ప్రపంచీకరణ దృష్ట్యా సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నది. ఎలక్ట్రానిక్ విధానాల వాడకం, ఆటోమేషన్, అదేవిధంగా సినీ పరిశ్రమల్లో ఓటీటీ విప్లవం రావడం చూస్తున్నాం. సమాజంలో జరుగుతున్న విషయాలను సైతం నేడు మనం అనేక సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ, సాంకేతికతను వాడే విధానం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
రాజకీయాలు, ప్రభుత్వ విధానాలను గురించి ప్రజలకు తెలియజేసే సమయంలో మాధ్యమాలు కొంత అదుపులో ఉంటూ సరైన విషయాన్ని ప్రజలకు చేరువ చేయాలి. కానీ, దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో రాజకీయ స్వాతంత్య్రం ఎక్కువగా ఉంది కాబట్టి, కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, ప్రతిపక్షాలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై విషాన్ని చిమ్ముతున్నాయి. కేసీఆర్ను విమర్శించడమే పనిగా కొన్ని యూట్యూబ్ చానళ్లు పనిచేస్తున్నాయి.
జర్నలిజం విలువలను మంటగలిపేవిధంగా చేష్టలు, వారి ప్రవర్తన ఆ చానెళ్లలో ప్రసార సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి. అసలు ఈ యూట్యూబ్ చానెళ్లు ఎవరి ఆధీనంలో నడుస్తున్నాయి, వీరు ప్రజల్లో లేని అపోహలను ఎందుకు కలిగిస్తున్నారో వారికే తెలియాలి. సాంకేతిక యుగంలో సామాజిక మాధ్యమాల పాత్ర భారీగా పెరిగింది. ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని చాలా దగ్గర చేశాయి.
ఈ రోజు అనేక ప్రభుత్వ కార్యక్రమాలను ఫేస్బుక్ లైవ్లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. ట్విట్టర్ లాంటి మాధ్యమాల ద్వారా నాయకులకు నేరుగా మన సమస్యలను వివరిస్తున్నాం. అనేక రాజకీయ పార్టీలు వారి ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ విధంగా ప్రస్తుత కాలంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గల సంబంధాలు బలపడ్డాయి. ఇదే అదనుగా కొంతమంది రాజకీయకక్షతో యూట్యూబ్ చానెళ్లు మొదలుపెట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను కల్పించడమే వీరి లక్ష్యం. పరుషమైన పదజాలంతో ముఖ్యమం త్రి, మంత్రులు అనే తేడా లేకుండా అడ్డగోలుగా విషప్రచారం చేస్తున్నారు.
ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ప్రజలకు వార్తలను చేరవేస్తున్నట్టు, ప్రశ్నిస్తా అనే ముసుగులో అర్థం పర్థంలేని విమర్శలు చేస్తున్నారు. వీటిని అడ్డుకోకపోతే ప్రజల్లో లేని అపోహలను సృష్టించే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రశ్నకు, విమర్శకు తేడా తెలియని స్థితిలో కొంతమంది యూట్యూబర్లు ఉండటం విడ్డూరం.
జర్నలిజాన్ని ప్రజలు ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభంగా భావిస్తారు. ప్రభుత్వం చేస్తు న్న పనులను ప్రజలకు నేరుగా చేరవేయడమే జర్నలిస్టు ముఖ్య లక్షణం. ప్రభుత్వం చేస్తున్న పనులను సైతం ప్రశ్నించే హక్కు కూడా వారికి ఉంది. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేవిధంగా జర్నలిస్టులు వ్యవహరించేవారు. కానీ, నేడు పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చిన యూట్యూబ్ చానెళ్ల మూలంగా జర్నలిజం విలువలే ప్రశ్నార్థకమైపోయాయి. కొన్ని చానెళ్లు కేవలం కేసీఆర్, కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
ఏ రోజు కూడా సమస్యను ప్రశ్నించకుండా కేవలం పరుష పదజాలంతో విమర్శలే తప్ప వీరివల్ల లాభపడిందేమీ లేదు. నాన్సెన్స్ జోకులు, వార్తా సంస్థలను విమర్శించుకుంటూ, తప్పుడు వార్తలు, వాట్సాప్లో వచ్చే ఫేక్ వార్తలను చదువుతూ ప్రజల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. టూల్ కిట్ సహాయంతో వారు చదివేవార్తలకు కామెంట్ల రూపంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కామెంట్స్ కనపడటం, పోల్స్ నిర్వహించి వారే ఓట్లు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా ఒక వికృతమైన రాజకీయానికి అడ్డాగా ఈ యూట్యూబ్ చానెళ్లు పనిచేస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఎలక్ట్రానిక్ మీడియా మాదిరి ఈ యూట్యూబ్ చానెళ్లు ఒక నియమావళిని ఏర్పాటుచేయాలి. జర్నలిజం కోర్సును చేసినవారికే ప్రాధాన్యం ఇవ్వాలి. కైంప్లెంట్ల అథారిటీని ఏర్పాటుచేసి సామజిక మాధ్యమాల్లో వారి చానెళ్లను వీక్షించే అవకాశం ప్రజలకు ఇవ్వాలి. సెన్సార్ సిస్టంను ఆ చానల్ నడిపే సంస్థలు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాతే సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయాలి.
ఇటీవల కేంద్రం తెచ్చిన Digital Media Ethics Code (Social Media Intermediary Guidelines 2022 నియమాలను తక్షణమే అమలుచేయాలి. వారికి వచ్చే వార్తలను ముందుగా ఫ్యాక్ట్ చెక్ సహాయంతో చెక్ చేసుకొని తర్వాతే అవి ప్రసారం చేయాలి. ఈ విధంగా ఒక నియంత్రణ అనేది ఉంటేనే ప్రజలకు పాజిటివ్ సెన్స్లో వార్తలు చేరుతాయి. వారు కూడా అదేవిధంగా ఆలోచిస్తారు. ఇలా చేయకపోతే ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని కొన్ని యూట్యూబ్ చానెళ్లు ప్రజలకు తప్పుగానే చూపిస్తాయి. దీనివల్ల వారి ఆలోచనా ధోరణి వికృతంగా మారే అవకాశం ఉంటుంది.
రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. కానీ, మనం ప్రశ్నిస్తున్నామా, లేక అడ్డగోలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నామా? అనేది ఒక్కసారి గ్రహించాలి. ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేస్తూనే లోటుపాట్లను సైతం సవరించే హక్కుంది. కానీ, రాజకీయ కక్షతో రాజకీయ పార్టీల అండదండలతో యూట్యూబ్ చానెళ్లు నడుపుతూ వికృతమైన రాజకీయం చేయడం సిగ్గుచేటు. ఇలాంటి చానెళ్ల మీద ప్రభుత్వం ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నది.
– కన్నోజు శ్రీహర్ష 89851 30032