఇచ్చారు. తాను ప్రధాని అయిన వెంటనే ప్లానింగ్ కమిషన్ను రద్దుచేసి, దాని స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకువచ్చారు. తెచ్చే సందర్భంలో టాప్-డౌన్ వ్యవస్థగా ప్లానింగ్ కమిషన్ పనిచేసేదని, తాను తీసుకువచ్చిన నీతి ఆయోగ్, బాటమ్-అప్డిజైన్లో తయారు చేయబడ్డ వ్యవస్థ అని గొప్పగా చెప్పుకొచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ జనరల్ బాడీ మీటింగ్కు దేశంలోని పది మంది ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. నీతి ఆయోగ్ సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నదని, రాష్ర్టాల అభిప్రాయం నీతి ఆయోగ్ పరిగణనలోకి తీసుకోవడం లేదని, వారు మీటింగ్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆ ముఖ్యమంత్రులు అభిప్రాయపడటం గమనార్హం. ప్రధాని గతంలో చెప్పిన విషయానికి తన ప్రభుత్వం నడిచే విధానానికి భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నదని ఈ విషయంతో స్పష్టమవుతున్నది.
ఇంతేకాకుండా మోదీ ప్రభుత్వం రాష్ర్టాలను ఆర్థికంగా దెబ్బతీసే విధంగా తన పరిపాలనను కొనసాగిస్తున్నది. జీఎస్టీ తీసుకురావడంతో రాష్ర్టాలు తాము టాక్స్ వేసే హక్కును కోల్పోయాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటా కొన్ని పథకాల్లో 90 శాతం, కొన్నింటిలో 75 శాతం, కొన్ని మొత్తం కేంద్ర నిధులతో ఉండేవి. 14వ ఫైనాన్స్ కమిషన్ తర్వాత ఎక్కువ నిధులు రాష్ర్టాలకు బదలాయిస్తున్నామనే నెపంతో అత్యధిక కేంద్ర పథకాల్లో, కేంద్ర పభుత్వం వాటా 60 శాతానికి తగ్గించి, రాష్ర్టాల ఆర్థిక వెసులుబాటు హరించింది. అంతేకాకుండా సెస్ను అమాంతంగా పెంచేసి కేంద్రం తను ఆర్థికంగా బలపడుతూ.. రాష్ర్టాలను బలహీనపరుస్తున్నది. 2014కు ముందు మొత్తం కేంద్ర రెవెన్యూలో సెస్ సమారు 10 శాతంగా ఉంటే నేడు అది 20 శాతంగా ఉన్నది. మోదీ ప్రభుత్వం ఆర్థిక కేంద్రీకరణకు పాలుపడుతున్నదని, ఇది భారత ఆర్థికవ్యవస్థకు మంచిది కాదని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు.
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను, గవర్నర్ వ్యవస్థను ఉపయోగించి తొమ్మిదేండ్ల మోదీ పాలనలో 8 రాష్ర్టాల్లో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోయడం మనం చూశాం. ఈ విధంగా మోదీ తొమ్మిదేండ్ల పాలన కొనసాగుతున్నది. రాజ్యాంగ పరిరక్షణకు, రాష్ర్టాల హక్కులను కాపాడడం కోసం కాంగ్రెస్ తన వంతు కృషి ఏ మాత్రం చేయలేదని, రాష్ర్టాల హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ విఫలం చెందినదని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు.
భారత సమాఖ్యవాదానికి మొదటి విఘాతం 1959లో కేరళ ప్రజలచే ఎన్నుకోబడిన నంబూద్రి పాద్ ప్రభుత్వం పడగొట్టడం కోసం ఆర్టికల్ 356 ఉపయోగించారనేది చారిత్రక సత్యం. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో 8 పర్యాయాలు ఆర్టికల్ 356 వాడారు. ఈ రాజ్యాంగ-సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించిన కళంకం, భారత మొదటి ప్రధాని, గొప్ప దార్శనికుడు నెహ్రూకు అంటక తప్పదు. ఇక ఇందిరాగాంధీ తాను ప్రధానిగా ఉన్న సమయంలో సుమారు 50 సార్లు ఆర్టికల్-356ను వినియోగించారు. మోదీ తన తొమ్మిదేండ్ల కాలంలో ఏటా సుమారు ఒకసారి చొప్పున ఆర్టికల్ 356ను ప్రయోగించారు. అంతేకాకుండా అనేక పద్ధతుల్లో ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, ఇబ్బంది పెట్టడం, ప్రతీకార దాడులు మనం నిత్యం చూస్తున్నాం.
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఉమ్మడి జాబితాను పెంచుతూ పోయి రాష్ర్టాల హక్కులను కాలరాయ డంలో సమ ఉజ్జీలుగా ఉన్నాయని అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానం ఉండకూడదని అభిప్రాయపడ్డారు. అధికార కేంద్రీకరణ వల్ల రాజ్యాంగం ప్రతిపాదించిన ఫెడరల్ వ్యవస్థ ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. భారతదేశ వైరుధ్యాలపై చర్చ జరిగి వాటిని పరిరక్షించడంలోనే సమాఖ్య స్ఫూర్తి పరిరక్షణ జరుగుతున్నది. రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య స్ఫూర్తిని తిరిగి పొందాలంటే, ఎన్నికల రాజకీయాలకతీతంగా కేంద్రం వ్యవహరించవలసి ఉంటుంది.
– పెండ్యాల మంగళాదేవి