ఢిల్లీలో నిర్మిస్తున్న భారత నూతన పార్లమెంటు భవన సముదాయం (సెంట్రల్ విస్టా)కు భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పంపి వారం రోజులు గడిచినా ఢిల్లీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఢిల్లీ నుంచి అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి అని మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలు, రాష్ర్టాల శాసన సభల తీర్మానాలను సీరియస్గా తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ, సామాజిక న్యాయ సూక్తులు వల్లించే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, దళిత బహుజనుల కోసమే ఉన్నామని చెప్పే బహుజన సమాజ్, సమాజ్ వాదీ వగైరా పార్టీలు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు అందరూ ఉండేది ఢిల్లీలోనే. అయినప్పటికీ ఏ పార్టీ కూడా ఇప్పటివరకు, అధికారికంగా స్పందించలేదు.
ఇది కేవలం దళితులను దగ్గర చేసుకోవడం కోసమో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ పేరుకు సంబంధించిన ప్రతిపాదన దళిత వర్గాల నుంచి పెద్దగా రాలేదు. దీనికి సంబంధించిన ఎలాంటి చర్చ కూడా దళిత సమాజంలో జరుగలేదు. అయినప్పటికీ కేసీఆర్ శాసనసభ తీర్మానం చేసి సాహసోపేత నిర్ణయం తీసుకోవడమే కాకుండా, తనకుతానుగా తెలంగాణ సచివాలయ నామకరణ నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
మిగతా రాష్ర్టాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా దీనిపై పెదవి విప్పలేదు. ఇది ఇప్పుడు దేశంలో ఉన్న మూస రాజకీయ ధోరణిని సూచిస్తోంది. ఆయా రాజకీయ పార్టీలకు ఉన్న సామాజిక వైఖరులను, ధోరణులను తెలుపుతున్నది. నిరంతరం అంబేద్కర్ నామజపం చేసేవారు, సామాజిక న్యాయ సిద్ధాంతాలు వల్లించేవారు కేవలం తమ రాజ్యాధికారం కోసం మాత్రమే ఆలోచిస్తారు తప్ప, నిజంగా అంబేద్కర్ మీద గౌరవమో, ఆయన సూచించిన మార్గం మీద నమ్మకమో ఉండి కాదన్నది దీనిని బట్టి మరోసారి రుజువయ్యింది. అయితే తెలంగాణ శాసన సభ తీర్మానం పట్ల దేశవ్యాప్తంగా దళిత సామాజిక వర్గాలు మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. స్వయంగా బాబాసాహెబ్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ మొదలు ప్రముఖ అంబేద్కర్ వాదులు, దళిత నాయకులు కేసీఆర్ నిర్ణయం పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే సీఎం కేసీఆర్ ప్రశంసల కోసమో, ప్రతిస్పందనల కోసమో పని చేసే మనిషి కాదు. ఏదో ప్రయోజనాన్ని ఆశించి నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకుడు కాదు. ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంటే, దానివల్ల మంచి జరుగుతుందని అనుకుంటే, అది ఎంత కష్టసాధ్యమైనదైనప్పటికీ వెంటనే ప్రకటించి తీరుతారు. అంతేకాదు ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చేవరకు విశ్రమించరు. పార్లమెంటుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని శాసనసభ తీర్మానం చేసిన మరుసటి రోజే ఆయన తనకు తానుగా మరో సాహసోపేతమైన, విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. హైదరాబాద్లో నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయానికి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎవరికీ ఊహకు కూడా అందని నిర్ణయం ఇది. కేవలం కేసీఆర్ మనసుకు తట్టిన మేరకు తీసుకున్న నిర్ణయం. అంతేకాదు అత్యంత సమంజసమైన నిర్ణయం కూడా. ఇది కేవలం దళితులను దగ్గర చేసుకోవడం కోసమో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమో అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ పేరుకు సంబంధించిన ప్రతిపాదన దళిత వర్గాల నుంచి పెద్దగా రాలేదు. దీనికి సంబంధించిన ఎలాంటి చర్చ కూడా దళిత సమాజంలో జరుగలేదు. అయినప్పటికీ కేసీఆర్ శాసనసభ తీర్మానం చేసి సాహసోపేత నిర్ణయం తీసుకోవడమే కాకుండా, తనకుతానుగా తెలంగాణ సచివాలయ నామకరణ నిర్ణయాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
పేరులో ఏముంది?
