కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు, కేసీఆర్పై ఆరోపణ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన లేనివారు ‘నిజమేనేమో’ అని నమ్మేవిధంగా.. సరిగ్గా ఆ సమయంలోనే మేడిగడ్డ వద్ద గల లక్ష్మీ బ్యారేజీలో మహారాష్ట్ర వైపున్న 7వ బ్లాకులో గల 11 పియర్లలో 20, 21 , 22 పియర్లు ఒక ఫీటు లోపు కుంగిపోయాయి. ఈ పియర్లు కుంగడానికి కారణాలను తెలుసుకోవడానికి నాలుగు నెలల తర్వాత ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ’ గత వారమే నిపుణుల కమిటీని నియమించింది.
ఈ కమిటీ మార్చి 7, 8 తేదీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి 9వ తేదీన రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులతో సమావేశమైంది. పియర్లు కుంగడానికి కారణాలు తెలియాలంటే మరో నాలుగు నెలలు వేచి చూడాలేమో! ఎందుకంటే నిపుణుల కమిటీ నివేదిక సమర్పించడానికి ఎన్.డీ.ఎస్.ఏ. ఇచ్చిన గడువు నాలుగు నెలలు. ఈ నాలుగు నెలల పరిశోధనలో మేడిగడ్డ పునాదుల్లో ఎంత తోడినా భారీ వరదల వల్లనో లేదా డిజైన్ లోపం వల్లనో లేదా ఇంజినీర్ల పర్యవేక్షణగా, నిర్వహణాలోపం వల్లనో అని తెలుస్తుందే తప్ప, ‘అవినీతి’ ఈ ప్రమాదానికి కారణమని ఏ నిపుణుడూ భావించజాలడు.
అవినీతి వల్ల ప్రాజెక్టులో నాసిరకం మెటీరియల్ను వాడి ఉంటే గత 500 ఏండ్లలో ఏనాడూ రానంత భారీస్థాయిలో 28,75,000 క్యూసెక్కుల (సుమారు 250 టీఎంసీలు) నీరు బ్యారేజీ గేట్లపై నుంచి ఉధృతంగా పొంగిపొరలిన సమయంలోనే 2022, జూలై 15న లక్ష్మీ బ్యారేజీ కొట్టుకుపోయి ఉండేది. ఇటీవలే మేడిగడ్డ పియర్స్కు వాడిన మెటీరియల్ నాణ్యతను పరిశీలించగా ఉండాల్సిన నాణ్యత (20 పాయింట్లు) కన్న ఎంతో మెరుగ్గా (25 పాయింట్లు) ఉన్నట్లు నిపుణులకు అర్థమైంది. మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ కంపెనీ నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడదని ఈ దేశంలోని ఏ ఇంజినీరునడిగినా చెప్తాడు.
కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైనింగ్ తర్వాత అంచనా వ్యయం రూ.80,190.46 కోట్లు (2015-16 అంచనాల ప్రకారం)..
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి 2007 మే 16న జీవో నెంబర్ 124 ద్వారా ప్రాణహిత ప్రాజెక్టుకు రూ.17,875 కోట్ల వ్యయంతో పరిపాలనా అనుమతి మంజూరు చేశారు. ఆ తర్వాత, 19 నెలల్లోనే పనులేవీ మొదలుపెట్టకుండానే ఆయకట్టును కొద్దిగా పెంచి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లతో 2008 డిసెంబర్ 17న మరో జీవో నెం.238 జారీచేశారు. ఈ జీవో జారీ కాకముందే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఏ అనుమతులు రాకుండానే 2007 సెప్టెంబర్, 2008 సెప్టెంబర్ మధ్య ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు, 2008 జూన్ నుంచి 2009 మధ్య (2009లో శాసనసభకు ఎన్నికలు జరిగిన సమయం) వివిధ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించింది అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం. 2010, అక్టోబర్లో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.40,300 కోట్లకు పెంచుతూ కేంద్ర జల సంఘానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సమర్పించింది రోశయ్య ప్రభుత్వం.
