గడిచిన ఆరేండ్ల వ్యవధిలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు మొత్తంగా 11,656 మంది చనిపోయినట్లు పార్లమెంట్ సాక్షిగా గత జూలై 27న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి వెల్లడించారు. అదేవిధంగా దేశ వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఆగస్టు 5న కేంద్ర న్యాయశాఖమంత్రి లోకసభలో తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు 2016 నుంచి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో మొదటిస్థానంలో యూపీ చివరిస్థానంలో కర్ణాటక రాష్ర్టాలున్నాయి. పొలీసు కస్టడీలో 7 శాతం, జైళ్లలో 93 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించి సంబంధిత కుటుంబాలకు రూ.28.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాయి. బాధ్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాయి. అయితే ఆ మరణాల్లో కొన్ని సహజమైనవి కాగా, మరికొన్ని అనారోగ్య, అసహజమైనవి. కొందరు పోలీస్ ఎన్కౌంటర్లు, వారి చిత్ర హింసలతో చనిపోతే, మరికొందరు జైళ్లలో తోటి ఖైదీలతో చంపబడ్డారు. అయితే ఆధునిక భారతావనిలో రోజురోజుకు పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి.
దేశవ్యాప్తంగా 672 న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు విచారణ దశలో పెండింగ్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సుప్రీం కోర్టులో 71 వేలు, హైకోర్టుల్లో 59 లక్షలు మిగతా కేసులు కిందిస్థాయి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో పెండింగ్లో ఉన్నాయి. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చి చూసినప్పుడు ప్రతీ 50 వేల మంది పౌరులకు ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. దేశంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య 25 వేలు. ఇందులో ఎప్పుడూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటాయి. 1987లో లా కమిషన్ ప్రతీ 20 వేల మంది పౌరులకు ఒక్క న్యాయమూర్తిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచదేశాల న్యాయ వ్యవస్థను పోల్చి చూసినప్పుడు చైనాలో ప్రతీ 3500 మంది పౌరులకు ఒక న్యాయమూర్తి, అమెరికాలో ప్రతీ 7,000 మంది పౌరులకు ఒక న్యాయమూర్తి చొప్పున ఉన్నారు. అందుకే, ఆయా దేశాల్లో పౌరులకు సత్వర న్యాయం లభిస్తున్నది.
దేశంలోని 1,350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది శిక్షలు ఖరారైన వాళ్లు, విచారణ కొనసాగుతున్న వాళ్లు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమా రు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు తీర్పులో సుప్రీం కోర్టు, నేరాలను నాలుగు రకాలుగా విభజించి, జైళ్లలో మగ్గుతున్న ఖైదీలు చేసిన నేరానికి విధించే శిక్షలో 50 శాతం జైలు జీవితాన్ని పూర్తిచేసి జైళ్లల్లో మగ్గుతున్న నిందితులను వెంటనే బెయిల్పై విడుదల చెయ్యాలని దేశంలోని అన్ని మేజిస్ట్రేట్, జిల్లా, హైకోర్టులను ఆదేశించింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మన దేశంలో స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకువచ్చినప్పటికీ, కొంతమంది పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, బ్రిటిష్ కాలం నాటి మూస పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పోలీసులు నిందితులను, నిందితులుగా చూడకుండా నేరస్థులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/ అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టుముందు హాజరుపరచాలి. విచారణలో వారు నేరం చేసినట్లుగా తగిన సాక్ష్యాధారాలను న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాంగం ప్రవేశపెట్టాలి. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్థులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి.
దేశంలో సుమారు 4 లక్షల 88 వేల మందికి పైగా ప్రజలు స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవి తం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు?. వీరిలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా పేదవారే ఉండటం గమనించదగిన విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం కేంద్ర ప్రభుత్వం దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటుచేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే.
దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో ఖైదీలకు పౌష్టికాహారం, మెరుగైన వైద్య సదుపాయాలందించాలి. అప్పుడే కస్టోడియల్ మరణాలు తగ్గుతాయి. పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, కేసు ల నమోదు, నేరాల ప్రక్రియ నుంచి న్యాయవ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యాబోధనలో నేర్పించాలి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తు న్న పోలీసులపై, అవే క్రిమినల్ చట్టా ల ప్రకారం కేసులు నమోదు చేసే స్థాయిలో పోలీసు, న్యాయవ్యవసల్లో మార్పులు రావాలి.
భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది.
– కోడెపాక కుమారస్వామి
94909 59625
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)