రాళ్లను మొరటు పనిముట్లుగా చెక్కిన పాత రాతియుగం కొన్ని లక్షల ఏండ్లు నడిస్తే, నునుపెక్కిన కొత్త రాతియుగపు పనిముట్లు చెక్కుకొనే దశ మధ్య రాతియుగం గుండా సాగింది. మానవుల అభివృద్ధి ఒకే రకంగా, ఒకే క్రమంలో సాగలేదు. ఎన్నో ఎత్తుపల్లాల్లో కొనసాగిన ఈ క్రమం పాత రాతియుగంలో లక్షల ఏండ్లు పడితే కొత్త రాతియుగంలో మార్పులు మాత్రం వేగంగా, గుణాత్మకంగా చోటుచేసుకున్నాయి. అప్పటి నుంచి మార్పుకు సంబంధించిన ప్రతీ అడుగు తులనాత్మకంగా, గతం కంటే వేగంగా సాగడం మొదలైంది.
పాత రాతియుగం నుంచి మానవుడు కొత్త రాతియుగం చేరే క్రమంలో వచ్చిన సంధి యుగాన్ని మధ్య రాతియుగం లేక మీసోలిథిక్ పీరియడ్ అంటారు. వేటకు, వ్యవసాయానికి మధ్య సంధికాలం మధ్య రాతియుగం.
ఈ భూమి మీద ఐదు పెద్ద హిమయుగాలు గడిచాయి. చివరి హిమయుగం క్రీ.పూ.18,000 తో మొదలై క్రీ.పూ.8,500 నాటికి మంచు తగ్గి, వాతావరణం వేడెక్కింది. ఇప్పటికి 11,650 ఏండ్ల ముందు మొదలైన ఈ కాలాన్ని భూగర్భశాస్త్ర పరిభాషలో హాలోసీన్ కాలం అంటారు. ఈ కాలంలో భూమి మీద వాతావరణం సమశీతోష్ణస్థితికి మారి కొత్త వృక్ష, జీవజాలాల మనుగడకు అనుకూలంగా తయారైంది. క్రీ.పూ.8,000 నుంచి క్రీ.పూ.2,000 వరకు ఉన్న కాలాన్ని మధ్య రాతియుగం లేదా సూక్ష్మ రాతియుగం అని కూడా అంటారు.
భారత ఉపఖండంలోని మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న మార్పులు తెలంగాణలో కూడా కొంచెం ముందూ వెనుకగా చోటు చేసుకున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మానవ పరిణామ క్రమంలో ఎన్నో మార్పులకు ఆలవాలమైన మధ్య ఆసియా, ఆఫ్రికా లాగా ఇక్కడ కూడా అన్ని దశల ఆధారాలు ఉన్నాయి.
రాతియుగం చివరి కాలపు పనిముట్లు ఉన్న చోటే సూక్ష్మ రాతి పనిముట్లు (మైక్రోలిత్స్) తెలంగాణలో దొరికినయి. ఈ కాలాన్ని సూక్ష్మ రాతియుగం లేదా మధ్యరాతియుగం అని కూడా అంటారు. ఎందుకంటే అప్పటి పనిముట్ల సైజు రెండు అంగుళాలకు మించవు. చెకుముకి రాయి, స్ఫటిక రాయి, జాస్పర్, చెర్ట్, అగేట్, చాల్సిడోనీ, కార్నీలియన్ వంటి రకరకాల గులకరాళ్ల పెచ్చులతో ఈ సూక్ష్మ రాతి పనిముట్లు చేసుకునే వాళ్లు. ఈ పెచ్చులను ఒక కట్టెకు కట్టి లేదా అతికించి రంపంలాగా, కొడవళ్లుగా, బాణాల ములికి లాగా వాడుకునేవాళ్లు. రాళ్లను పెచ్చులుగా, ములుకుల్లాగా, బ్లేడ్లుగా, చంద్రవంక ఆకారపు బ్లేడ్లు, త్రికోణాకారంలో, చతురస్రాకారంలో- ఇలా చెక్కి వేర్వేరు పనులకు ఉపయోగించే వాళ్లు.
నదులు, వాగుల ఒడ్డున, గుట్టల పక్కన, బహిరంగ స్థలాల్లో సూక్ష్మ రాతి పని ముట్లు చేసుకున్న ప్రదేశాలు మనకు కనిపిస్తాయి. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ మొదలు ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతాల వరకు ఎన్నో సూక్ష్మ రాతియుగపు స్థలాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో ఆసిఫాబాద్లో పెద్దవాగు ఒడ్డున, బాసర, బోథ్ దగ్గర పొచ్చెర జలపాతం వద్ద, రామగిరి గుట్ట కింద, పెద్దబంకూరు, ధర్మపురి, వేములవాడ, గౌరీగుండం, సుల్తానాబాద్, కదంబపూర్- ఇలా ఎన్నో ఊళ్లలో మనకు మైక్రోలిత్స్ దొరికినయి. దక్షిణ తెలంగాణలోని నల్గొండ జిల్లాలో రాయవరం, మీనంపల్లి కొత్త రాతియుగ నివాసాలు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో 1900లోనే హెన్రీ కౌసిన్స్ సూక్ష్మ రాతియుగపు ఫ్యాక్టరీ (అంటే మైక్రోలిత్స్ తయారీ స్థలం) కనుగొన్నాడు. ఇలా సూక్ష్మ రాతియుగం (మధ్య రాతియుగం) తెలంగాణలో కొత్త రాతి యుగానికి తెర లేపింది.
