1965లో భారత పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. సియాల్ కోట్ వద్ద జరిగిన భీకర యుద్ధంలో పాకిస్థాన్కు చెందిన దాదాపు 60 యుద్ధట్యాంక్లను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర వహించారు. ఈ యుద్ధంలో భారత్ కు చెందిన 9 మంది సైనికులు వీరమరణం చెందారు. వారిలో తారాపూర్ కూడా ఉన్నారు.
హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సైన్యంలో మేజర్గా పనిచేసిన సైనికుడికి భారత ప్రభుత్వం అత్యున్నత ‘ పరమవీర చక్ర ’ పురస్కారాన్ని అందచేసింది. ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ, అక్షరాలా నిజం. ఈ ఆసక్తికర అంశం గురించి తెలియాలంటే నాటి రోజుల్లోకి వెళ్లాలి.
అర్దేషర్ బెర్జొరీ తారాపూర్ (ఏ.బీ తారాపూర్). ఇతను ఛత్రపతి శివాజీ వంశానికి చెందినవాడు. పాఠశాల విద్య పూర్తికాగానే, మంచి క్రీడాకారుడైన తారాపూర్ 1942 జనవరి 15 న నిజాం సైన్యంలోని 7 వ హైదరాబాద్ ఇంఫాట్రీలో సైనికుడిగా చేరాడు. అయితే, అప్పటి సైనిక కమాండర్-ఇన్- చీఫ్ అయిన మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఆల్ అంద్రూస్ ఒకసారి వీరి 7 వ ఇంఫాట్రీ తనిఖీ కోసం వచ్చాడు. అంద్రూస్ వచ్చే మార్గంలో పొరపాటున హ్యాండ్ గ్రేనేడ్ పడింది. దీన్ని గమనించిన తారాపూర్ వెంటనే ఆ గ్రేనేడ్ను పట్టుకొని దూరంగా విసిరివేశాడు. గాలిలోనే ఆ గ్రేనేడ్ పేలడంతో తారాపూర్కు స్వల్పంగా గాయాలయ్యాయి. అది చూసిన అంద్రూస్ తారాపూర్ను అభినందించి మొదటి హైదారాబాద్ ఇంపీరియల్ సర్వీస్ లాన్సర్కు బదిలీ చేశాడు. 2వ ప్రపంచ యుద్ధంలో నిజాం సైన్యం తరపున తారాపూర్ పాల్గొన్నారు.
1947 ఆగస్టు 15 న భారత్ స్వాతంత్య్రం పొందిన అనంతరం, దేశంలోనే అతిపెద్ద, అత్యంత ధనవంతమైన హైదరాబాద్ స్టేట్ పై భారత యూనియన్ బలగాలు ఆపరేషన్ పోలో పేరిట సైనికచర్య జరిపాయి. ఆ సమయంలో తారాపూర్ నిజాం సైనికుడిగా భారత సైన్యానికి వ్యతిరేకంగా సూర్యాపేట వద్ద యుద్ధంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ మీదుగా వచ్చిన భారత యూనియన్ బలగాలను సూర్యాపేట వద్ద అడ్డుకొని ముందుకు రాకుండా నిలువరింప జేయడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. అనంతర పరిణామాల్లో ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడానికి అంగీకరించాడు. తారాపూర్ 1951లో భారత సైనిక దళం పూనా హార్స్ రెజిమెంట్లో ట్యాంక్ విభాగంలో చేరాడు. నిజాం సైన్యంలో మేజర్గా పనిచేసిన సైనికుడు భారత సైన్యంలో కెప్టెన్ స్థాయికి చేరుకోవడం అంత సులభంకాదు.
సియాల్ కోట్ వద్ద జరిగిన యుద్ధంలో 60 పాకిస్థాన్ యుద్ధట్యాంక్లను మట్టుబెట్టడంలో నాయకత్వం వహించిన తారాపూర్కు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత యుద్ధ పురస్కారం పరమ వీర్చక్రను ప్రదానం చేసింది.
– కన్నెకంటి వెంకటరమణ
98499 05900
(వ్యాసకర్త: జాయింట్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ)