దేశంలో అతిపిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ. జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం తెలంగాణ. తక్కువ జనసాంద్రతలో కింది నుంచి పైకి 14వ స్థానం మన తెలంగాణది. కానీ ప్రపంచమే అబ్బురపడే అభివృద్ధిని సాధించింది. దేశంలో అతిపెద్ద రాష్ట్ర బడ్జెట్ స్థానాల్లో 7వ పద్దుగా తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుకూలంగా విత్త మంత్రి హరీశ్రావు బడ్జెట్ను తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టడం, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించడంపై ఆర్థిక విశ్లేషకులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
కరోనా తెచ్చిన ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి అన్నివర్గాల ప్రయోజనాలను కాపాడేవిధంగా బడ్జెట్ను తయారుచేయడం ముదావహం. బీజేపీ పాలిత రాష్ర్టాలైన గుజరాత్, కర్ణాటకల కంటే ఎక్కువగా ఈ యేడు తెలంగాణ రాష్ట్రం రూ.2,56,958.51 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కర్ణాటకలో సంక్షేమ కార్యక్రమాలకు మొత్తం బడ్జెట్లో 10 శాతం కంటే తక్కువగా కేటాయించారు. గుజరాత్ బడ్జెట్లో 4 శాతం మాత్రమే సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించారు. 23 కోట్ల జనాభా ఉన్న యూపీలో దాదాపు రూ.24 వేల కోట్లను మాత్రమే కేటాయిస్తే, తెలంగాణలో మాత్రం ఏటా మొత్తం బడ్జెట్లో 20 శాతానికి తక్కువ కాకుండా కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. గుజరాత్లో రూ.1,250 వృద్ధాప్య పింఛన్ రావాలంటే 80 ఏండ్లు బతికి ఉండాలనే నియమం ఉండటం వృద్ధుల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.
రాష్ట్రంలో గూడు లేక పేదరిక జీవితాన్ని గడుపుతున్న సుమారు 15 లక్షల పేద ప్రజలు ఇండ్లు కట్టుకోవాలని సం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే డబుల్ బెడ్రూం లేదా సొంత జాగలో ఇంటి నిర్మాణానికి రూ.12 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించడం హర్షణీయం. పేద దళితులుగా బతుకుతున్న 10 లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపడానికి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈ బడ్జెట్లో రూ.17,700 కోట్లను దళితబంథు కింద కేటాయించడం ఆహ్వానించదగిన పరిణామం.
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిగతా రాష్ర్టాల కంటే భద్రతా భావంతో జీవించారు. కారణం ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాలు ప్రజలు మానసిక ైస్థెర్యం కోల్పోకుండా ఆర్థిక ధైర్యాన్నిచ్చాయి. ఈ పథకాలకు కొనసాగింపుగా వ్యవసాయ రంగాన్ని బలో పేతం చేస్తూ అనేక సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తిచేసి గ్రామీణ తెలంగాణను సిరిసంపదల తెలంగాణగా మార్చింది.
రాష్ర్టాభివృద్ధి నగరాభివృద్ధితో ముడిపడి ఉంటుంది. నగరాభివృద్ధి పారిశ్రామిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఈ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.2442 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయం వల్ల టీఎస్ఐపాస్ ద్వారా మరింత మంది పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉంటుంది. పారిశ్రామికంగా నగరాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ఆర్థికాభివృద్ధి కోసం పారిశ్రామిక కారిడార్లను నిర్మించడంలో భాగంగా ప్రాంతీయ బాహ్య వలయ నిర్మాణానికి అయ్యే భూ సేకరణకు రూ.750 కోట్లు కేటాయించడం, ఇప్పుడున్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్న ఆవాస కేంద్రాలను, పారిశ్రామిక వాడలో తాగునీటి కోసం 800 కోట్లు కేటాయించడం, మెట్రో నిర్మాణానికి 1500 కోట్లు కేటాయించడం, విమానాశ్రయానికి అనుసందించడానికి 500 కోట్లు కేటాయించడం, కాళేశ్వరం టూరిజానికి 750 కోట్లు కేటాయించడం తదితర కేటాయింపు కార్యక్రమాలతో ఈ రంగంలో కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి. తద్వారా కొత్త రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా కరోనా వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వీలవుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి.
నగరాలకు రవాణా సౌకర్యం ఎంతో ముఖ్యం. దానిమీదనే నగర జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఆ జీవన విధానాన్ని ప్రామాణికంగా పెంచడం కోసం మొత్తం రాష్ట్ర జనాభాలో 42 శాతం ఉన్న పట్టణ ప్రజలపై గతేడాది రూ.15,030 కోట్లను పట్టణ సమగ్రాభివృద్ధికి కేటాయించడం, దీనికి కొనసాగింపుగా ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ప్రజల నీటి కొరతను తీర్చేందుకు రూ.1200 కోట్లను కేటాయించింది. రోడ్లు, భవనాల శాఖకు రూ.1542 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం తగు ప్రాధాన్యాన్నిచ్చింది.
మిశ్రమ ఆర్థికవ్యవస్థ భారతదేశాన్ని అనేక సంక్షోభాల నుంచి బయటపడేసింది. ఈ సందర్భంలో కేంద్రం దానికి వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ప్రైవేటీకరణ మాత్రమే దేశాన్ని రక్షిస్తుందని చెప్తున్నది. ఇన్సూరెన్స్ నుంచి విమానయాన సంస్థల వరకు అన్నీ నష్టాల్లో ఉన్నాయని చెప్తూ తన ఆధీనంలో ఉన్న పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నది. కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వ సంస్థలను రక్షించుకునే గొప్ప కృషి కొనసాగుతున్నది. దీనికి ఉదాహరణ ఆర్టీసీ. నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని రక్షించుకోవడం కోసం రూ.1500 కోట్లు కేటాయించారు. ఈ నిర్ణయం దేశానికే గర్వకారణం.
వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి రూ.22,675 కోట్లు కేటాయించడం, రైతుబంధు, రైతు బీమా,రైతు రుణమాఫీ, ఆధునిక వ్యవసాయం లాంటి కార్యక్రమాలకు రూ.24,254 కోట్లను కేటాయించడం ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. ఈ బడ్జెట్ ద్వారా గ్రామీణాభివృద్ధి తాలూకు అన్ని కేటాయింపులు దాదాపు 80 వేల కోట్ల పైమాట. ఇది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇస్తున్న రైతు సమ్మాన్ నిధికి కేటాయించే నిధులకు దగ్గరగా ఉండటం గమనార్హం.
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు, కాకతీయ యూనివర్సిటీ)
– బైరి నిరంజన్
93901 15644