నిన్న మొన్నటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని పొగిడారు. మోదీ ప్రభుత్వ విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్న నేపథ్యంలో, ఇప్పుడు అవే బీజేపీ నేతల నోళ్లు కాళేశ్వరంలో అవినీతి అంటూ బురద చల్లుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాజకీయాలు చేస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం రికార్డు సృష్టించింది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బ్రహ్మాండమైన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవనాడిగా నిలిచి, రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసింది. గత కొన్ని దశాబ్దాల్లో లేనంతటి వరదలో కొన్ని పంపులు మునిగిపోతే ఇదే అదునుగా ఆరోపణలకు, విమర్శలకు తెగబడుతున్నారు కొందరు. ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై ప్రత్యేక కథనం..
కాళేశ్వరం ప్రాజెక్టు మీద విష ప్రచారాలకు అంతులేకుండా పోతున్నది. ఈ మధ్య కురిసిన భారీ వానలతో వచ్చిన వరదలకు రెండు పంపు హౌజులు మునిగిపోవడం, పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పడంతో విమర్శకులు నానా రచ్చచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేనికీ పనికిరాదనీ.. అదొక ‘వైట్ ఎలిఫెంట్’ అని కొందరు, లక్ష కోట్లు గోదారి పాలయ్యాయని కొందరు.. ఎవ్వరికి నచ్చినట్టు వాళ్లు వాగుతున్నరు. మరి వాస్తవం ఏందీ? కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఏం ఉపయోగం లేదా? అసలు కాళేశ్వరం కాకుండా… ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే కడితే తెలంగాణకు లాభం జరిగేదా?
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రకరకాల విషప్రచారాల నేపథ్యంలో దాని గురించి క్లుప్తంగానైనా తెలుసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో.. మొత్తం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులున్నయ్. వాటిలో.. మొదటిది మేడిగడ్డ బ్యారేజ్, రెండవది అన్నారం బ్యారేజ్, మూడవది సుందిళ్ల బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ వెనక పంపు పెట్టి.. అన్నారంలోకి; అన్నారం వెనక పంపు పెట్టి సుందిళ్లలోకి; సుందిళ్ల వెనక పంపు పెట్టి ఎల్లంపల్లిలోకి నీళ్లను ఎత్తిపోస్త రు. ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంకుకు, అక్కడి నుం చి మిడ్ మానేరు రిజర్వాయర్కు, మిడ్ మానేరు నుంచి కిందున్న లోయర్ మానేరు డ్యామ్ను నింపుకోవడం.., పైన ఉన్న మలక్పేట, అప్పర్ మానేరు రిజర్వాయర్లను నింపుకోవడం… వీటితో పాటు ఇటు సిద్దిపేట వైపు అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ కు నీళ్లు ఎత్తిపోస్తరు. ఇక మల్లన్నసాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు స్టెబిలైజేషన్ కోసం కొన్ని నీళ్లు, కొత్తగా కట్టిన కొండపోచమ్మ రిజర్వాయర్ నింపుకోవడం..దాంతో పాటు గందమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లోకి నీళ్లొస్తయ్. ఇవీ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన రిజర్వాయర్లు.
ఎల్లంపల్లి నుంచి ఎక్కువ భాగం ‘ప్రాణహిత చేవెళ్ల’ పాత ప్లాన్ ప్రకారమే జరిగింది. కాకపోతే రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది. దీని కింద 18 లక్షల 25 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు; శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరద కాలువ కింద మరో 18 లక్షల 82 వేల ఎకరాలు స్థిరీకరణ చేయడం, మొత్తంగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీంతో పాటు.. హైదరాబాద్కు తాగునీళ్లు, పరిశ్రమలకు నీళ్లివ్వడం, కాళేశ్వరం పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు ఇవ్వటం.. క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టు.
