HomeEditpageThe Attack On The Indian Consulate In San Francisco Once Again Proved That Khalistani Extremism Can Cut Corners
ఒక మోదీ, అనేక వైఫల్యాలు
దేశంలోని కశ్మీర్, మణిపూర్, పంజాబ్.. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా ఎంతసేపు మతాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడ టం తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రధాని మోదీలో ఏ మాత్రం కనిపించదు.
బుసలుకొడుతున్న ఖలిస్తానీ తీవ్రవాదం ఎంతకైనా తెగిస్తుందని శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్పై జరిగిన దాడి మరోసారి నిరూపించింది. మన దౌత్య కార్యాలయాలపై ఈ తరహా దాడులు గతంలోనూ జరిగాయి. అయితే, తీవ్రవాదులు ఇంతలా రెచ్చిపోవడం మోదీ హయాంలో కేంద్ర వైఫల్యాల పరంపరకు అద్దం పడుతున్నది.
దేశంలోని కశ్మీర్, మణిపూర్, పంజాబ్.. ఇలా ఏ రాష్ట్రంలో చూసినా ఎంతసేపు మతాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూడ టం తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రధాని మోదీలో ఏ మాత్రం కనిపించదు. కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న మోదీ సర్కార్ వరుస వైఫల్యాలతో భారతీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది.
సోమవారం అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన నూటికి నూరుపాళ్లు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్నే సూచిస్తున్నది. ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో అంతమైపోయిందనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం తిరిగి ఊపిరిపోసుకోవడం వెనుక కేంద్రం నిర్లక్ష్యం, నిర్లిప్తత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
గత నెల 19న వ్యాంకోవర్లో ఖలిస్తాన్ తీవ్రవాద గ్రూప్ అయిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్సింగ్ నిజ్జార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. దీంతో ఖలిస్తాన్ మద్దతుదారుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఖలిస్తాన్ మద్దతుదారులు ఇండియాకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు.
ఇండియాలోని సిక్కుల కోసం ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కొందరు సిక్కులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ బ్లూస్టార్తో ఖలిస్తాన్ వేర్పాటువాదం ముగిసినట్టేనని అందరూ భావించారు. అయితే ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ పేరుతో అమృతపాల్ సింగ్ మళ్లీ ఖలిస్తాన్ ఉద్యమాన్ని రగిల్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. చాలాకాలంగా తను కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు చూసీచూడనట్టే వ్యవహరించాయి. అమృతపాల్ సింగ్, ఆయన సహచరులు చేసిన పనులు హిందువులలో అభద్రతా భావాన్ని సృష్టించాయి. అయి నా కేంద్రం స్పందించలేదు. దీనికి కారణం హిం దూ సమాజం ఎటూ బీజేపీ పక్షాన చేరుతుందన్న విశ్వాసం. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం పంజాబ్లో ఆప్ అధికారంలో ఉన్నది. కనుక సిక్కు, హిందువుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ర్టానికి నిప్పు పెట్టి ప్రయోజనం పొందాలని బీజేపీ అనుకోవడమే అసలు సమస్య.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేలా సిక్కులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఏండ్ల తరబ డి సిక్కు సమాజాన్ని బుజ్జగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కొన్నేండ్లుగా సిక్కు మతానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాలకు తరచూ హాజరవుతున్నారు. మొఘల్ సామ్రాజ్యంలో సిక్కులపై జరిగిన వేధింపులను సందర్భం వచ్చినప్పుడల్లా ఉదహరిస్తూ, హిందువులను రక్షించడానికి సిక్కు గురువులు చేసిన త్యాగాలను ఉటంకిస్తూనే ఉన్నా రు. భారత ప్రభుత్వం 2022 డిసెంబర్ 26న ఢిల్లీలోనూ, విదేశాల్లోనూ ‘వీర్ బాల్ దివస్’ని జరిపిం ది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నా రు. అంటే ఎంతసేపూ ఆ వర్గాల మధ్య చిచ్చుపెట్టడమే తప్ప శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించకపోవడం మోదీ వైఖరిని స్పష్టం చేస్తున్నది.
