‘ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేయాలి. ఇదేమని జనం నిలదీయకుండా వారి మధ్య మతచిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలి’- కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న కుటిల నీతి ఇది. నష్టాలు వస్తున్న సంస్థలను లాభాల బాట పట్టించటం అనే సవాల్ను స్వీకరించటం మాట అటుంచి.. అద్భుతమైన పనితీరుతో, దేశానికి, రాష్ర్టాలకు తలమానికంలా ఉన్న కంపెనీలను అమ్మటం కేంద్రం ఎజెండాగా మారింది. ఎల్ఐసీ వంటి దిగ్గజ కంపెనీలను ప్రైవేటుపరం చేయటానికి అడుగులు వేస్తున్న ప్రభుత్వం కన్ను సింగరేణిపై పడింది. తెలంగాణపై అకారణ ద్వేషంతో రగిలిపోతున్న మోదీకి తెలంగాణ సిరుల పంటగా ఉన్న ఈ కంపెనీని చూస్తే కడుపుమంటగా ఉన్నట్లుంది. అందుకే నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేస్తామంటూ చెబుతున్నారు. ఈ వేలం పాటలో ప్రైవేటు కంపెనీలతో కలిసి సింగరేణి కూడా పాల్గొనవచ్చని ఉచిత సలహాలిస్తున్నారు.
ఈ తరహా వేలంపాటల్లో పోటీపడి బొగ్గు బ్లాకులను దక్కించుకున్న కోల్ ఇండియా తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నది. అటువంటప్పుడు సింగరేణికి కేంద్రం ఆ సలహా ఎందుకు ఇస్తున్నట్లు? సింగరేణిని కూడా నష్టాలపాలు చేయాలనా? లాభాల కోసమే పనిచేసే ప్రైవేటు కంపెనీలతో, ప్రజా ప్రయోజనం లక్ష్యంగా ఉండే ప్రభుత్వ సంస్థలకు అసలు పోటీ ఎందుకు పెట్టాలి? ప్రైవేటు వ్యక్తులతో లాలూచీ కాకపోతే దీంట్లో మరో కారణమేమైనా ఉందా? ఏపీలో వైజాగ్ స్టీల్ప్లాంట్కు అవసరమైన ముడి ఇనుము గనులను కేటాయించకుండా నష్టాల్లోకి బలవంతంగా తీసుకెళ్లి, ఇప్పుడు ప్రైవేటుపరం చేయటానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన కుట్రలను అమలు చేయాలనా పన్నాగం? గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోరిక మేరకు లిగ్నైట్ బ్లాకులను కేటాయించిన కేంద్రం.. సింగరేణికి ఆ నాలుగు బ్లాకులను కేటాయించాలని అడిగితే ఎందుకు కేటాయించదు? మోదీ సర్కార్ గుజరాత్కే ప్రభుత్వమా? యావత్ దేశానికి కాదా?
2014లో సింగరేణి టర్నోవర్ రూ.11,923 కోట్లు కాగా, నేడు అది రూ.27 వేల కోట్లకు పెరిగింది. అంటే, ఏడేండ్లలో 125 శాతం వృద్ధి. బొగ్గు ఉత్పత్తి 450 లక్షల టన్నుల నుంచి 670 లక్షల టన్నులకు పెరిగింది. సింగరేణి నుంచి తెలంగాణలోని దాదాపు రెండువేలకు పైగా పరిశ్రమలకు బొగ్గు సరఫరా జరుగుతున్నది. కంపెనీ లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను అందించటమేగాక అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒక సంస్థను అభివృద్ధి చేసే పద్ధతి ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సాధ్యమైన ప్రగతి ఇది. మోదీ సర్కార్కు చేతనైతే దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఇలా తీర్చిదిద్దాలి. అంతేగానీ, ‘అమ్ముకుంటాం.. సొమ్ము చేసుకుంటాం’ అనుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు. తెలంగాణ ఉద్యమకాలంలో దివిటీలై వెలిగిన చరిత్ర సింగరేణి నల్లసూరీళ్లది. వారితో పెట్టుకుంటే మోదీ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.