కొత్త రాతియుగంలో రాతి పనిముట్లు చిన్నగా, నునుపెక్కి, మరింత నైపుణ్యంతో తయారైనాయి. సూక్ష్మ రాతి పనిముట్లతోపాటు చెకుముకి రాయి, స్ఫటికం, కురువింద, నల్లసరపు రాళ్లతో అందమైన చేతి గొడ్డళ్లు, పదునైన బాణాలు, కత్తులు, బరిసెలు, గోకుడు రాళ్లు, కొడవళ్లు, బ్లేడ్లు వంటివి చేసుకున్నారు. వీటిని కట్టె పిడులలో బిగించడంతో గొడ్డళ్లు, బాణాలు, బరిసెలు తయారైనాయి. ఈ పనిముట్లు చెక్కుకున్న, నునుపు చేసున్న ఆనవాళ్లు ఇప్పటికీ మనకు కొండలలో, బండరాళ్ల మీద నిలువుగా గుంతల రూపంలో కనిపిస్తాయి. వీటినే నియోలిథిక్ గ్రూవ్స్ అని అంటారు. ఇదంతా ఒక ఎత్తైతే కొత్త రాతి యుగంలో ఆవిష్కరణ అయిన ఎన్నో కొత్త విషయాలు మానవుల ప్రగతిని ఎన్నో రెట్లు పెంచాయి. అప్పటివరకు వేట, ఆహారసేకరణపైనే ఆధారపడ్డ మనుషులు ఉత్పత్తి చేయడం నేర్చుకున్నారు. అదే వ్యవసాయం. మధ్య రాతియుగంలోనే ప్రాథమికంగా మొదలైన వ్యవసాయిక లక్షణం కొత్త రాతియుగంలో స్థిరపడింది. వ్యవసాయం మనిషిని మైదానప్రాంతాలకు చేర్చి స్థిరనివాసానికి అలవాటుపడేలా చేసింది. దాంతో కొత్త రాతియుగపు మానవ ఆవాసాలు మొదలైనాయి. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ కూడా పెద్ద ఎత్తున మొదలైంది.
1957లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎఫ్. ఆర్.అల్చిన్ ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాలలో కొత్త రాతి యుగపు బూడిద కుప్పలు, ఆధారాలు దొరికాయి. రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా క్రీ.పూ.2,160 నుంచి క్రీ. పూ.1,250 ముందు వరకు ఇక్కడ కొత్త రాతి యుగపు నివాసం ఉండిందని, ఉట్నూర్లో ఉన్న బూడిద కుప్పలు నాటి ప్రజలు పశువుల పేడను కాల్చగా ఏర్పడ్డాయని ఆల్చిన్ తేల్చారు. ఇదే కృష్ణ-తుంగభద్ర ప్రాంతాల్లోనే అచ్చంపేట వద్ద చంద్రవాగు ప్రాంతంలో, కూడలి సంగమేశ్వరం, సోమశిల ప్రాంతాల్లో కొత్తరాతి యుగపు పనిముట్లు లభించినాయి.
పెద్దపల్లి జిల్లా తొగర్రాయి గ్రామం, గ్రానైట్ గుట్టల మధ్య, మానేరు నదికి దగ్గర్లో కొత్త రాతి యుగపు మనుష్యులు జీవించారు. ఇక్కడ చేతి గొడ్డళ్లు, బాడిశల వంటి పనిముట్లు దొరికాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ దగ్గరి బూడిగపల్లి గ్రామం పక్కనే ఉన్న వలసగట్టు కొండ కింద భాగంలో, శాతవాహన కాలపు నగరం పెదబంకూర్ తవ్వకాలలో చేతి గొడ్డళ్లు వంటి ఆధారాలు దొరికినయి. కరీంనగర్ జిల్లా కదంబపూర్లో బృహత్ శిలాయుగపు సమాధులలో దొరికిన పనిముట్లు.. కొత్త రాతియుగంలో తర్వాత ఎదిగిన దశ ‘బృహత్ శిలాయుగం’ అనే విషయాన్ని చెబుతుంది. ఇక జనగామ జిల్లా పోలకొండ, కోలకొండ, దేవరుప్పలలలో కొత్త రాతియుగపు ఆవాసాలు లభ్యమైనాయి. కృష్ణ-తుంగభద్రా బేసిన్లోని వనపర్తి జిల్లా చిన్నమారూర్, పెద్దమారూర్, కూడవెల్లి, కారపాకల వంటి గ్రామాలు, మూసీ లోయలో వర్ధమానుకోట – ఇలా చెప్పుకొంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది.
