రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ముగిశాయి. ఇక అభ్యర్థుల ప్రకటనే ఆలస్యమన్నట్టుగా క్యాడర్లో మరింత ఉత్సాహం నింపే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఆలోచించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
రాబోయే కాలంలో రాష్ట్రంలో పాలన ఎవరు చేయాలనే అంశాన్ని నిర్ణయించుకోవడంలో ప్రజలు విజ్ఞత, తెలివి, పోరాట, ఉద్యమస్ఫూర్తి ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఎన్నికలు తెలంగాణ చరిత్రకు కీలక మలుపుగా మారనున్నాయి. తొమ్మిదేండ్ల కిందట ఏర్పడిన తెలంగాణ పరిపాలన, రాజకీయంగా అనేక అవరోధాలు అధిగమించి… అభివృద్ధి, సంక్షేమం వైపు అభ్యుదయకరమైన రాష్ట్రానికి గట్టి పునాది వేశారు తెలంగాణ దార్శనికుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదే పంథా, ఇదే వేగంతో… రాష్ట్రం ఆర్థిక, రాజకీయ, సామాజిక, సంక్షేమ, అభివృద్ధి, అస్తిత్వం స్థిరీకరణ జరగాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ స్థిరీకరణ కేసీఆర్ తప్ప మరెవ్వరూ చేయలేరు. ఆయకట్టు స్థిరీకరణకు వ్యూహాత్మక నీటి ప్రాజెక్టులు ఎంత ముఖ్యమో.. భౌగోళిక తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సంక్షేమ, అభివృద్ధి, అస్తిత్వం స్థిరీకరణకు కేసీఆర్ నాయకత్వం అంతే ముఖ్యం. తెలంగాణను స్థిరీకరణ చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉన్నది.
ఆంధ్రాలో కృష్ణా, గోదావరి డెల్టాల ప్రాంతాల్లో ఆయకట్టు స్థిరీకరణ కోసం వ్యూహాత్మక ప్రాజెక్టులు, బ్యారేజీలు కట్టడంతో వందల ఏండ్లయినా అవి పంటలతో కళకళలాడుతూ ఉన్నాయి. అట్లాగే తెలంగాణలో కూడా స్థిరీకరణ జరగాలంటే పరిపాలన కేసీఆర్ చేతుల్లోనే ఉండాలి, ఉండితీరాలి. అస్తిత్వ స్థిరీకరణ లేకపోతే తెలంగాణ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ స్థిరీకరణ కోసం ప్రజలు తెలివితో, ఉద్యమస్ఫూర్తితో ఓట్లు
వేయాల్సిన అవసరం ఉన్నది. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ గతంలో ఎన్నడూ లేనటువంటి ఫలితాలు చూసింది. ఈ ఫలితాలు ఇలాగే కొనసాగాలంటే కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కేసీఆర్ విజయం కేసీఆర్ కోసం కాదు. అది తెలంగాణ స్థిరీకరణకు చాలా అవసరం.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే ఆ పార్టీలకు రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న నాయకులకు తెలంగాణ పట్ల ప్రేమ, తెలంగాణ అభివృద్ధి పట్ల ఒక వ్యూహం ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రధాన కారణం ఇప్పుడున్నటువంటి నాయకులు ఇద్దరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నది శూన్యం. రాజకీయ వ్యవహారశైలి, అధికార వ్యామోహం తప్ప, వారిలో తెలంగాణ అభివృద్ధి వ్యూహం కనిపించటం లేదు. అంతేకాదు, తెలంగాణ ఏర్పడిన కొత్తలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత క్రియేట్ చేయటానికి ఎమ్మెల్యే కొనుగోలు కోసం రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు నిరంతరం తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించే విధంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నది. ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అదే ధోరణితో తెలంగాణ లో మత చిచ్చు పెట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అదనపు నిధులు తీసుకువచ్చిన దాఖలాలు మాత్రం లేవు. లేకపోగా, 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో ఏ1గా ఉన్నారు. అంటే రెండు జాతీయపార్టీల రాష్ట్ర అధ్యక్షులు వేర్వేరు నేరపూరిత కేసుల్లో ఏ1గా ఉన్నారు.
కేసీఆర్ 2001లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉద్యమ నాయకుడిగా.. 2014 నుంచి పరిపాలనా అధిపతిగా ఉంటూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ వ్యతిరేకులు కేసీఆర్పై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేశారో.. 2014 తర్వాత కూడా అవే విమర్శలు చేస్తున్నారు తప్ప, తెలంగాణ అభివృద్ధి నమూనాను కేసీఆర్ కంటే గొప్పగా ప్రజల ముందు పెట్టలేకపోతున్నారు. ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ పలు రంగాల్లో ఎలా అభివృద్ధి చెందిందనే అంశాలపై కేంద్రంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు నిరంతరం నివేదికలు ఇస్తున్నాయి. దీన్ని మరింత మెరుగుపరచుకోవటం లేదా, మరింత స్థిరీకరించుకోవాలంటే తెలంగాణ సాధించి పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ పాలన ఉండాలి.
తెలంగాణ స్థిరీకరణ జరగకపోతే తెలంగాణ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. ఒకవైపు ఉద్యమ, అభివృద్ధి నాయకుడు, మరోవైపు నేరపూరిత కేసుల్లో ఏ1 నిందితులు… అందుకే ఆరు నెలల్లో జరిగే ఎన్నికల యుద్ధంలో తెలంగాణ అస్తిత్వ స్థిరీకరణ కేసీఆర్తోనే సాధ్యమని బలంగా చెప్పాలి. ఆయకట్టు స్థిరీకరణ కోసం నీళ్లు ఎంత అవసరమో రైతులకు తెలుసు.
22 ఏండ్లుగా తెలంగాణ ప్రజలు పలు సందర్భాల్లో రాజకీయంగా తెలివైన నిర్ణయమే ఓట్ల ద్వారా తీసుకుంటున్నారు. తెలంగాణ మీద ప్రేమ రాష్ట్రంలో కేసీఆర్కు తప్ప ఏ రాజకీయ పార్టీ అధ్యక్షులకు ఉన్నట్టు కనిపించటం లేదు.
నర్రా విజయ్కుమార్: 90521 16316
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)