‘రాజకీయం’ అనే మాటకు భిన్నమైన అర్థాలు వాడుకలో ఉండటం తెలిసిన విషయమే. ఈ మాటకు నిఘంటువు ఏ అర్థం చెప్తుందో ఎప్పుడైనా ఆలోచించామా? చాలామంది అంతగా దృష్టిపెట్టి ఉండకపోవచ్చు. అయితే, మన దైనందిన జీవితంలో ‘రాజకీయం’ అంటే నెగెటివ్ అర్థానికే అలవాటు పడ్డాం మీడియా పుణ్యమాని. ఒక సమాజాన్ని పాలించటానికి తీసుకునే చర్యలన్నిటినీ కలిపి ‘రాజకీయం’ అంటారు. అంటే అదొక పాలనా ప్రక్రియ. పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉండాలని తెలిపేదే రాజకీయం.
అందుకే రాజకీయ పార్టీలు తమకు అధికారం ఇస్తే పాలనా వ్యవస్థను ఏ విధంగా తీర్చిదిద్దుతామో చెప్తారు. మరి ఇది చెప్పటానికి ఎన్నికలే సరైన సమయం, సందర్భం కదా! అయితే రాజకీయం అంటే మనం బాగా అలవాటు పడిన నెగెటివ్ అర్థం ఏమిటో కూడా చూద్దాం.
ఏదైనా విషయాన్ని వివాదం చెయ్యటం, భూతద్దంలో చూడటం, సంబంధం లేని అంశాలను ఒక విషయంలోకి చొప్పించటం లాంటి వాటిని రాజకీయం చేయటమని మనం వాడుక భాషలో అంటుంటాం. ఈ వ్యాసంలో రెండు అర్థాలనూ వాడుకుందాం సందర్భాన్ని బట్టి. పాఠకులకు సులభంగానే తెలుస్తుంది ‘రాజకీయం’ అనే మాటను ఎప్పుడు, ఏ అర్థంలో చూడాలనేది.
రాజకీయాలు చెయ్యటానికి ఎన్నికలే సరైన సమయం, సందర్భం అని కదా అనుకున్నాం ఇంతకుముందు. ఇది అందరికీ తెలిసిన సంగతే! మనం తరచూ అంటుంటాం, వింటుంటాం ‘రాజకీయం చేస్తున్నార’ని! ఇది ఒక ఆరోపణగా అంటారు. రాజకీయ నేతలు రాజకీయాలు చెయ్యక మరేం చేస్తారు? మరి రాజకీయం చేస్తున్నారని ఆరోపణగా ఎందుకంటారు? రాజకీయం చెయ్యటమంటే ఏమిటి? ఈ మాటకు అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించామా? వివాదం లేనిచోట వివాదం సృష్టించటమా? అవసరం లేకపోయినా విభేదించటమా? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడమా? గోరంతలు కొండంతలు చెయ్యటమా? చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటమా? బహుశా ఇవన్నీ కూడా రాజకీయం చేయటం కిందకు వస్తాయనేవాళ్లు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితి ఎన్నికలప్పుడు ఓకే అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. ఎందుకూ అంటే రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపే ప్రధానం గనుక. ఎలాగైనా గెలవాలనేది ఉద్దేశం. అందుకే ఆరోపణలు, ప్రత్యారోపణలతో మన చుట్టూ వాతావరణం వేడెక్కుతుంది రోజు రోజుకు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తమ గురించి గొప్పగా చెప్పటమే కాదు, తమ ప్రత్యర్థులను గురించి వారిలో ఉన్న లొసుగులను విశదీకరించి చెప్తారు. మనిషిలో ఇన్ని మంచి గుణాలు, చెడు గుణాలుంటాయా అన్న సందేహం కలగకపోదు కాస్త విమర్శ దృష్టితో చూసేవారికి. ఒకరికి విమర్శ, మరొకరికి దుష్ప్రచారం. ఏది నిజమో ప్రజలకు తెలుసు. అయితే ఒకటి మాత్రం నిజం.