సచివాలయానికైనా, పార్లమెంటుకైనా పేరు పెట్టినంత మాత్రాన దళితులకు ఒరిగేదేముంది అని కొందరు మాట్లాడుతున్నారు. పేరు పెట్టినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందా అనీ అడుగుతున్నారు. ఆశ్చర్యకరంగా కొందరు దళిత, బహుజన సమాజ నేతలు కూడా అంబేద్కర్ పేరు పెట్టినంత మాత్రాన సరిపోతుందా, ఆశయాల సంగతి ఏమిటని అడుగుతున్నారు. మంచిదే, కానీ అంబేద్కర్ దళితుడు కాబట్టి పేరు పెడుతున్నామని అన్నదెవరు? రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మంత్రి కేటీఆర్ మాట్లాడిన ప్రసంగాన్ని మరోసారి వినండి. ఆయన అంబేద్కర్ దళితుడు కాబట్టి ఈ పేరు పెట్టాలని కోరలేదు. అంబేద్కర్ను ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన ద్రష్టగా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రాయడమే కాదు, దేశ పరిపాలనా వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసిన మహాత్ముడిగా కీర్తించారు. అంబేద్కర్ వినా ఈ దేశానికి మరోమార్గం లేదని శాసనసభ సాక్షిగా శషభిషలు లేని విస్పష్ట ప్రకటన చేసి ఉన్నారు. కేటీఆర్ చెప్పింది ముమ్మాటికీ నిజం. అంబేద్కర్ పుట్టుకతో దళితుడు అయి ఉండవచ్చు, అంటరానితనాన్ని, వివక్షను అడుగడుగునా అనుభవించి ఉండవచ్చు. అస్పృశ్యత లేని, అసమానతలు లేని భారతదేశం కోసం గొంతెత్తి మాట్లాడి ఉండవచ్చు. కానీ ఆయన అక్కడితో ఆగిపోలేదు. కేవలం కులానికి మాత్రమే పరిమితం కాలేదు, నిజానికి ‘కులం పునాదుల మీద ఒక నీతినీ, జాతినీ నిర్మించలేమని’ తెగేసి చెప్పిన వ్యక్తి అంబేద్కర్. అలాంటిది అంబేద్కర్ను కులానికి పరిమితం చేసి చూడడం అయన గౌరవాన్ని తగ్గించడం. ఆయన పరిధిని కుదించడం మాత్రమే అవుతుంది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు అదే పని చేశాయి. కాంగ్రెస్ ఆయనను దళితవాడలకు పరిమితం చేసి, విగ్రహమాత్రుడిగా చూసి, దళితులను ఓటు బ్యాంకుగా చేసుకున్నది. అలాగే బీజేపీ దాని భావజాల సంఘపరివారం అంబేద్కర్ ఆలోచనా విధానం, బోధనలు, ప్రసంగాలు ప్రమాదకరమైనవిగానే చూశాయి. అదేవిధంగా దళిత బహుజన పార్టీలు కూడా ఆయనను తమకు మాత్రమే చెందిన వాడుగా ప్రకటించుకుని ఓటుబ్యాంకు రాజకీయాలే చేశాయి. గరీబీ హటావో మొదలు, గడిచిన యాభై ఏండ్లలో రాజకీయ అజెండాలు అంబేద్కర్ను, ఆయన సిద్ధాంతాలను విచ్చలవిడిగా వాడుకుని ఓట్ల కోసం సీట్ల కోసం పనికొచ్చే నినాదంగా మార్చివేశాయి.
కానీ ప్రపంచం ఆయనను అలా పరిమితం చేసి చూడలేదు. గాంధీకి, నెహ్రూకు ఇంకెవరికైనా వారు వారు తమ జీవితాల్లో చేసిన త్యాగాలకు, పనులకు మాత్రమే విలువా, గౌరవం. కానీ అంబేద్కర్కు ఆయన ప్రతిపాదించిన మార్గానికి, సిద్ధాంతాలకు, ప్రాపంచిక దృక్పథానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గౌరవం లభిస్తోంది. ఆయన గతించి ఆరు దశాబ్దాలు దాటినప్పటికీ ఆయన ప్రభ తగ్గడం కాదు కదా నానాటికి విస్తరించి, విశ్వవ్యాప్తం అవుతోంది. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఐక్యరాజ్యసమితి.. అంబేద్కర్ను ప్రపంచానికి ఒక ఆశాదీపంగా ప్రకటించింది. అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారత కోసం రాబోయే కాలంలో తాము రూపొందించిన ప్రణాళికకు అంబేద్కర్ సమానత్వ సిద్ధాంతమే స్ఫూర్తిగా పేర్కొంది.
విదేశాలకు వెళ్లి అర్థశాస్త్రంలో పీహెచ్డీ చేసిన మొట్టమొదటి భారతీయుడు అంబేద్కర్. అయన చదువుకున్న అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ‘కాలానికంటే ముందుండి, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన’ అరుదైన తమ విద్యార్థుల్లో అంబేద్కర్ను అగ్రగణ్యుడిగా గుర్తించింది. అంతేకాదు ఆయన విగ్రహాన్ని తమ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ఏర్పాటు చేసింది. ఆ విగ్రహం కింద ‘ఆధునిక భారత జాతి వ్యవస్థాపక పితామహుడు’ అని రాసి పెట్టింది.