తెలంగాణ విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు అయిన పి.వెంకటరామారావు, అనంతరాములు రూపొందించిన ప్రాణహిత ప్రాజెక్టులో సుమారు 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని ప్రతిపాదించారు. కానీ, వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకై 2005, జూన్ 27న జారీచేసిన జీవోలో ఆయకట్టును 5 లక్షల 50 వేల ఎకరాలకు కుదించారు. అప్పటి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న హరీశ్రావు చొరవతో ఆయకట్టును 12 లక్షల ఎకరాలకు పెంచుతూ వైఎస్ఆర్ మరో జీవో జారీచేశారు. కొద్ది నెలలకే 16.40 లక్షల ఎకరాలకు ఆయకట్టును పెంచుతూ మరో జీవో వెలువడింది. మూడేండ్ల లోనే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.17,875 కోట్ల నుంచి రూ.40,300 కోట్లకు పెరిగింది. 2016-17 నాటికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండి ఉంటే ధరలు పెరిగాయనే సాకు చూపి నిర్మాణంలో ఏ మార్పులు చేయకుండానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపు అంటే 80 వేల కోట్లు దాటి ఉండేది. గత ఎనిమిదేండ్లలో ఒక లక్షా అరవై వేల కోట్లు కూడా అయి ఉండేది. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన ప్రతి ప్రాజెక్టు అంచనా వ్యయం పూర్తయ్యేనాటికి సుమారు 8-10 రెట్లు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వైఎస్ఆర్ రూ.40,300 కోట్ల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు ఇచ్చిన అప్పటి ప్రాజెక్టుకూ, రీ-ఇంజినీరింగ్ చేయబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకూ భూమికీ ఆకాశానికి (జమీన్ ఆస్మాన్) ఉన్నంత తేడా ఉన్నది. ఆ వివరాల్లోకి వెళ్లేముందు కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ఎందుకు బ్యారేజీ కట్టలేకపోయింది, రీ-డిజైనింగ్ అవసరమెందుకు కలిగిందనేది క్లుప్తంగా మరోసారి తెలుసుకోవాలి.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇంకా రాకముందే ఈపీసీ పద్ధతిలో మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని పనులు చేయడానికి టెండర్లు జారీ చేసింది ప్రభుత్వం. అంచనా విలువకన్న ఎక్కువ విలువగల బిడ్స్ను దాఖలు చేసి పనులు చేజిక్కించుకున్నారు కాంట్రాక్టర్లయిన మెగా, మైటాస్, ఐవీఆర్సీఎల్, ఎస్ఈడబ్ల్యూ వంటి ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు.
కాళేశ్వరం రీ-డిజైనింగ్ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపు కావడానికి కారణాలివీ…
కాళేశ్వరం వద్ద పెరిగిన ఆయకట్టుకు చాలినంత నీరు (75 శాతం ఆధారపడదగిన) 284.30 టీఎంసీలు లభ్యమవుతుందని కేంద్ర జల సంఘం స్పష్టం చేయడంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రివర్స్ పంపింగ్ చేస్తూ శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీలోకి గోదావరి జలాలను నింపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడిహెట్టితో పోల్చితే ఈ రీ డిజైనింగ్ వల్ల మరో రెండు బ్యారేజీలు, ఒక పంపింగ్ స్టేషన్ అదనంగా అవసరమైనవి. (తుమ్మిడిహెట్టి +148 మీటర్ల ఎత్తుకు నిర్మిస్తే 4 మీటర్ల మరో లిఫ్టు అవసరమై ఉండేది). ఈ 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 విద్యుత్ స్టేషన్లు కన్నెపల్లి పంప్హౌజ్ నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం రిజర్వాయర్కు చేర్చడానికి గ్రావిటీ కాల్వ ఖర్చు పెరిగింది. 85 పియర్స్ కలిగి 1.6. కి.మీలపైనే పొడవున్న మేడిగడ్డ వద్ద 16.17 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా రూ.4,613 కోట్ల ఖర్చుతో నిర్మించారు.
