ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ను, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను లోతుగా విశ్లేషించుకున్న వారందరికీ ప్రగతివైపు నడిపించే వారెవ్వరో సులభంగానే అర్థమవుతుంది. ఆదాయ వ్యయాల పద్దుల్లో దేశం భవిష్యత్తును చూడగలిగే దార్శనికత, ప్రజల సౌభాగ్యాన్ని మాత్రమే కాంక్షించే తపన, నేలను గెలుపు వైపు నడిపించే విశాలత పాలకుల ప్రతిపాదనల్లో దర్శనమివ్వాలి. గత కేటాయింపులు కానీ మొన్న అమృతకాలంలో నిర్మలమ్మ ప్రవేశపెట్టిన నిరుపయోగ బడ్జెట్లో ఇటువంటిది ఎక్కడా కనిపించదు.
మోదీ ప్రభుత్వ పాలనలో గడిచిన బడ్జెట్ల లాగానే, ఈసారి కూడా పంచామృత్, అమృత్ పిడి, పీఎం-వికాస్ తదితర నినాదాల గోల తప్ప పురోగతికి తోడ్పడే శాస్త్రీయ ప్రతిపాదనలకు చోటు దక్కలేదు. ప్రపంచ అభివృద్ధి కొలమానాల్లో కూలిన దేశాన్ని తిరిగి నిలబెట్టేందుకు దోహదపడే ఆర్థిక ప్రణాళిక ఆశించినవారికి కేంద్రం ‘బడ్జెట్ పద్మనాభం’ సినిమా చూపెట్టింది.
నదుల నిండా నీళ్లు, అద్భుత సాగు యోగ్య భూములు, సహజ వనరులు, మానవ వనరులు, మేధో సంపద… ఇలా ప్రపంచ దేశాలన్నింటిలో కంటే కూడా అభివృద్ధికి ఆసరాగా మలుచుకోగలిగే వనరులెన్నో ఉన్న దేశం మనది. కానీ 75 ఏండ్ల తర్వాత కూడా దేశం దుఃఖంలోనే ఉండటానికి ఇలాంటి ప్రాణం లేని పద్దులు, పాలకుల వివేకం లేని విధానాలే కారణం కాదా..? దేశంలోని 140 కోట్ల మంది జీవితాల్లో ప్రతిఫలించని 45 లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి కోసం? ఎందుకోసం? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినట్లుగానే ‘నష్టాలను సమాజానికి పంచటం, లాభాలను ప్రైవేట్ వ్యక్తుల గల్లా పెట్టెల్లో నింపడమే’ గీటురాయిగా కేంద్ర సర్కార్ బడ్జెట్ రూపొందించబడ్డది. జాతీయస్థాయిలో అమలులో ఉన్న ఒకే ఒక మంచి పథకం ఉపాధి హామీకి రూ.29,400 కోట్లు కోత పెట్టారు. చివరికి చిరు వ్యాపారస్థులకూ పాన్కార్డు తప్పనిసరి చేస్తామనడం వెనుక పన్నులు పిండుకునే దుర్మార్గపు ధోరణి తప్ప మరేముంది? జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయని ప్రకటిస్తూనే, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించే ప్రతిపాదన చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోగలం. అలాగే 45 లక్షల కోట్ల బడ్జెట్లో కిసాన్ సమ్మాన్ నిధికి కేవలం రూ.60 వేల కోట్లు గతేడాదిలాగే విదిల్చి అన్యాయం చేయడమే కాదు, ప్రాణాలర్పించి పోరాడుతూ దేశ రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లాంటి కీలక అంశానికి బడ్జెట్లో భరోసా దక్కలేదు. శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్యుత్ శక్తి, నౌకాయానం తదితర ప్రగతికారక రంగాలపై కేంద్ర బడ్జెట్ సరైన దృష్టి సారించలేకపోయింది. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇకపై కొండెక్కిన దీపమేనని నిర్మలమ్మ చివరి బడ్జెట్తో స్పష్టమైంది. ఇలా అనేక కీలక అంశాలపై మనస్సు నిలపని పద్దులు ప్రజలకెందుకనీ..? జాతి ఉన్నతికి ‘ఊతమివ్వని గణాంకాలతో దేశం ఏ దిక్కుకు నడవాలని..?
కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎనిమిదేండ్లుగా పద్దులను పొద్దు పొడుపులుగా మార్చివేసింది. అర్ధశాస్ర్తానికి, సామాజిక శాస్త్రంతో పొత్తు కుదిర్చి ప్రభుత్వ పాలనా శాస్ర్తాన్ని నవ్యపథంలో తీర్చిదిద్దింది. ఏటా బడ్జెట్లో ‘ చుట్టూతా వెలుగులు పంచమనే తత్వాన్ని’ చూపెట్టింది. కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ అంచనాలు ఏడాది తిరిగేసరికి సంపదలై జనం అనుభవంలో ప్రతిఫలించాయి. దిగాలు పడిన తెలంగాణ ధైర్యం నింపుకొని, నిలిచి, గెలిచి, దేశానికి దారి చూపే దిక్సూచి వలె వెలుగుతున్నది.
అదే దారిలోనే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రగతి విప్లవాన్ని మరింత దృఢసంకల్పంతో ముందుకు నడిపించే ఆర్థిక ప్రణాళికగా రూపొందించబడింది. 75 ఏండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాలెట్ బాక్సులపై వల విసురుతూ, బడ్జెట్ గణాంకాలను గురిపెట్టాయి, కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి, తర్వాతి తరాల ఉజ్వల భవితకు పునాదులు వేయడమే లక్ష్యంగా పద్దులు రూపొందించింది. రైతుబంధు, బీమా, సాగుకు ఉచిత కరెంట్, 24 గంటల కరెంట్, గురుకులాలు, ఆసరా పింఛన్లు, టీఎస్ఐపాస్, మన ఊరు-మన బడి.. ఇలా ఎన్నెన్నో అమలు పరిచి పథకాల పోరును నడిపిస్తున్నది. అదే ప్రగతి విప్లవ జ్యోతి ఆరిపోకుండా, సకల రంగాలను జనరాశుల ఒడిలో కూర్చోబెట్టే దిశగా, ఈ ఏడాది సైతం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపొందించబడింది. భిన్న భౌగోళిక ప్రాంతాలు, విశ్వాసాలు, వాతావరణ స్థితిగతులున్న భారతదేశాన్ని సమైక్య దేశంగా ఎల్లకాలం నిలిపేందుకు రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఫెడరలిజాన్ని జాతికి అందించారు. కానీ సంకుచిత మోదీ సర్కారు, ఆర్థిక అపాయాలను తెలంగాణకు, ఇతర రాష్ర్టాలకు కలిగిస్తూ, ఫెడరలిజంపై ఫ్యాక్షనిజానికి పాల్పడుతున్నది. కేంద్రం కుట్రలను ఎదుర్కొంటూనే సకల జీవరాశుల సంక్షేమమే లక్ష్యంగా విపణి మార్పులను సంధానం చేసుకొని, అభివృద్ధిలో అంతర్జాతీయ కొలమానాల్లోనూ ప్రశంసనీయ స్థానం నిలుపుకొనే దిశగా రాష్ట్ర బడ్జెట్ రూపొందించారు.
పేదల కన్నీరు తుడవని ఆర్థికప్రగతి అస్థిరమైనదే కాదు, అన్యాయమైనదనే కేసీఆర్ ఉదాత్తమైన భావనల వెలుగులో 2023-24 రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడుగులతోపాటు, అభివృద్ధిలోకి తీసుకు రావాల్సిన వివిధ వర్గాలు, రంగాలన్నింటికీ భారీ కేటాయింపులు దక్కాయి. అందులో భాగంగానే రాష్ట్రంలోని బీసీ కులాల సంక్షేమానికి రూ6,229 కోట్లు కేటాయించి గొప్ప మనసును చాటుకున్నది తెలంగాణ ప్రభుత్వం. 29 రాష్ర్టాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 140 కోట్ల దేశ జనాభాలో దాదాపు 75 కోట్లకు పైగా జనాభా గల దేశంలోని బీదలకు కేంద్ర సర్కార్ రూ.45 లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయించింది రూ.2 వేల కోట్లు మాత్రమే.