ఒకసారి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పాత డిజైన్ కూడా చూద్దాం. మహారాష్ట్ర సరిహద్దులో తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టి.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోసుకొని, ఎల్లంపల్లి నుంచి మేడారం చెరువుకు, మోతెవా గు, మిడ్ మానేరు, అనంతగిరి, ఇమామాబాద్ చెరువు, తడ్కపల్లి చెరువు, తిప్పారం చెరువుకు నీళ్లు వస్తయ్. ఇగ తిప్పారం హల్దీ వాగు, దౌల్తాబా ద్, చేర్యాల, మూసీ నది మీదుగా చేవెళ్ల చెర్వుకు; మరో వైపు ముల్కపల్లి, జంగం పల్లి చెరువు, బస్వాపురం చెర్వు, చిట్యాల మండలం దాకా నీళ్లొస్తయ్. ఇంకో దిక్కు పాములపర్తి చెర్వును నింపుకోవటం.. ఇదీ ప్రాణహిత చేవెళ్ల పాత డిజైన్. దీని ద్వారా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నది ప్లాన్.
పాత ప్లాన్ ప్రకారం అంటే.. ప్రాణహిత చేవెళ్ల ద్వారా 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లొస్తే; కొత్త ప్లాన్ ప్రకారం- కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల 25 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు, మరో 18 లక్షల 82 వేల ఎకరాలు స్థిరీకరణ చేయడం.. మొత్తం 37 లక్షల ఎకరాలకు సాగునీళ్లివ్వవచ్చు.
ఈ ప్రాజెక్టులో లొల్లంతా ఎక్కడ అంటే- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఈ మూడు బ్యారేజీల మీద, వీటి వెనకాల ఉన్న పంపుల మీదనే. గోదావరిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత 85 గేట్లతో ఈ మేడిగడ్డ బ్యారేజ్ కట్టినరు. మేడిగడ్డ వెనకనుంచి పంపుల సాయంతో ఎత్తి అన్నారంలో పోస్తరు. అన్నారం వెనక నుంచి సుందిళ్లలో పోస్తరు. అట్లనే సుందిళ్ల బ్యారేజ్ వెనక నిలిచిన నీటిని పంపుల సాయంతో లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో పోస్తరు. ఇదీ… ప్రాణహిత చేవెళ్ల రీడిజైనింగ్లో జరిగిన ప్రధాన మార్పు. అదే పాత ప్లాన్ ప్రకారమైతే… పైనున్న మహారాష్ట్ర సరిహద్దులో వాద్రా నది, వెయిన్గంగ నది కలిసిన తర్వాత.. ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి గ్రామం దగ్గర ప్రాణహిత నదిమీద ఒక బ్యారేజ్ కట్టి, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నేరుగా ఎల్లంపల్లిలో నీళ్లు పోయాలి. తుమ్మిడిహెట్టి సముద్రమట్టానికి 148 మీటర్ల ఎత్తులో ఉంటది. ఎల్లంపల్లి కూడా సముద్రమట్టానికి 148 మీట ర్ల ఎత్తులోనే ఉంటది. అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ఓ 20 మీటర్లు ఎత్తిపోస్తే సక్కగొచ్చి ఎల్లంపల్లిల నీళ్లు పడ్తయ్ కదా. అది కాదని.. సముద్రమట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఎక్కడో కింద ఉన్న మేడిగడ్డలో కట్టి ఆక్కడినుంచి అన్నారం తెచ్చి.. అక్కడి నుంచి సుందిళ్లకు తెచ్చి.. సుందిళ్ల నుంచి ఎల్లంపెల్లిలో ఎందుకు పొయ్యాలె! తుమ్మిడిహెట్టి దగ్గర ఒక్క పంపు పెడితే వచ్చే నీళ్లకు, ఇక్కడ మూడు పంపుసెట్లు, మూడు బ్యారేజీలు ఎందుకూ కట్టినట్టు? పైగా ఇన్నిసార్లు ఎత్తిపోస్తే వాటికి కరెంటు బిల్లు ఎంతొస్తది? దీంతో ఇచ్చే నీళ్లకంటే వచ్చే కరెంటు బిల్లే ఎక్కువ అని వాదించే వాళ్లు కొందరున్నరు. ఇక కొందరైతే కమీషన్ల కోసమే తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు మార్చిండ్రని అంటున్న వారున్నరు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పాత డిజైన్ అరచేతిల తేనె పోసి మోచేతిని నాకించినట్లు ఉంటది. ప్రాణహిత చేవెళ్లలో ప్రధానమైన తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్కి అనుమతులు లేవు. బ్యారేజ్ ఎత్తుమీద స్పష్టత లేదు. పైనున్న మహారా ష్ట్రతో ఒప్పందం జరగలేదు. నీటి లభ్యతపై స్పష్ట త లేదు. ఉన్న నీటిలో పైరాష్ర్టాల వాటా ఎంతో తెలియ దు. అక్కడినుంచి ఎన్ని నీళ్లు ఎత్తిపోసుకోగలగుతామో తెల్వదు. ఇలా దేని మీద స్పష్టత లేకుండానే ప్రాజెక్టు ప్రారంభించి.. దానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి’ అని పేరు పెట్టారు. 2007 మే 16న రూ.17,875 కోట్లతో పరిపాలనా అనుమతులిచ్చిన సర్కార్ ఏండ్లు గడుస్తున్నా కొద్దీ వ్యయాన్ని పెంచుతూ 2010 నాటికి అంచనా వ్యయాన్ని రూ. 40,300 కోట్లకు సవరించి కేంద్రానికి డీపీఆర్ను సమర్పించింది. ఏ అనుమతులు, స్పష్టతలు లేకుండానే ప్రాజె క్టు తల నుంచి తోక దాకా పనులు మొదలు పెట్టారు.
మరి తుమ్మిడిహెట్టి బ్యారేజ్ పనులు ఎందుకు మొదలు పెట్టలేదంటే… బ్యారేజ్ 152 మీటర్లు కడ్తామని అప్పటి ఏపీ ప్రభుత్వం, లేదు లేదు 148 మీటర్లకు మించి ఒక్క అడుగు పెంచడానికి కూడా… మేం ఒప్పుకోమని మహారాష్ట్ర ప్రభుత్వం వాదనలు, పంతాలకు దిగాయి. ఎందుకంటే.. 152 మీటర్ల ఎత్తు కడితే తమ గ్రామాలు, వ్యవసాయ పొలాలు మునిగిపోతయ్.. దానికి మేం ఒప్పుకునే ప్రసక్తే లేదని అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అందుకే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ని ముట్టుకోకుండా, కింద కాల్వ తవ్వకాల పనులు చేశారు. దీంతో 2013లో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
ఆ లేఖ సారాంశం- మా అనుమతి లేకుండా, కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ను ప్రతిపాదించి.. ఆ ప్రకారమే కింద కాల్వలు తవ్వుకుంట పోతున్నరు. మేం చెప్పినా వినకుండా మొండిగా పనులు చేసుకుంటపోతే.. మీరు పెట్టే ఆ రూ.40,300 కోట్లు మట్టిల పోసుడు తప్ప మరేమీ కాదని హెచ్చరించింది. తుమ్మిడిహెట్టిలో 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ… 2013 అక్టోబర్ 16న అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు మహారాష్ట్ర సీఎం.
ఇక్కడే ఓ ముఖ్య విషయం చెప్పుకోవాలే. 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో, ఇటు ఉమ్మడి ఏపీలో, అటు మహారాష్ట్రలో మూడు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నయ్. కానీ.. కాంగ్రెస్ దీన్ని పట్టించుకోలే. 2014 తర్వాత ప్రభుత్వాలు మారినయ్. కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఈ ప్రాజెక్టు కు కేటాయించిన 40 వేల 300 కోట్లలో ఏడు వేల కోట్లు ఖర్చు చేసి, అక్కడక్కడ కాల్వలు తొవ్వారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటిరంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. 2015 ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ స్వయంగా ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్తో చర్చలు జరిపారు. తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పించే ప్రయత్నం చేసినా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు.