రీ డిజైనింగ్లో ఖర్చు పెరగడానికి లింక్-1లోని 3 బ్యారేజీలు, గ్రావిటీ కాల్వ మొదలైనవి కారణం. లింక్-1లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు రోజు 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలనుకున్నా 3 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేవిధంగా సివిల్ పనులు పూర్తిచేశారు. భవిష్యత్తులో రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలని దూరదృష్టితో కేసీఆర్ నిర్ణయించారు. కాగ్ నివేదికలో మూడో టీఎంసీపై అనుచిత వ్యాఖ్యలు కన్పిస్తాయి. ‘రంధ్రాన్వేషకులు’ ఈ వ్యాఖ్యలను మరింత సాగదీస్తున్నారు. నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం పలు సమావేశాలను నిర్వహిస్తూ వేగంగా అమలుచేయాలని భావిస్తున్న నేపథ్యంలో.. గోదావరి-కావేరి అనుసంధానం అమల్లోకి వస్తే గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటా జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ భవిష్యత్తులో మనకుండదు. ఇప్పటిదాకా మనం వినియోగించుకుంటున్న నీటిపైనే రైపేరియన్ రైట్స్ తెలంగాణకు దక్కుతాయి. మన వాటా జలాలైన 966 టీఎంసీల జలాలను పూర్తిగా వినియోగంలోకి తేవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాల్సిందే.
కాళేశ్వరం రీ-డిజైనింగ్ గురించి ఓనమాలు, ఏబీసీడీలు తెలియనివాళ్లే నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్చే ప్రారంభించబడిన జలయజ్ఞం ప్రాజెక్టులు పదేండ్ల తర్వాత కూడా పూర్తికాకపోవడానికి భూ సేకరణ, ధరల పెరుగుదల ప్రధాన కారణాలు.
రీ డిజైనింగ్లో భాగంగా 16.43 టీఎంసీల ప్రతిపాదిత రిజర్వాయర్ల స్థానంలో 141 టీఎంసీలకు పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో ఎల్లంపల్లి, మిడ్మానేరు వంటి ఆన్లైన్ రిజర్వాయర్లను మినహాయిస్తే 50 టీఎంసీల మల్లన్నసాగర్ (పాతది తడ్కమల్ల చెరువు 1.5 టీఎంసీలు), 15 టీఎంసీల కొండపోచమ్మసాగర్ (పాతది 1 టీఎంసీ), మేడిగడ్డ వద్ద 16.17 టీఎంసీలు, అన్నారం బ్యారేజీ 10.87 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీ 8.83 టీఎంసీలు, 1.70 టీఎంసీలున్న అనంతగిరి రిజర్వాయర్ను 3.50 టీఎంసీలకు, 1.50 టీఎంసీలున్న ఇమాంబాద్ రిజర్వాయర్ను 3.00 టీఎంసీల రంగనాయకసాగర్గా, 0.8 టీఎంసీలున్న బస్వాపూర్ రిజర్వాయర్ను 11.39 టీఎంసీలకు, 0.58 టీఎంసీలున్న మేడారం రిజర్వాయర్ను 0.78 టీఎంసీలకు, 0.35 టీఎంసీలున్న మల్కపేట రిజర్వాయర్ను 0.3 టీఎంసీలకు వీటితోపాటు, మరిన్ని కొత్త రిజర్వాయర్లు గంధమల్ల రిజర్వాయర్ను 9.86 టీఎంసీలతో, కొండెం చెరువును 3.50 టీఎంసీలతో, తిమ్మక్కపల్లి చెరువును 1.50 టీఎంసీలతో, ముద్దోజివాడ, ధర్మారావుపేట, కతేవాడి చెరువులను ఒక్కోదాన్ని 0.50 టీఎంసీలతో, మోతె రిజర్వాయర్ను 2 టీఎంసీలతో, భూంపల్లి రిజర్వాయర్ 0.09 టీఎంసీలతో నిర్మించాలని (మొత్తం 141 టీఎంసీలు) నిర్ణయించింది కేసీఆర్ ప్రభుత్వం.
