భారత రాజ్యాంగంలోని 124, 217, 222 అధికరణలు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ అధికారాన్ని రాష్ట్రపతికి కట్టబెట్టాయి. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఉంటాయి.
నియామకం లేదా బదిలీ ప్రక్రియలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల (consultati on) ఆవశ్యకతను రాజ్యాంగం చెబుతున్నది. అయితే, 1993లో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు సంప్రదింపులు అనే పదానికి వివరణ ఇచ్చారు. ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్రపతి జరిపే సంప్రదింపులు మొక్కుబడి కాదని, సుప్రీంకోర్టు సమ్మతి (concurrence)తో మాత్రమే నియామకాలు, బదిలీలు ఉండాలని ఈ ధర్మాసనం తీర్పు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు సలహాకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి కట్టుబడి ఉండాలి.
మెజారిటీ సభ్యుల ధర్మాసనం తీర్పు ఆధారంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో కూడిన ‘మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ ’ రూపొందింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మొదటి నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి చేపట్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం; మొదటి ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి చేపట్టే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీల ప్రతిపాదనలు కేంద్ర న్యాయ శాఖ ద్వారా ప్రధానమంత్రికి చేరుతాయి. ఈ వ్యవస్థనే సుప్రీంకోర్టు కొలీజియం అని అంటున్నారు. కొలీజియం చేసే ప్రతిపాదనల్లో ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవటం మినహా తిరస్కరించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి లేదు. వాటిపై తప్పనిసరిగా రాష్ట్రపతి ఉత్తర్వుల ముద్ర వేయించాల్సిందే. కొలీజియం ప్రక్రియను సమర్థించేవారు, వ్యతిరేకించేవారు ఉన్నారు.
ఎటువంటి చట్టం లేకుండా, ప్రజల చేత చట్టసభలకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు, మంత్రుల ప్రమేయం లేకుండా, కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని లాక్కొని, తామిచ్చిన తీర్పును ఆధారం చేసుకొని, సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతి నామమాత్రపు ఉత్తర్వుల కొరకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపటాన్ని అధికారగణం జీర్ణించుకోలేక పోతుందనేది వాస్తవం.
ఎటువంటి చట్ట నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు లేకుండా, న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకోవటం, బదిలీ చేసుకోవటం అప్రజాస్వామికమని, మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్కు చట్టబద్ధత లేదని, పైగా పారదర్శకత, సామాజికన్యాయం లోపిస్తున్నదనేది కొంతమంది అభిప్రాయం. దీనికి విరుద్ధంగా కొలీజియంను సమర్థించే వాళ్లు కూడా తక్కువేమీ లేరు. నిష్పాక్షిక తీర్పులను వెలువరించాల్సిన న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల ప్రక్రియపై అధికారాల్ని ప్రభుత్వానికి దఖలు పరిస్తే, రాజకీయ నాయకుల జోక్యానికి ఆస్కారం ఉంటుందని, తద్వారా తీర్పుల్లో నాణ్యత కొరవడుతుందన్నది వారి వాదన. సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని అందరు వ్యక్తులకు, సంస్థలకు, ప్రభుత్వాలకు వర్తిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను తుచ తప్పకుండా అమలు పరచాల్సిందేనని వీరి అభిప్రాయం.
కొలీజియం విధానాన్ని రద్దు చేయాలనే భావనతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన అధికరణలకు రాజ్యాంగ సవరణలను ప్రతిపాదిస్తూ ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ చట్టాన్ని 2015 ఏప్రిల్ 13 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఆ చట్టాన్ని సవాలు చేస్తూ వేసిన కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు.. చట్టం ప్రతిపాదించిన నియామకాల కమిటీలోని ఇద్దరు ప్రముఖుల నేపథ్యం, అర్హతలను నిర్వచించలేదని, చట్టం లోపభూయిష్టంగా ఉన్నదని తీర్పు చెప్తూ 2015 అక్టోబర్ 16న ఆ చట్టాన్ని కొట్టివేసింది. చట్టం లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పిందే తప్ప ఈ చట్టాన్ని తీసుకువచ్చే అధికారం పార్లమెంటుకు లేదని చెప్పలేదు. ఈ మేరకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ తీర్పుకు అనుగుణంగా పకడ్బందీ చట్టాన్ని తీసుకురావచ్చు. అప్పటిదాకా 1993లో సుప్రీంకోర్టు వెలువరించిన జడ్జిమెంట్ లా కు అనుగుణంగా తెచ్చిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ను అమలు చేయాల్సిందేనని, కొలీజియం ప్రతిపాదించిన నియామకాలకు పచ్చ జెండా ఊపాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూనే ఉన్నది.
ఇలా ఉండగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ప్రత్యక్ష నియామకం, పదోన్నతి ద్వారా చేపట్టే విధానంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నాయని, 25 నుంచి 30 ఏండ్ల పాటు న్యాయమూర్తిగా గడించిన అనుభవం, యోగ్యత ఉన్న జిల్లా జడ్జిలు ఉన్నా కూడ తెలుగు రాష్ర్టాల్లో వారికి కేవలం 33 శాతం మాత్రమే ఇచ్చి, 67 శాతం ప్రత్యక్ష నియామకాలకు ప్రాధాన్యతనిస్తున్నారని, రెండు వర్గాల వారికి సమకోటా ప్రాధాన్యత కల్పిస్తే న్యాయం జరుగుతుందని కొంతమంది జిల్లా జడ్జిలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు తగిన మార్గదర్శకాలతో నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
తడకమళ్ళ మురళీధర్: 98485 45970
(వ్యాసకర్త: విశ్రాంత జిల్లా జడ్జి)