‘మీరు 160 టీఎంసీల నీళ్లు వాడుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మా భూభాగాన్ని వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. మాకు ముంపు లేకుండా మీరు ఎన్ని నీళ్లయినా తీసుకోండి. తుమ్మిడిహెట్టి దగ్గరే కాకుండా మీరు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఫడ్నవీస్ మన సీఎం కేసీఆర్కు తెలిపారు.
కేసీఆర్ ముంబై పర్యటన ముగించుకుని తెలంగాణ వచ్చిన 15 రోజుల్లోనే… సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్యూసీ) ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్కు 10 పేజీల లేఖ రాసింది. ఆ లేఖ ప్రకారం.. ‘గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికలో పైన ప్రాజెక్టుల అవసరాలు పోనూ, తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత 273 టీఎంసీలని పేర్కొన్నది. కానీ అది తప్పు. ఇప్పుడు మా పరిశీలనలో తేలింది ఏందంటే.. తుమ్మిడిహెట్టి దగ్గర కేవలం 165 టీఎంసీల నీటి లభ్యతే ఉన్నది. అందులో కూడా భవిష్యత్తులో పై రాష్ర్టాలు 63 టీఎంసీలు వాడుకునే హక్కు ఉంటుంది’ అని లేఖ సారాంశం. అంటే మనకు తుమ్మిడిహెట్టి దగ్గర లభ్యమయ్యే నీళ్లు కేవలం 102 టీఎంసీలు మాత్రమే. అందులో మనం ఎత్తిపోసుకోగలిగేది 80 టీఎంసీలే. ఎందుకంటే 25శాతం ఆవిరి, ప్రవాహ నష్టాలు మినహాయిస్తే.. మనకు అక్కడ నికరంగా లభించే నీళ్లు 80 టీఎంసీలు మాత్రమే. అది కూడా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో కడితేనే. ఆ లెక్కన చూసుకుంటే తుమ్మిడిహెట్టి నుంచి 40 నుంచి 50 టీఎంసీలకు మించి నీళ్లు తీసుకోలేం. టీఎంసీకి 11 వేల ఎకరాల ఆయకట్టు వేసుకున్నా సరాసరిగా 45 టీఎంసీలు ఎత్తిపోసుకుంటే.. మొత్తం 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేం. కానీ ప్రాణహిత చేవెళ్ల డిజైన్ చేసింది 16 లక్షల 40 వేల ఎకరాలకు కదా. ఇక్కడనేమో 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా 2015 అక్టోబర్ 26న రెండు రాష్ర్టాల చీఫ్ ఇంజినీర్ల స్థాయి సమావేశం హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పించే ప్రయత్నాలు జరిగినయ్. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రెండుగా విభజించింది. ఒకటి- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు, రెండోది- కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకని తుమ్మిడిహెట్టి బ్యారేజ్ను 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద నిర్మించి 20 టీఎంసీల నీటిని తరలించి.. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రతిపాదించారు.
ఇక.. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ ఉంద ని చెప్పిన సీడబ్ల్యూసీ.. మరో సూచన కూడా చేసింది. గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వా త.. దిగువ గోదావరిలో ఏటా 1650 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని పేర్కొన్నది. ఆ నీటిని వాడుకోకపోతే అవి సముద్రంలో వృథాగా కలిసిపోతాయని తెలిపింది. అలాగే మేడిగడ్డ దగ్గర 284 టీఎంసీల నీటి లభ్యత ఉం టుందని సీడబ్ల్యూసీ రిపోర్టు పేర్కొన్నది. పైన తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలే ఉన్నప్పుడు.. మేడిగడ్డ దగ్గర 284 టీఎంసీలు ఎలా ఉంటాయి! పైన ఎంత ఉందో.. ఇక్కడ కూడా అంతే ఉండాలి కదా అనే వాదనలు చేస్తున్నరు. ఇదో మూర్ఖపు వాదన.(మిగతా రేపు…)
– శంకర్ చలమల