నిజంగానే అంబేద్కర్ ఆధునిక భారత జాతి పితామహుడు. ఆయన లేని రాజ్యాంగాన్ని ఊహించలేము. ఈ మాట భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొట్టమొదటి రాజ్యాంగప్రతిని స్వీకరించిన నాడే చెప్పారు. అంబేద్కర్ కృషి వల్ల మాత్రమే మనకు పటిష్ఠమైన రాజ్యాంగం వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగ కృషి 1946 రాజ్యాంగసభతో మొదలు కాలేదు. మంత్రి కేటీఆర్ శాసనసభలో చెప్పినట్టు 1919లో మౌంట్ ఫోర్డ్ కమిటీతో మొదలయ్యింది. భారతదేశానికి ఎటువంటి పరిపాలన సంస్కరణలు కావాలో తెలుసుకోవడానికి వచ్చిన ఆ కమిటీ అప్పుడే అమెరికాలో చదువుకుని వచ్చిన అంబేద్కర్ను కలిసింది. ఆయన భారతీయులందరికీ ఓటు హక్కు కావాలని అడిగారు. అప్పటికి దేశంలో విద్యావంతులకు, ప్రభుత్వ అధికారులకు, పన్నులు కట్టే సంపన్నులకు అందులోనూ పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఓటు ద్వారానే మనిషికి విలువ ఉంటుందని వాదించిన మొట్టమొదటి మేధావి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ఉండాలన్నది ఆయన సిద్ధాంతం. ఇవాళ మనదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ నిలబడడానికి ప్రాథమిక పునాది ఈ ఓటు హక్కే. 1928లో వచ్చిన సైమన్ కమిషన్ ముందు కూడా అంబేద్కర్ తన వాంగ్మూలం ఇచ్చారు. భారతదేశానికి ఎలాంటి పరిపాలన అవసరమో విడమరచి చెప్పారు. ఆయన వాదన విని ముగ్ధులైన సైమన్ కమిషన్ ఆ వాదనలను బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదించింది. దీనివల్లే ఆయనను లండన్లో జరిగిన రౌండ్టేబుల్ సమావేశాలకు పిలిచి, భవిష్యత్ భారత రాజ్యాంగం ఎలా ఉండాలో అడిగి తెలుసుకోవడమే కాదు, ఆయన రాసి ఇచ్చిన అంశాలనే 1935 రాజ్యాంగచట్టంలో చేర్చారు. అలా కూడా ఆయన మొదటి రాజ్యాంగ నిర్మాతనే.
అంబేద్కర్ కృషి వల్లే ఇప్పటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ రూపొందింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భావన, రాష్ర్టాల హక్కులు-వాటాలు, పరిపాలన, ప్రజాప్రాతినిధ్య నియోజకవర్గాలు, ఎన్నికల విధానం, బడ్జెట్ వ్యవస్థ, వనరుల పంపిణీ.. ఇట్లా మొత్తంగా రాజ్యంగచట్టం స్వరూపాన్ని రూపొందించింది డాక్టర్ అంబేద్కర్. బహుశా అందుకే సీఎం కేసీఆర్ పార్లమెంటుకు అంబేద్కర్ పేరు ప్రతిపాదించారు.
విలువల విధ్వంసం
రాజ్యాంగ ప్రతిని అందజేసిన నాడు అంబేద్కర్ మాట్లాడుతూ.. ‘ఈ రాజ్యాంగాన్ని ఎవరి కోసమైతే రాశామో వారి ప్రయోజనాలను ఈ పార్లమెంటు నెరవేర్చనప్పుడు ప్రజలు తిరగబడి ఈ వ్యవస్థనే కుప్పకూలుస్తారు సుమా!’ అని సున్నితంగా హెచ్చరించారు. ఆయన హెచ్చరికను పట్టించుకోకుండా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే ప్రజల నడ్డి విరిచి, రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసానికి, విలువల హననానికి పాల్పడుతున్నాయి. గత ఏడెనిమిదేండ్లుగా రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం వందరెట్లు పెరిగింది. చివరికి సభాసంప్రదాయాలు, పార్లమెంటరీ విలువలకు కూడా గౌరవం లేకుండా పోయింది. రైతు చట్టాలు, పౌరసత్వాలు, ఆర్థిక చట్టాలు, ప్రజావ్యతిరేక బిల్లులను ప్రజలపై రుద్దడమే కాకుండా, ప్రతిపక్ష పార్టీలకు, ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా పార్లమెంటును నడిపిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఐబీ, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ వంటివి పార్లమెంటుకు మూలస్తంభాలు. వాటిని విచ్చలవిడిగా దుర్వినియోగపరుస్తూ, దేశమంతటికీ ఒక విశ్వాసం కల్పించాల్సిన ప్రభుత్వాలే భయోత్పాతం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంబేద్కర్ ప్రతిపాదించిన రాజ్యాంగ విలువలను పున ప్రతిష్ఠించడం కోసం ఒక ప్రయత్నం అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి, పార్లమెంటు సముదాయానికి కూడా అదే పేరు పెట్టాలని ప్రతిపాదించి సాహసం చేసినందుకు సీఎం కేసీఆర్ను అభినందించాలి.
