అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీహరి వాస్తవానికి జనన మరణాలు లేనివాడు. అయినా పరమాత్మ అనేక అవతారాలు ధరించినట్టు మనందరికీ తెలిసిన విషయమే. పరమాత్మ అవతారాల ఆంతర్యాన్ని ‘అజాయమానో బహుధా విజాయతే’ అనే సూక్తి వివరిస్తుంది. అంటే భగవంతుడు జీవుల్లా కర్మవశమైన పుట్టుక లేనివాడని అర్థం. సంసార సముద్రంలో పడినవారిని ఉద్ధరించడానికి, సాధు సజ్జనులను, భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, అసుర శక్తులను నిర్మూలించడానికి, ధర్మ సంస్థాపనకు తాను ప్రతి యుగంలోనూ అవతరిస్తానని స్వయంగా దేవుడు భగవద్గీతలో తెలియజేశాడు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి దశావతారాలు లోక ప్రసిద్ధి చెందాయి.
శ్రీహరి మరిన్ని అవతరాలు దాల్చాడని చెప్తున్నది భాగవతం. నరనారాయణ, నారద, కపిల, దత్తాత్రేయ, యజ్ఞ, రుషభ, పృథువు, ధన్వంతరి, మోహిని, వ్యాసుడు, బుద్ధ ఇలా మరో 11 అవతారాలు, మొత్తంగా 21 అవతారాలు ధరించాడని పేర్కొన్నది. అయితే, వీటన్నింటిలో శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలే పూర్ణమైనవి. ఈ రెండు అవతారాలకు చాలా దగ్గరి పోలికలున్నాయి.
నద్యాః కూలే అవతీర్ణౌ పితృవచన పరిత్రాయకౌ ప్రేమవశ్యౌ
ఆబాల్యాత్ వైరిబృంద క్షపణపటుతరౌ ప్రాప్తకాంతరయాత్రౌ
మోక్షైశ్వర్య ప్రదౌచాపి అవరకులజ సౌహార్దధన్యౌ సురమ్యౌ
పారమ్యే నిర్వ్యపేక్షౌ అతిమనుజకృతీ రామకృష్ణౌ నమామి॥
అని మహావిద్వాంసులు శ్రీమాన్ ప్రతివాది భయంకరం అణ్నంగరాచార్య స్వామి (కంచి) పేర్కొన్నారు. శ్రీరామచంద్రస్వామి సరయూ నదీతీరంలో అవతరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరంలో జన్మించాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఈ ఇద్దరూ తండ్రి మాటకు కట్టుబడినవారే. ఇద్దరూ తమ తండ్రులకు విధేయులై ఉంటూ చక్రవర్తి కుమారుడు, నందగోపుని కుమారుడు అనే ప్రసిద్ధి పొందారు. ఇద్దరూ అనేకమంది ప్రేమకు పాత్రులయ్యారు. వారి ప్రేమకు వశులయ్యారు. బాల్యం నుంచే శ్రీరాముడు, కృష్ణుడు దుష్టులైన రాక్షసులను వధించారు. ఇద్దరూ అరణ్యాల్లో సంచరించినవారే. అంటే రాముడు వనవాస సమయంలో దండకారణ్యంలో ఉంటే, శ్రీకృష్ణుడు బృందావనంలో సంచరించాడు. శ్రీరాముడు సుగ్రీవుడికి ఐశ్వరం, జటాయువుకు మోక్షం ప్రసాదించాడు. శ్రీకృష్ణుడు కుచేలుడికి ఐశ్వర్యాన్ని, ఘంటాకర్ణుడికి, దధిభాండునికి మోక్షాన్ని ప్రసాదించాడు. గుహుడితో రాముడు, గోపాలకులతో శ్రీకృష్ణుడు స్నేహం చేసి, తాము ధన్యులమయ్యామని భావించారు. ఈ ఇద్దరూ సమ్మోహన రూప, గుణ సౌందర్యం కలిగినవారే.
తాము దేవతలతో పూజింపదిగినవారే అయినా, శ్రీరాముడు తనను తాను మానవ మాత్రుడిగానే భావించాడు. శ్రీకృష్ణుడు గోపాలకులతో ‘నన్ను మీ బంధువుగా భావించండి’ అని ప్రకటించాడు. ఇద్దరూ సౌశీల్యం, సౌకుమార్యం, దయ, వాత్సల్యం తదితర సద్గుణాలు కలిగి ఉన్నవారే! అద్భుత కృత్యాలను చేసినవారే! ఈ విధంగా ఎన్నెన్నో విషయాల్లో దగ్గరి పోలికలు కలిగి ఉన్న శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలతోపాటు, వామన, వరాహ, నరసింహ వైభవాన్ని స్మరించడం ద్వారా అత్యున్నతమైన శ్రేయస్సును పొందగలం.
శ్రీకృష్ణ పరమాత్మనే భగవద్గీతలో ‘జన్మ కర్మచమే దివ్యం యోవేత్తి తత్తతః’ అని పేర్కొన్నాడు. ‘ఎవరైతే నా అవతారాల వైభవాన్ని, నా లీలలను, దివ్య చేష్టలను క్షుణ్ణంగా తెలుసుకుంటారో, నిత్యం నన్ను స్మరిస్తారో అలాంటివారు సంసారబంధ విముక్తులై నన్ను పొందుతారు’ అన్నాడు. అందుకే భగవంతుడి అవతారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ అవతారాల ప్రాశస్త్యాన్ని స్మరించుకోవాలి. దైవలీలా విశేషాలను తలచుకోవడం ద్వారా భగవంతుడి అనుగ్రహం తప్పకుండా పొందగలుగుతాం.
– సముద్రాల శఠగోపాచార్యులు
98483 73067