ఎన్నికల్లో చేసే రాజకీయానికి లక్ష్మణ రేఖ ఉంటుంది. సమాజహితం దృష్ట్యా ఆ రేఖను ఏ పార్టీ గానీ, ఏ నేత గానీ దాటకూడదు. ఈ సత్యం పార్టీలకు, నేతలకు తెలియంది కాదు. ఎన్నికలు ఐదేండ్లకోసారి వస్తాయి. ఆ తర్వాత పార్టీలు, నేతలు కలసి పనిచేయాలి కదా ప్రజల మేలు కోసం. అంటే విమర్శకు, దాడికి, ఎదురుదాడికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటితే ఎన్నికల తర్వాత పార్టీలకు కలిసిపనిచేయటం కష్టమవుతుంది. అన్ని పార్టీలూ ప్రజల మేలుకోరేవే గనుక కొన్ని విషయాల్లో ఒకే స్వరంతో గొంతు ఎత్తవలసిన సందర్భాలు వస్తాయి. అలాంటప్పుడు కలసిపోవాలంటే కాస్తో కూస్తో సామరస్యం పార్టీల మధ్య ఉండటం అవసరం. దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయ పార్టీలు తమ తమ అజెండాను ప్రజల ముందు ఉంచుతాయి. ఏ పార్టీకి చెందినవారు ఆ పార్టీ అజెండా విశిష్టతను గురించి చెప్తారు. అవతలి పార్టీలో ఉన్న దోషాలను ఎత్తిచూపిస్తారు. విభేదాలు, విమర్శ విధానపరమైన విషయాలమీదే ఉండాలి కానీ, వ్యక్తిగతం కాకూడదు. ఈ ప్రక్రియలో వ్యక్తిగత దూషణకు దిగటం తప్పు. ఏది వ్యక్తిగత దూషణ అనేది కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక నేత కిందటి ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకపోతే అది వ్యక్తిగత దూషణ కాదు. కుటుంబ జీవితం గురించి గానీ, ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన సంభాషణలను బయటకు చెప్పటం లాంటివి వ్యక్తిగత దూషణ అంటే. ఇది తప్పని తెలిసి కూడా నేతలు తప్పుచేస్తుంటారు ఈ విషయంలో. ఉదాహరణకు మొన్న మోదీ తనకు కేసీఆర్కు మధ్య ఎప్పుడో జరిగిందని చెప్తున్న సంభాషణ గురించి చెప్పటం!
రాజకీయాల్లో ప్రత్యర్థులుండవచ్చు కానీ, విరోధులు ఉం డకూడదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రు లు ఉండరనేది నానుడి. తాత్కాలిక శతృత్వం కూడా అనవసరం. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేదానికి అర్థం. విమర్శ భావజాలానికి పరిమితమైతే ఓకే. విభేదం వ్యక్తి దూషణకు, వ్యక్తిత్వ హననానికి దారితీయరాదు. అలా అయితే ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఏ విషయం మీదైనా ఒక తాటిమీదకు రావటం కష్టమవుతుంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏదైనా కీలకమైన విషయం వచ్చినప్పుడు అఖిలపక్షం వెయ్యమని ప్రతిపక్షాలు అడుగుతాయి. అందుకు అధికారపక్షం విముఖత చూపుతుంది. దీనికి కారణం ఒక విషయాన్ని ఒకే కోణంలో చూసే అలవాటు లేకపోవటం. మనం చూస్తూ ఉంటాం పాలక పక్షానికి, ప్రతిపక్షాలకు ఒకే విషయం మీద భిన్నమైన అభిప్రాయాలుండటం. ఈ జాడ్యం ఎన్నికల వల్ల వచ్చిందే. ఎన్నికల్లో పరిధి దాటి విమర్శలకు దిగటమే ఇందుకు కారణం. రాజకీయ పార్టీలకు పల్స్ పోలియో లాంటి కార్యక్రమం తప్పితే చాలా అంశాల్లో ఒక తాటిమీదకు రావటం కష్టం. దీనికి కారణం ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన తర్వాత ఓటమిని అంగీకరించలేకపోవటమే. పైకి ప్రజల తీర్పును గౌరవిస్తామంటారు గానీ లోలోన ఉడికిపోతుంటారు అసూయ, అసహనంతో. ఎన్నికల ప్రచారంలో సంయమనం పాటించటం అవసరం. వ్యక్తిగత విషయాల జోలికి పోకపోవటం మేలు. ఒకసారి ఆ ఊబిలోకి దిగితే బయటకు రావటం అంత తేలిక కాదనేది తెలుసుకోవాలి.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. నాయకులు, అనుచరులు అందరూ ప్రచార పండుగలో మునిగిపోయారు. సహజమే కదా! ఎన్నికలు రాజకీయ పార్టీలకు పరీక్షా సమయం. పార్టీలు తమ జెండాను, అజెండానూ ప్రజల ముందుంచుతాయి. తమకు ఓటేసి గెలిపిస్తే ఇది చేస్తాం, అది చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపెడతారు. అది ఎంతవరకు నిజమో ప్రజలకు తెలుసు.