ఈ చర్యను ఎందుకు సాహసోపేతమైనదని అంటున్నానంటే సాధారణంగా వ్యక్తుల పేర్లు భవనాలు, జిల్లాలకు లేదా పాలనా సంస్థలకు, వ్యవస్థలకు పెట్టడం దేశంలో వివాదం అవుతుంటుంది. అందునా అంబేద్కర్ పేరు పెట్టిన ప్రతిసారీ అది వివాదమే కాదు, హింసకు కారణం కావడం చరిత్ర పొడవునా చూస్తు న్నాం. మహారాష్ట్రలో అంబేద్కర్ స్వయంగా స్థాపించిన విద్యాలయాలకు ఆయన పేరు పెట్టటం వివాదాస్పదమైంది. మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్తో అక్కడి దళితులు, బౌద్ధులు 20 ఏండ్లు పోరాడాల్సి వచ్చింది. నామాంతర ఉద్యమం పేరుతో సాగిన ఈ ఉద్యమం హింసకు, రక్తపాతానికి దారి తీసి, దాదాపు రెండు దశాబ్దాలు కులకుంపటిని రాజేసి, దళితులను సమిధలు చేసింది. అలాగే యూపీలో మాయావతి తన పేరుతో సహా అంబేద్కర్ అన్న పేరుతో ఇతర దళిత జాతి ఉద్ధారకుల పేర్లతో పార్కులు, జిల్లాలు, రహదారులు ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినవాళ్ళు వాటిని నామరూపాలు లేకుండా చేశారు.
మొన్న ఏపీలో అంబేద్కర్ జిల్లా అన్నందుకు అగ్గి మీద గుగ్గిలమై మండిన సందర్భం చూశాం. అగ్రవర్ణ వ్యాపారుల పేర్లు, దళారుల పేర్లు పెట్టినా భరిస్తారు కానీ అంబేద్కర్ అంటే సహించని ఈ సందర్భంలో బాజాప్తా అంబేద్కర్ పేరుతో జీవో జారీ చేసి, ఏకంగా రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ కేంద్రాన్నే ఆ మహనీయుడికి అంకితం చేయడం సాహసం కాక మరేమవుతుంది.
ఇలా పేర్లు పెట్టడం ఆ వ్యక్తులకు, వారు చూపిన విలువలకు గౌరవాన్ని ఆపాదించడమే కాదు, వారి మార్గాల్లో నడుస్తామని ప్రతిన పూనడం కూడా. అంబేద్కర్కు సంబంధించినంత వరకు ముమ్మాటికీ దళితులు గర్వించదగిన సందర్భం ఇది. అంతేకాదు, కేసీఆర్ ప్రతిపాదన పట్ల ప్రజల్లో సర్వత్రా ఆమోదం కనిపించడం తెలంగాణ సంస్కారానికి నిదర్శనం. దళితులు, పీడితులు ఎవరైనా అంబేద్కర్ను తమ ఆత్మగౌరవ ప్రతీకగా చూస్తారు. ఇటీవలి కాలంలో ఒక్క దళితులే కాదు, యావత్ బాధిత సమాజం ‘జై భీమ్’ అనే పదాన్ని ఆత్మగౌరవ నినాదంగా మార్చుకున్నది. అదిప్పుడు శాసనంలో సాధనమే అయితే అంతకు మించిన గౌరవం ఇంకేముంటుంది. తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కేసీఆర్కు ఆ గౌరవం మొదటి నుంచీ ఉంది. నిజానికి అంబేద్కర్ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి. బోధన, సమీకరణ, పోరాటం ద్వారా తెలంగాణ సమాజం ఆయన బాటలో నడిచి రాజ్యం సాధించుకుంది. అదే స్ఫూర్తితో రాజ్యాంగ వ్యవస్థల రక్షణ, పరిపాలన ప్రజాస్వామీకరణలో కూడా తెలంగాణ దేశానికి మార్గదర్శిగా నిలవాలి.
– ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
(వ్యాసకర్త: సమాజ శాస్త్ర ఆచార్యులు, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ )