ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ నమోదు చేస్తున్న కళ్లు చెదిరే విజయాలకు మరో మచ్చుతునక మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్. రూ.15,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్.. మనదేశంలో మైక్రోసాఫ్ట్కు ఉన్న డాటాసెంటర్లలో అతిపెద్దది. ఇప్పటికే ఆ కంపెనీకి పుణె, ముంబై, చెన్నైలలో డాటాసెంటర్లు ఉన్నప్పటికీ.. వీటికి తలమానికమైన సంస్థను ఏర్పాటుచేయటానికి మన రాజధాని నగరాన్ని ఎంచుకోవటం తెలంగాణ ప్రగతికి నిదర్శనం. ఐటీ కంపెనీలు, ఉద్యోగుల కలల మజిలీగా హైదరాబాద్ మారుతున్నది. నౌకరీడాట్కామ్, మాన్స్టర్, ఇండీడ్ వంటి ప్రఖ్యాత జాబ్పోర్టళ్లు జరిపిన సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి దశదిశలా కొనసాగుతోంది. అది ఒక్క ఐటీకే పరిమితం కాలేదు. ఇతర రంగాల్లోనూ విశ్లేషకులే ఆశ్చర్యపోయేరీతిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ప్రముఖ వైద్య పరికరాల తయారీ కంపెనీ ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను నెలకొల్పుతామని ఇటీవల ప్రకటించింది. గుండె చికిత్సకు సంబంధించిన డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్లను ఈ కంపెనీ తయారుచేయనున్నది. 2017లో ప్రారంభమైన మెడికల్ డివైజెస్ పార్కుతో ఆ రంగంలో దేశానికే కేంద్రంగా హైదరాబాద్ అవతరిస్తున్నది. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా.. అంతర్జాతీయ కంపెనీ యంగ్వన్, దేశీయ దిగ్గజం కిటెక్స్ వంటివి పెట్టుబడులు పెట్టటానికి ముందుకొస్తున్నాయి. ఈ రంగంలో కొత్త లక్ష్యాలు సృష్టించుకొని ముందుకువెళ్లటానికి రోడ్మ్యాప్ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్ ఇటీవల ఆదేశించారు. సిద్దిపేటలో 300 ఎకరాల్లో ఫర్నీచర్ పార్కు ఏర్పాటుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు ప్రారంభించింది. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ ఐకియా కూడా ఈ పార్కులో తమ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చింది.
ఒక రంగానికో, ఒక ప్రాంతానికో అభివృద్ధి పరిమితం కాకుండా.. బహుముఖాలుగా విస్తరిస్తున్న కొత్త ట్రెండ్కు తెలంగాణ ఒక సమున్నత ఉదాహరణ. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, సమర్థ పాలన కారణంగా ఇది సాధ్యమైంది. పెట్టుబడులు పెడతాం అని వచ్చే కంపెనీ నుంచి ఏ రకంగా వ్యక్తిగత లబ్ధి పొందుదామని ఆలోచించే నేతలున్న ఈ కాలంలో.. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతి మంజూరు చేసే విప్లవాత్మక విధానాన్ని కేసీఆర్ తీసుకొచ్చారు. గడువులోగా అధికారులు అనుమతి ఇవ్వకపోతే, ఆటోమేటిగ్గా అనుమతి ఇచ్చే టీఎస్ఐపాస్ పెట్టుబడులకు రెడ్కార్పెట్ పరిచింది. అనేక అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులను సమగ్రంగా వివరించి చెప్పే మంత్రి కేటీఆర్ కృషి కూడా కీలకమైనది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, శాంతిభద్రతలు, రాజకీయ సుస్థిరత.. వీటన్నింటి కారణంగా నేడు పెట్టుబడులకు నెలవుగా, పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ వర్ధిల్లుతున్నది. రేపటి భారతదేశానికి నేటి తెలంగాణ ఆదర్శం కావాలి.