ఈ రిజర్వాయర్ల నుంచి వివిధ ప్యాకేజీల ద్వారా ఆయకట్టుకు నీటిని తీసుకుపోయే ప్రధాన, బ్రాంచ్ ప్రవాహ కాల్వలపై అవసరమైన అన్నిచోట్ల వేలాది తూములను నిర్మించి వాగుల్లోకి, చెరువులు, కుంటల్లోకి నీటిని విడిచిపెడుతూ వందలాది చెక్డ్యాంలను సైతం నింపడానికి ఈ ప్రాజెక్టులో అవకాశం కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. 2019 యాసంగి పంటల నుంచి 2023 యాసంగి పంటల వరకు అన్ని పంటలకు కలిపి మేడిగడ్డ నుంచి సుమారు 60 లక్షల ఎకరాలకు వందలాది టీఎంసీల నీటిని ఎత్తిపోసి నీరందించింది కేసీఆర్ ప్రభుత్వం. కోట్ల టన్నుల ధాన్యం పండింది. భూగర్భ జల సంపదతో పాటు రైతుల సంపద కూడా పెరిగింది.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో రోజుకు 1.63/ 1.28 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలనుకున్నారు. రీ డిజైనింగ్లో దీన్ని 2 టీఎంసీలకు పెంచడం జరిగింది. భవిష్యత్ అవసరాల కోసం రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. దీనికనుగుణంగా పంపులను రెండు టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటుచేసినా సివిల్ పనులను మాత్రం మూడు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడానికి వీలుగా నిర్మాణాలు చేశారు. దీనివల్ల భారీగా బడ్జెట్ పెరిగింది. మూడో టీఎంసీ కోసం ప్రత్యేకంగా పైప్లైన్ల నిర్మాణం, ఇతర పనులకే రూ.30 వేల కోట్ల వ్యయం అవుతున్నది. ఇప్పటికే ఈ పనుల కోసం 20 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.93 వేల కోట్లు.
పంపుల సామర్థ్యం ఏ స్థాయిలో పెరిగిందో తెలుసుకోవడానికి కొన్ని వివరాలు. 6వ ప్యాకేజీలో (నంది మేడారం) 63 మె.వా. సామర్థ్యం గల 12 పంపులు ప్రాణహిత ప్రాజెక్టులో ఏర్పాటు చేయాలనుకున్నారు. రీ-డిజైనింగ్ తర్వాత 124 మె.వా.సామర్థ్యం గల 7 పంపులు ఏర్పాటుచేశారు. 8వ ప్యాకేజీలో (లక్ష్మీపూర్, రామడుగు మండలం) 72 మె.వా. సామర్థ్యం గల 10 పంపులు ప్రాణహితలో ఏర్పాటు చేయాలనుకోగా కాళేశ్వరం రీ-డిజైనింగ్ తర్వాత ప్రపంచంలోనే ఎక్కడాలేని 139 మె.వా. సామర్థ్యం గల 7 పంపులు ఏర్పాటు చేశారు.
10, 11 ప్యాకేజీల్లో 42, 52 మె.వా. సామర్థ్యం గల 16 పంపులకు బదులు 106, 134 మె.వా. సామర్థ్యం గల 8 పంపులు ఏర్పాటుచేశారు. ప్రాణహిత ప్రాజెక్టుకు 3,466 మె.వా. విద్యుత్తు అవసరం ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 4,958 మె.వా. వినియోగించే వెసులుబాటు కల్పించారు. ఇంత పరిమాణంలో విద్యుత్తును ఒకేసారి వాడుకునే అవసరం ఎప్పుడూ ఉండదు.