సకల జనుల సౌభాగ్యాన్ని అభివృద్ధిలో వివక్షకు గురైన వర్గాల భాగస్వామ్యాన్ని పెంచడమే ఆశయంగా పాలనను సాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రారంభించిన చారిత్రక దళితబంధు పథకానికి భారీగా రూ.17,700 కోట్లు కేటాయించారు. ఎస్సీ కులాల ప్రత్యేక నిధికి రూ.36,750 కోట్లు, ఎస్టీల ప్రత్యేక నిధికి రూ.15,233 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.2,200 కోట్లు కేటాయించి, బడ్జెట్ కేటాయింపుల్లో సింహభాగం, సగానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధికి వడ్డించడం ద్వారా దేశంలోనే సాటిలేని సంక్షేమ సర్కార్గా కేసీఆర్ ప్రభుత్వం నిలబడ్డది. ఉద్యమ నాయకుడిగా ప్రతి ఇంటి కన్నీటినీ గుర్తించి, కారణాలు శోధించి, పరిష్కారాలు రూపొందించిన నాయకుడు కాబట్టే అట్టడుగు వర్గాల్లోంచి దారిద్య్రాన్ని తరిమేసేందుకు సీఎం కేసీఆర్ దారిదీపం లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిదేండ్లుగా గురుకులాలు, విదేశీ విద్యానిధి తదితర పథకాల అమలు కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది విశ్వవిద్యాలయాలన్నింటిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.500 కోట్ల నిధులు కేటాయించడం ఆర్థిక మంత్రి అన్నట్లుగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఆరోగ్య రంగంలో గతంలో ఏ పరిపాలకుడికి కనీసం కలలో కూడా తట్టని కంటివెలుగు, డయాలసిస్ వ్యాధిగ్రస్థులకు ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్ వంటి ఎన్నో మాననీయ పథకాలు అమలు పరుస్తూ, అనేక రాష్ర్టాలకు మార్గదర్శిగా నిలిచిన సీఎం కేసీఆర్, ఈ ఏడాది వైద్యారోగ్య రంగానికి భారీగా రూ.12,161 కోట్లు కేటాయించారు.
ఇప్పుడు దేశంలోని రాష్ర్టాలన్నీ కోరుకుంటున్నది ఇలాంటి లక్ష్యాలతో, ప్రణాళికలతో నడిపించగలిగే కేసీఆర్నే. బడ్జెట్ను సకల జీవరాశుల సంతోషకరమైన మనుగడకు, నిత్యం ప్రగతి శీల ప్రయాణం వైపు సమాజాన్ని నడిపించే దిశగా, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను సాకారం చేసే నాయకుడు కీలక మలుపులో ఉన్న దేశానికి నేడు చారిత్రక అవసరం. ఆ ఆలోచనల మార్గంలో దేశం నలుమూలల్లో క్రియాశీల కదలిక కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రగతికి రైతన్నను వెన్నెముకగా మార్చిన ముఖ్యమంత్రి.. వ్యవసాయ రంగాన్ని సంపద సృష్టి కేంద్రంగా మార్చి వేసి, దేశం యావత్తు తెలంగాణలో సాగుతున్న రైతు రాజ్యం రావాలని కోరుకునే విధంగా తీర్చిదిద్దారు. ఆ రంగానికి రూ.26,831 కోట్లు కేటాయించారు. గ్రామాలు, పట్టణాలను కలిపి ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశలోనే పంచాయితీరాజ్ శాఖకు భారీగా రూ.31,426 కోట్లు కేటాయించడంతో పాటు పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు ప్రతిపాదించడం, సమగ్రాభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది. నీటి కోసం తండ్లాడిన నేలను, జలసిరుల కేంద్రంగా మలిచి సాగునీటిరంగంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు చెక్డ్యాంల నిర్మాణంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం అద్భుతాలను ఆవిష్కరించింది. ఈ కీలక నీటిపారుదల రంగానికి రూ.26,885 కోట్లు కేటాయించడంతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల పెండింగ్ పనులను వీలైనంత త్వరలో పూర్తిచేసే లక్ష్యాన్ని బడ్జెట్లో స్పష్టంగా పొందుపర్చింది. విద్యుత్ రంగంలో 24 గంటల వెలుగుల చరిత్రను కొనసాగించేందుకు రూ.12,727 కోట్లు, విద్యారంగంలో 26 లక్షల మంది విద్యార్థుల భవితకు దీపస్తంభంలా నిలిచేందుకు రూ.19,093 కోట్లతో భవిష్యత్ తెలంగాణను తీర్చిదిద్దే కేటాయింపులు చేసింది ప్రభుత్వం. జర్నలిస్టు, మహిళా, శిశు సంక్షేమం, బ్రాహ్మణ పరిషత్కు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను ఆర్థికమంత్రి విస్పష్టంగా వివరించారు.