కొత్త రాతి యుగపు మనుష్యుల విశ్వాసాలు.. చనిపోయిన వారిని ఖననం చేసిన సమాధుల రూపంలో దొరుకుతున్నాయి. తాము నివసించే ప్రదేశాల పక్కనే ఒక పద్ధతి ప్రకారం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య కుండల్లో (ఎముకలను), సమాధుల్లో మృతదేహాలను పాతిపెట్టేవాళ్ళు. ఈ సమాధులే నాటి వస్తు సామాగ్రినీ, మనిషి భౌతిక అవశేషాల్నీ మనకు మిగిల్చినయి. ఈ సమాధుల సంస్కృతినే మనం బృహత్ శిలాయుగం అని అంటున్నాం. ఇది కూడా కొత్త రాతియుగంలో భాగమే.
పాత రాతియుగం నుంచి కొత్త రాతియుగం వరకు మనిషి తాను తిరుగాడిన చోట ఎరుపు, తెలుపు రంగుల్లో గీసిన చిత్రాలు నాటి జీవనాన్ని, జీవజాలం గురించిన కథల్నీ చెపుతాయి. తెలంగాణలో ఇప్పటి వరకు సుమారు 50 స్థలాల్లో దొరికిన రాతి యుగపు చిత్రాలు నాటి జీవితాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
తెలంగాణ చరిత్రలో కొత్త రాతియుగం కేవలం ఒక అధ్యాయం కాదు. అది రాబో యే తొలి చారిత్రక యుగానికి కర్టెన్ రైజర్ వంటిది. ఈ కొత్త రాతియుగంలో నేర్చుకున్న వ్యవసా యం, పశుపోషణ, లోహవిజ్ఞానం, వస్తువుల ఉత్పత్తి, సామాజిక జీవనం తెలంగాణను తదనంతర కాలంలో భారత ఉపఖండంలో అశ్మక మహాజనపదంగా తీర్చిదిద్దడానికి కారణమైంది. నేటికీ మన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనంలో ఉన్న తెలంగాణ తత్వానికీ ప్రాతిపదిక అయింది. గత నూరేళ్లలో తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో జరిగిన పురాతత్వ తవ్వకాలు, పరిశోధనలు బయటకు తెచ్చిన బృహత్ శిలాయుగపు సంస్కృతి, లోహవిజ్ఞానం- ఇలా ఎన్నో అంశాల్ని వచ్చే వారాల్లో విస్తృతంగా చర్చిద్దాం.
ఆహారాన్ని, నీటిని నిలువ చేసుకోవడానికి మట్టి పాత్రలను తయారుచేసుకోవటం కొత్త రాతియుగపు కళే. మొదట్లో మట్టిపాత్రల్ని చేతితో తయారుచేసి, ఎండబెట్టి వాడుకున్నా.. ఆ తర్వాత కుమ్మరి సారె, పాత్రల్ని కాల్చే ఆవం, వాటికి అవసరమయ్యే పరికరాలను కనుగొన్నారు. మన దేశంలో చరిత్ర పూర్వయుగ పరిశోధనకు ఆద్యుడు రాబర్ట్ బ్రూస్ ఫూట్ భారతదేశ వ్యాప్తంగా కొత్తరాతి యుగానికి సంబంధించిన 77 రకాల వస్తువుల్ని గుర్తించి, అందులో 37 పనిముట్లను వేటకి ఉపయోగపడేవాటిగా, మిగిలినవాటిని కుండలు, మట్టిపాత్రలు, మూకుళ్లు, గురుగులు, గోళాలు వంటి ఇంటి సామాన్లుగా రికార్డు చేశాడు. మొదట్లో మట్టిపాత్రలు, బూడిద, పేలవమైన గోధుమ రంగు, నలుపు వంటి రంగుల్లో ఉండేవి.
కొత్త రాతియుగం చివరి రోజుల్లో జరిగిన ఇంకో పెద్ద ఆవిష్కరణ లోహాల్ని గురించి తెలుసుకొని వినియోగించడం. చరిత్రలో మొదటిసారి కరిగించి వాడుకున్న లోహం రాగి. తెలంగాణలో ఇనుము వాడకం గురించిన ఆధారాలు, తవ్వకాల్లో, నేల పొరల్లో విస్తృతంగా దొరికినయి. చరిత్రకారుల అంచనా ప్రకారం దక్కన్లో, తెలంగాణలో క్రీ.పూ.1,000 నుంచి ఇనుము వాడకం మొదలైందని అంటారు. కానీ హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో దొరికిన సమాధుల కాలాన్ని క్రీ. పూ.2,795 నుంచి క్రీ. పూ.2,145గా థర్మోల్యూమినిసెన్స్ పరీక్ష నిర్ధారించింది. అంటే చరిత్ర చెపుతున్న దానికంటే ముందే తెలంగాణలో ఇనుము ఆవిష్కరణ జరిగిందని భావించాలి. ఈ లోహ విజ్ఞానమే వ్యవసాయం, రక్షణ, గృహవినియోగం, అలంకరణ కోసం రకరకాల పనిముట్లు, ఆయుధాలు, సామగ్రి తయారీకి అవకాశమిచ్చింది.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000