నిజానికి భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తాన్ వాదుల దాడి ఇది మొదటిసారి కాదు. కెనడాలో జూన్ 8న ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత రాయబార కార్యాలయం ఎదుట, భారత జాతీయ పతాకాన్ని దహనం చేస్తామని కూడా ప్రకటించారు. ర్యాలీకి సంబంధించిన పోస్టర్లలో ఒట్టావాలోని భారత రాయబారి, టోరంటోలోని కాన్సుల్ జనరల్కు బెదిరింపులు కూడా పంపినట్లు సమాచారం. గత మార్చి 23న భారత రాయబార కార్యాలయంపై దాడి చేశారు. అదే నెలలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయంపై కూడా దాడి జరిగిన సంగతి తెలిసిందే. రెండు నెలల అనంతరం ఈ తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇలా దాడులు జరుగుతున్నప్పటికీ కేంద్రం ఆయా దేశాలకు తన నిరసనను గట్టిగా తెలియజేయలేదన్న అపవాదు ఉండనే ఉన్నది. అందుకే మళ్లీ మళ్లీ దాడులు జరుగుతున్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం.
ఇక మంటల్లో మాడిపోతున్న మణిపూర్ రాష్ట్రంలోనూ శాంతిని నెలకొల్పడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మణిపూర్ రాష్ట్రంలో ప్రధానంగా మైతీ, నాగా, కుకీ జాతుల వారుంటారు. మైతీలలో ఎక్కువ శాతం హిందువులు, కొంతమంది ముస్లింలు ఉన్నారు. నాగా, కుకీలలో క్రిస్టియన్లు అధికం. నాగా, కుకీలను ప్రభుత్వం షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించింది. ఇక, మైతీలు రాష్ట్ర జనాభాలో 53 శాతం. జనాభా పరంగానే కాదు రాజకీయ పరంగా కూడా మైతీలది రాష్ట్రంలో పైచేయి. రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న మైతీలు చాలా ఏండ్లనుంచి తమకు ఎస్టీ హోదా కావాలని పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు మైతీలు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీనిపై హైకోర్టు కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. అయితే, కోర్టు ఆదేశాలను అప్పటికే ఎస్టీలుగా ఉంటున్న వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో గొడవ మొదలైంది. అది ముదిరిపోయి ఇండ్ల దహనం, కనిపిస్తే కాల్చివేత వరకు వెళ్లింది. వందల మంది మరణించారు. అయితే ఇక్కడ కూడా ప్రజల మధ్య సయోధ్యను కుదర్చాల్సిన కేంద్రం రాష్ట్రంలో పైచేయిగా ఉన్న మైతీల పక్షాన నిలబడింది. ముస్లింలు, క్రిస్టియన్లు అధికంగా ఉన్న నాగా, కుకీల మీద దాడులకు పురిగొల్పింది. దీంతో అక్కడ అగ్గి మరింత రాజుకొని హింస పెచ్చరిల్లుతున్నది.
కశ్మీర్ విషయంలోనూ అదే తీరు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో శాంతిని పునఃస్థాపించగలిగామని కొంతకాలంగా కేంద్రం గొప్పలు చెప్పుకుంటున్నది. తమ నిర్ణయంతో కశ్మీరీ పండిట్లు మళ్లీ తమ స్వస్థలాలకు చేరుకున్నారనీ, ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్తూ వస్తున్నది. కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది అందుకు విరుద్ధంగా ఉన్నది.
పండిట్లు నిస్సహాయులుగా తిరిగి కశ్మీరును వదిలి వెళ్లిపోతున్నారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి కృషి చేయటం కంటే అణచివేత ధోరణిని అవలంబించటమే. ఉగ్రవాదులు, మిలిటెంట్లతో పాటు మీడియాను, అక్క డి ప్రజలను కూడా తొక్కిపెట్టేందుకు కేంద్రం ప్రయత్నించింది. ఫలితంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లి మిలిటెంట్లు మళ్లీ విజృంభించడానికి కారణమైంది. దీంతో అటు ప్రభు త్వం, ఇటు ఉగ్రవాదుల మధ్య సామాన్య ప్రజలు బలిపశువులవుతున్నారు.