దేశాన్ని మాతృభూమిగా భావించడం మన సంప్రదాయం. దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్న నదులు కూడా మాతృమూర్తులే. అందుకే నదులను స్త్రీ రూపాలుగా, తల్లులుగా భావిస్తాం. గంగ, గోదావరి, నర్మద, కావేరి ఇలా అనేక నదులు మన దేశంలో ప్రవహిస్తున్నాయి. తమ అమృత జలాలతో ఈ నేలంతా ఈనేలా ధాన్యరాశులు కురిపిస్తున్నాయి. అలాంటి నదీమ తల్లుల్లో ప్రధానమైనది గంగ. ఉత్తర భారతాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దింది గంగానది అయితే, దక్షిణాపథాన్ని సలక్షణంగా మార్చిన ఘనత గోదావరికి దక్కుతుంది. అందుకే పావన గోదావరిని దక్షిణ గంగగా భావిస్తారు.
గో హత్య పాతకంతో కుమిలిపోతున్న గౌతమ ముని తన పాప పరిహారం కోసం కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపః ఫలంగా ఆవిర్భవించింది గోదావరి. మహారాష్ట్రలోని త్రయంబకం క్షేత్రం సమీపంలో బ్రహ్మగిరి గోదావరి ఉద్భవ స్థానం. పడమటి కనుమల్లో పల్లవించిన నది త్రయంబకేశ్వరుడిని స్పృశించి, పంచవటిలో రామాయణ కావ్యానికి సాక్షిగా నిలిచి, ప్రతిష్ఠానపురం (పైఠణ్)లో శాతవాహనుల రాజధాని వైభవాన్ని చూసి, బాసరలో శ్రీవాణి వీణను శ్రుతి చేసి, ధర్మపురి లక్ష్మీనరసింహుడి పాదాలు కడిగి, కాళేశ్వరుడిని అభిషేకించి, భద్రగిరి రామయ్యకు ప్రణుతులిడి అఖండ గోదావరిగా కడలి వంక కదలిపోతుంది.
ఒక జాతి సుదీర్ఘ చరిత్రకు నదులు, పర్వతాలు సాక్ష్యాలు. తెలుగువారి చరిత్రకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక సంపదకు గోదావరి ఆలవాలం. శాతవాహనులు ఈ నదీ తీరంలోని ప్రతిష్ఠానపురాన్ని (పైఠణ్) రాజధానిగా చేసుకొని పరిపాలించారు. తర్వాత ఎందరో రాజులు గోదావరి గడ్డ మీద రాజ్యం చేశారు. నదీ తీరం వెంట తెలుగు సాహిత్యం ఘనంగా పరిఢవిల్లింది. మహాభారతం, భాగవతం మొదలైన సాహితీ సంపద గోదారమ్మ ఒడిలోనే పురుడుపోసుకున్నది. ఎన్నో కావ్యాలు, ఎంతోమంది సాహితీవేత్తలు, వేదపండితులు, కళాకారులకు జన్మనిచ్చింది గోదావరి పరీవాహక ప్రాంతం. దక్షిణ గంగ ఒడిలో తడిసి అన్ని మతాలూ పునీతమయ్యాయి. విశ్వాసాలు వ్యాప్తి చెందాయి. హైందవంతో పాటు బౌద్ధం, జైన మతాలు గోదావరి దారిలో విశేష ప్రాచుర్యం పొందాయి. శైవ, వైష్ణవ క్షేత్రాలు, బౌద్ధ స్తూపాలు, జైన, సిక్కు మత కేంద్రాలు అనేకం గోదావరీ తీరంలో ఆధ్యాత్మికతను వెదజల్లుతున్నాయి.
తల్లి గోదావరి పొంగితే.. చేను, చెలక మురిసిపోతాయి. మడి తడిపిన గంగమ్మకు ఓ చోట దండిగా పండిన పసుపు పారాణి పెడుతుంది. ఇంకోచోట ఎర్రగ పండిన మిరప కుంకుమ దిద్దుతుంది. మరోచోట పత్తిచేను మెత్తటి చీర చుడుతుంది. వరిచేను నదీమ తల్లికి ఆపాద మస్తకం పచ్చల పేరులా ప్రకాశిస్తుంది. పిల్ల కాల్వగా మొదలైన గోదావరి నిండుగా మారే దారిలో మేలైన అటవీ సంపద కనిపిస్తుంది. మనిషి జీవించడానికి గాలి, ఆహారం ఎంత అవసరమో, అలాగే నీరు కూడా. ఈ అవసరాన్ని గుర్తించిన మనిషి అనాదిగా తన నివాసాన్ని ఎక్కువగా నదీతీరాలలో ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. తాను చేసుకునే ఆహార సంపాదనలో ప్రధాన పాత్ర వహించే వ్యవసాయానికి సాగునీరును కాలువల రూపంలో నదుల నుంచి స్వీకరించడానికి శ్రీకారం చుట్టాడు. అది తర్వాతి కాలంలో ఆనకట్టల నిర్మాణాలకు స్ఫూర్తినిచ్చింది. వేల ఎకరాల నేల సాగుకొచ్చింది. కోట్లాది జనుల కడుపు నిండింది. కాకతీయులు వ్యవసాయాభివృద్ధి కోసం నదుల నుంచి ఎన్నో కాలువలు నిర్మించారు. తటాకాలు కట్టించారు. ఆ స్ఫూర్తితో కాలక్రమంలో గోదావరి నదిపై నిర్మించిన అనేక ఆనకట్టల వల్ల వ్యవసాయ, విద్యుత్ రంగాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాయి. ముక్తిధారగా మొదలైన గోదావరి భక్తి కేంద్రాలకు ఆలవాలమై, ఇప్పుడు భుక్తి కేంద్రకంగా కూడా మారిపోయింది.
– అప్పాల
శ్యాంప్రణీత్ శర్మ
94409 51366