కేసీఆర్ ప్రభుత్వానిది అన్ని రాష్ర్టాలు, అన్నివర్గాలు కోరుకుంటున్న జనతన బడ్జెట్ అయితే, మోదీ సర్కార్ది కచ్చితంగా తిరోగమన బడ్జెట్ మాత్రమేనన్నది వాస్తవం. అందుకే జనమంతా జనతన బడ్జెట్కు జిందాబాద్ పలుకుతున్నారు.
వివిధ రంగాలకు జరిపిన కేటాయింపుల్లో, సాధించిన ప్రగతి, తలసరి ఆదాయం, జీఎస్డీపీ తదితర కొలమాలన్నింటిలో.. దేశంలోని రాష్ర్టాలన్నింటి కంటే, కేంద్రం సాధించిన లక్ష్యాల కంటే తెలంగాణ ఎన్నో రెట్లు ముందున్నదనే సత్యాన్ని ఆధారపూరిత గణాంకాల ద్వారా మరోసారి ఈ బడ్జెట్తో ప్రభుత్వం ప్రజల ముందు పెట్టింది. మొత్తంగా బతుకునిచ్చే బడ్జెట్ ఏదో… భారత్ భవితను గాలిలో దీపంలా వేలాడదీసిన బడ్జెట్ ఏదో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ప్రజల అనుభవంలోకి రాని అంకెల గారడీగా మోదీ ప్రభుత్వ పద్దులుంటే, జన జీవితాలకు గెలుపు బాటలు పరిచేవిగా కేసీఆర్ సర్కార్ కేటాయింపులుంటూ వస్తున్నాయి. వనరుల వినియోగం, జాతి ప్రగతికి ఆసరాగా నిలవని ఆర్థిక నిరర్ధక ప్రణాళిక కేంద్రానిదైతే, అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని రారాజుగా నిలిపే ఆదాయ, వ్యయాల శాస్త్రీయ ప్రగతి ప్రణాళిక తెలంగాణ ప్రభుత్వానిది. కేసీఆర్ ప్రభుత్వానిది అన్ని రాష్ర్టాలు, అన్నివర్గాలు కోరుకుంటున్న జనతన బడ్జెట్ అయితే, మోదీ సర్కార్ది కచ్చితంగా తిరోగమన బడ్జెట్ మాత్రమేనన్నది వాస్తవం. అందుకే జనమంతా జనతన బడ్జెట్కు జిందాబాద్ పలుకుతున్నారు.
నాందేడ్ సభలో నూతన భారతం కోసం ప్రజలే నాంది పలికారు. తెలంగాణ అసెంబ్లీ వలె భారత పార్లమెంట్లో బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజులు ఎంతో దూరంలో లేవు. ఆ దిశగా దేశం కేసీఆర్ మార్గంలో నడిచి తీరుతుంది.
డాక్టర్ ఆంజనేయగౌడ్: 98853 52242
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)