మీరంతా,భయపడుతూ భయపడుతూ నడుస్తూ,
ఆగి ఆగి చాటుచాటుగా,
గుడ్డికన్నులా యెందుకు చూస్తున్నారు?
నేను మీ వెంటపడేమి రావడం లేదు…
మిమ్మల్ని దాటి వెళ్ళాలని, పరుగెడుతున్నాను.
జీవితాన్ని నేనెప్పుడూ…
దేనికీ భిక్ష అడగలేదు.
నా మాట వినలేదని అలగనూ లేదు.
కష్టపడి, మీదపడి, పోట్లాడి..,
కావలసిన దాన్ని గెలుచుకున్నాను.
దినమంతా శిథిలాల్లో తిరిగి,
ఒక పురాతన మట్టి దీపాన్ని వెదుక్కొన్నాను.
అటు సూర్యుడు మునుగగానే,
చీకట్లో దాన్ని వెలిగించి పెట్టుకున్నాను.
వీధుల్లో నడుస్తుంటే, అనురాగ మూర్తుల్లా,
ఆడవాళ్లంతా బయట నిలుచున్నారు,
మా అమ్మ చనిపోయిందని,
వాళ్ళకెలా తెలిసిందో మరి..,
అందరూ బువ్వగిన్నె పట్టుకొని,
నవ్వుతూ పిలుస్తున్నారు.
నాకూ…
ఒకచోట కూర్చోవాలనే వుంది.
జాగ దొరకకుండా…
అడుగడుగునా,
నెంబర్లేసిన రాళ్ళు పాతారు
కొన్ని చోట్లకు…,
అవి సమాధులని రానివ్వడం లేదు.
మరికొన్ని మూలల్లో…,
అమ్ముడుపోయాయని కూర్చోనివ్వడం లేదు.
అయినా ఈ నేలను నమ్ముకొని,
నాలుగడుగుల కోసం తిరుగుతున్నాను.
ఈ నగరంలోకి,
నీవు వచ్చావని తెలిసింది.
నన్ను వచ్చి కలవమంటావా?
నేను జ్ఞాపకముంటే,
నీవే కలిసి చూసిపోతావా?
నా కళ్ళలో మార్పేమీ లేదు…
మనుషులు కనిపిస్తే చాలు,
జలజలా మెరుపులా వొలుకుతాయి.
ఇప్పటికీ నన్ను గుర్తుపట్టడం,
ఏమంత ఇబ్బంది కాదు.
తుఫాన్లు తాకిన,
మైలురాయిలా కనిపిస్తాను.
రోజురోజుకూ ఆకాశం,
కిందికి దిగుతున్నట్టుంది.
అలా కాకుంటే,
హర్మ్యాలన్నీ అంత ఎత్తుకు
ఎలా లేస్తున్నాయి?
ఎండలో చూద్దామన్నా,
వెన్నెల్లో కలుద్దామన్నా,
జీవితం బయటకురావడం లేదు.
పెంపుడు జంతువుల్లా ఎప్పుడూ,
ఈ కష్టాలు నా వెంటే ఉంటాయి,
ఎంతదూరం తరిమినా,
విశ్వాసం వీడకుండా,
నా వేలు పట్టుకొని గారాలు పోతాయి.
-ఆశారాజు