సబ్స్టేషన్ల నిర్మాణం కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని బడ్జెట్ అంచనా. కానీ, రిజర్వాయర్ల, పంపుల సామర్థ్యం పెరగడం, విద్యుత్తు వినియోగం అంచనా 3,466 మె.వా. నుంచి 4,958 మె.వా.కు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు అదనంగా పెరిగినందువల్ల వాటి దగ్గర 1,120 మెగావాట్ల విద్యుత్తు వినియోగం అదనంగా అవసరమైంది. మేడిగడ్డ వద్ద 11 పంపులు 40 మెగావాట్ల సామర్థ్యం గలవి, అన్నారం వద్ద 8 పంపులు 40 మెగావాట్లు గలవి, సుందిళ్ల వద్ద 9 పంపులు 40 మె.వా. గలవి ఏర్పాటుచేసింది కేసీఆర్ ప్రభుత్వం.
ఒకవేళ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును యథాతథంగా అమలుచేసి ఉంటే ఐదవ ప్యాకేజీలో లిఫ్ట్ 1లో (మైలారం, నెన్నెల మండలం) 4 మె.వా. రెండు పంపులు, లిఫ్ట్ 2లో (అదే స్థలంలో) 15 మె.వా. పది పంపులు మొత్తం కలిపి 154 మె.వా. సామర్థ్యం గలవి ఏర్పాటుచేయాలనుకున్నారు. ప్రాణహిత బ్యారేజీ +148 మీటర్లు తగ్గినందువల్ల మరో 4 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేయడానికి మరో 150 మెగావాట్ల విద్యుత్తు అవసరమై ఉండేది. రీ డిజైనింగ్ వల్ల సుమారు 800 మె.వా. విద్యుత్తు అదనంగా అవసరమైనా మేడిగడ్డ నుంచి 38 లక్షల ఎకరాలకు సరిపోయేంత నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఏర్పడింది. అందుకే ప్రాణహిత తెలంగాణ సాగుకు జీవధార అయింది.
ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా ఎంతోమంది తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గ్రావిటీ (ప్రవాహ కాల్వ) ద్వారా నీటిని మళ్లించవచ్చునని పదే పదే చెప్తున్నారు. ఇది వారి అవగాహనారాహిత్యం. తుమ్మిడిహెట్టి వద్ద +152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే 71 కి.మీ. ప్రవాహ కాల్వల ద్వారా నీటిని మళ్లించి 40 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి మరో 55 కి.మీ. పొడవైన కాల్వ ద్వారా ఎల్లంపల్లిలో నీటిని పోయాలి. అయితే తుమ్మిడిహెట్టి వద్ద +152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ సాధ్యం కాదని తేల్చడం +148 మీటర్ల ఎత్తులో ఎత్తిపోతలకు లభ్యమయ్యే నీరు కేవలం 44 టీఎంసీ (4 మీటర్ల మరో లిఫ్ట్ ఇక్కడ అవసరం)లు మాత్రమేనని భావించి ప్రత్యామ్నాయంగా కాళేశ్వరం వద్ద మేడిగడ్డ బ్యారేజీని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. 3వ టీఎంసీ నీటిని లిఫ్ట్ చేయడానికి అదనంగా 8 సబ్స్టేషన్లు 38 పంపులు (మొత్తం 3412 మె.వా. లోడ్) ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 2012 కాగ్ నివేదిక ప్రకారం.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో 16.40 లక్షల ఎకరాలకు నీరివ్వడానికి ఒక ఎకరానికి అయ్యే విద్యుత్తు ఖర్చు రూ.24,514.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో నిర్వాసితుల సమస్య అనేది చాలా చిన్నది. ఎందుకంటే నీటి నిల్వ సామర్థ్యం రీ-డిజైనింగ్ ప్రాజెక్టుతో పోల్చితే పది శాతం మాత్రమే. దీనిలో ఎక్కువగా నీటి నిల్వ కోసం అప్పటికే వున్న పాత చెరువులనే వినియోగించుకోవాలనుకున్నారు. కొన్నింటి నీటి నిల్వ సామర్థ్యాన్ని కొద్దిగా పెంచారు. కాళేశ్వరం రీ-డిజైనింగ్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. ప్రాజెక్టు నివేదికలో ఎ.53,553 విస్తీర్ణం భూ సేకరణ అవసరమని పేర్కొంటూ ఒక ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించాలని ప్రతిపాదించారు. దీనికోసం రూ.1,071 కోట్లు కేటాయించారు.
ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నదానికి భిన్నంగా నాలుగేండ్ల తర్వాత మరిన్ని మార్పులు-చేర్పులు అవసరం అవడంతో సుమారు 98 వేల ఎకరాల భూ సేకరణ చేయాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ప్రాంత భూముల ధరలు ఎకరానికి రూ.7 లక్షలవుతుందని అంచనా వేసి భూ సేకరణకే రూ.8,655 కోట్లకు పెంచారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కాళేశ్వరం రీ-డిజైన్ ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నట్టు రూ.300 కోట్లు ఏ మాత్రం చాలదని దీన్ని రూ.1,417 కోట్లకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. గంధమల్ల రిజర్వాయర్ కోసం యాదాద్రి జిల్లాలో సర్వేను సైతం అడ్డుకున్నారు ఆ ప్రాంత రైతాంగం. ఎకరానికి రూ.20 లక్షల కన్న ఎక్కువే కావాలంటున్నారు. భూ సేకరణ వ్యయంతో పాటు నిర్వాసితులకు పునరావాసంపై కూడా అధిక వ్యయమవుతున్నది. కాళేశ్వరం రీ-డిజైనింగ్ గురించి ఓనమాలు, ఏబీసీడీలు తెలియనివాళ్లే నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్చే ప్రారంభించబడిన జలయజ్ఞం ప్రాజెక్టులు పదేండ్ల తర్వాత కూడా పూర్తికాకపోవడానికి భూ సేకరణ, ధరల పెరుగుదల ప్రధాన కారణాలు.
కాళేశ్వరం రీ-డిజైనింగ్ తర్వాత 2.8 శాతం ఉన్న వ్యాట్ 3.5 శాతానికి పెరిగింది. జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఈ భారం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి కారణమైంది.
వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు ఇంకా రాకముందే ఈపీసీ పద్ధతిలో మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని పనులు చేయడానికి టెండర్లు జారీ చేసింది ప్రభుత్వం. అంచనా విలువకన్న ఎక్కువ విలువగల బిడ్స్ను దాఖలు చేసి పనులు చేజిక్కించుకున్నారు కాంట్రాక్టర్లయిన మెగా, మైటాస్, ఐవీఆర్సీఎల్, ఎస్ఈడబ్ల్యూ వంటి ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు. ఈ పెరుగుదల 3.70 శాతం నుంచి 4.953 శాతం. దీనివల్ల రూ.1600 కోట్లు అంచనా వ్యయం పెరిగింది. పెరిగిన ధరలను బట్టి బడ్జెట్ పెంచాలనేది ఈపీసీ ఒప్పందంలో భాగం. వైఎస్ఆర్ అంగీకరించిన ఈ ఒప్పందాలు షరతులతో పాటు కొనసాగించాల్సి వచ్చినవి. దీనివల్ల కూడా అంచనా వ్యయం పెరిగింది.
తెలంగాణ విశ్రాంత చీఫ్ ఇంజినీర్లు అయిన పి.వెంకటరామారావు, అనంతరాములు రూపొందించిన ప్రాణహిత ప్రాజెక్టులో సుమారు 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని ప్రతిపాదించారు. కానీ, వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకై 2005, జూన్ 27న జారీచేసిన జీవోలో ఆయకట్టును 5 లక్షల 50 వేల ఎకరాలకు కుదించాడు. అప్పటి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న హరీశ్రావు చొరవతో ఆయకట్టును 12 లక్షల ఎకరాలకు పెంచుతూ వైఎస్ఆర్ మరో జీవో జారీచేశారు.
రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నివేదిక రూపొందించి 13 ఏండ్లు దాటింది. ఈ కాలమంతా ప్రాజెక్టుకు అవసరమైన ప్రతిదానిలో ధరలు భారీగా పెరిగాయి. మన ఇంటి నిర్మాణం కోసం వినియోగించే సిమెంట్, ఇనుము, కూలీల వేతనాలు మొదలైన వాటికి గత పది పన్నెండేండ్లలో ఎంతగా పెరిగాయో అందరికీ తెలిసిందే. ఈ పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకున్నా రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.60-70 వేల కోట్లకు చేరి ఉండేది. ఈ రీ-డిజైనింగ్ ప్రాజెక్టులో చేసిన మార్పులు అసాధారణమైనవి. మూడు బ్యారేజీలు, మూడు పంపింగ్ స్టేషన్లు, మరో మూడు విద్యుత్తు సబ్స్టేషన్లు, లింక్-1లోని గ్రావిటీ కాల్వ (3 టీఎంసీల ప్రవాహ సామర్థ్యం), ప్రపంచంలో ఎక్కడా ఏనాడూ వినియోగించని స్థాయి గల 139 మె.వా. బాహుబలి పంపులు, 3వ టీఎంసీని దృష్టిలో పెట్టుకొని విస్తరించిన ప్రవాహ కాల్వలు, సివిల్ వర్క్స్, 1.63/1.28 టీఎంసీల నీటిని మాత్రమే పంపింగ్ చేయడానికి ఉద్దేశించిన పంపుల సామర్థ్యాన్ని 2 టీఎంసీల పంపింగ్ కోసం సామర్థ్య పెంపు, మిడ్మానేరు, రిజర్వాయర్ నుంచి మల్లన్నసాగర్ వరకు ప్రతిపాదించిన 0.73/ 0.65 టీఎంసీల పంపింగ్ సామర్థ్యాన్ని 1 టీఎంసీ పంపింగ్ సామర్థ్యానికి పెంచడం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నివేదికలో ప్రతిపాదించిన 16.43 టీఎంసీల (దీనిలో నిర్మించకుండా వదిలేసిన 5.09 టీఎంసీల నీటి నిల్వ కోసం ఉద్దేశించిన తుమ్మిడిహెట్టి రిజర్వాయర్ కూడా భాగమే.)
రిజర్వాయర్ల స్థానంలో కేంద్ర జలసంఘం సూచనలు, అభ్యంతరాల మేరకు 141 టీఎంసీలకు పెంచడం. (ఇప్పటివరకు నిర్మించని 9 టీఎంసీల గంధమల్ల రిజర్వాయర్తో కలిపి) ఇవన్నీ ఒక ఎత్తయితే సుమారు రూ.30 వేల కోట్ల అంచనా వ్యయం(ఇప్పటికే రూ.20 వేల కోట్లు వ్యయం చేశారు)తో నిర్మాణమవుతున్న మూడో టీఎంసీ మరో ఎత్తు. ఇది మాత్రమే కాదు, వాగులకు, చెరువులకు కాళేశ్వరం నీటిని విడుదల చేయడానికి అవసరమైన వేలాది తూములు, ఇతర నిర్మాణాలు, పెరిగిన సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, అధికారులు కార్యాలయాలు, నివాస గృహాలు, అతిథి గృహాలు.. ఇవన్నీ కలిపి రూ.1,27,000 కోట్లకు పెరగడంలో ఆశ్చర్యమేముంది? ఇప్పటివరకు చేసిన ఖర్చే 93 వేల కోట్లయితే (3వ టీఎంసీ కోసం చేసిన వ్యయం రూ.20 వేల కోట్లు కలిపి) దీనిలో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో సీఎం రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ చెప్పాల్సి ఉన్నది. నిందల వెనుక నిజాలు గ్రహించాల్సింది ప్రజలే!
(వ్యాసకర్త: చైర్మన్ ఇండియన్ పెనిన్సులర్ రివర్స్ బేసిన్ కౌన్సిల్)
– వి.ప్రకాశ్
90009 50400