ఇంకా అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కానప్పటికీ, అధికార పార్టీ సాహసోపేతంగా తన అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. మరి అన్ని పార్టీలూ, అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం మరింత ఊపందుకుంటుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి చేసే వ్యక్తిగత ప్రచారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది విజయం సాధించటంలో. ఈ క్రమంలో ప్రజల పాత్ర ఏమిటి? నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలు చేసే ప్రసంగాలూ, హామీలూ, ప్రచారాలు విని ఊరుకోవటమేనా? ప్రజలు కేవలం శ్రోతలుగా మిగిలిపోవలసిందేనా పార్టీలు, నేతలు, అభ్యర్థులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే ప్రక్రియలో? పార్టీలు తమ భావజాలం సమాజానికి ఏ విధంగా హితమైనదో చెప్పవచ్చు; ఎదుటి పార్టీ వారి భావజాలంలో ఉన్న లోపాలను వేలెత్తి చూపవచ్చు. ఒక అభ్యర్థి కూడా తన స్థాయిలో నియోజకవర్గానికి ఏం చేయగలనో చెప్పవచ్చు. కానీ, ప్రచారం పేరుతో వ్యక్తిత్వ హననానికి దిగడం చాలా హానికర ధోరణి. ప్రజా జీవితం నిరంతరం ఉండే ప్రక్రియ. ప్రతి పార్టీ ఓటమిని స్ఫూర్తితో అంగీకరించాలి. ఏ పార్టీని ఆదరించాలనేది పౌరుడి ప్రాథమిక హక్కు. గెలిచిన అభ్యర్థి తనకు ఓటు వేయలేదన్న కారణంగా ఒక ఊరిని కానీ, ప్రాంతాన్ని కానీ, మతాన్ని కానీ, కులాన్ని కానీ వివక్షతో చూడకూడదు. ప్రజలు తమ ఇష్టాయిష్టాలు ఎట్లా ఉన్నా ప్రచారానికి వచ్చే నాయకుల పట్ల మర్యాద పాటించాలి. అది కనీస సభ్యత. ఎన్నికల గాయాలు ఎన్నికలవగానే మాసిపోవన్న విషయం ఎవరూ మరువరాదు.
ఇక్కడ చెప్పిన అంశాల్లో కొత్తది ఏముందీ అంటే ఏమీ లేదు. ఈ ప్రచార ప్రవాహంలో నిండా నిమగ్నమైన నేతలు, కార్యకర్తలు కొన్ని రాజనీతి సత్యాలను మరిచిపోకూడదని చెప్పే ప్రయత్నమే ఇది. భగవద్గీత, బైబిల్, ఖోరాన్లో కొత్త విషయాలేమీ ఉండవు. చదువగా చదువగా కొంత నీతి ఒంట పడుతుందని ఆశ చదివేవాళ్లకు. ఇదీ అంతే!
-గుమ్మడిదల రంగారావు