అప్పట్లో నా గురించి, నా ‘అత్యుత్సాహం’ గురించి చాలా మంది వ్యాఖ్యానాలు చేశారు. మీడియాలో రాశారు. అప్పటి అధికార పార్టీ వర్గాలు విమర్శించాయి. నా సహచరులు కూడా నవ్వారు. ఉద్యోగం పోవచ్చని కొందరు హెచ్చరికలు కూడా చేశారు.
ఈ వ్యాఖ్యానాలు, విమర్శలకు కారణం ఒక వంతెన. దక్షిణ భారతంలోని దండకారణ్యంలో ఒక మూల ఈ వంతెన కట్టాలనుకున్నాను. వరంగల్లు జిల్లాలోని ఏటూరు నాగారం అభయారణ్యంలో వందల ఏండ్లుగా ప్రజల పూజలందుకొంటున్న సమ్మక, సారక జాతర కోసం ఈ వంతెన కావాలి. ఉత్తర-దక్షిణాలుగా ప్రవహించే జంపన్న వాగు దాటితేనే లక్షలాది భక్తులు ఆంధ్ర-తెలంగాణ ప్రాంతం నుంచి ఆ అమ్మవార్ల సన్నిధికి చేరుకుంటారు. వాగుకు ఉత్తరాన్నుంచి వచ్చే భక్తులకు సమస్య లేదు. కానీ, లక్షలాదిగా తరలివచ్చే దక్షిణప్రాంత భక్తులు వాగు దాటక తప్పదు. వాగులో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుంది.
2001-03 మధ్య నేను వరంగల్ కలెక్టరుగా ఉన్నప్పుడు ఈ సమస్య నాకొక సవాల్గా అనిపించింది. 2001 ఆగస్టులో ‘రహదారులు, భవనాల శాఖ’ (ఆర్అండ్బీ) ఇంజినీర్లతో, పోలీసు అధికారులతో ఒక సమావేశం పెట్టాను. ‘వచ్చే ఫిబ్రవరిలో జాతర నాటికి శాశ్వతమైన వంతెన మనం కట్టాలి. కట్టగలమా? లేదా?’ అని అడిగాను. ఇంజినీర్లలో కొంత సంశయం ఉన్నా, ‘చేసేస్తాం సర్’ అన్నారు. విషయం తెలిసిన ఆర్అండ్బీ మంత్రి ‘ఆరు నెలల్లో వంతెన ఏం కడతారయ్యా? దుస్సాహసం చేయకండి’ అని హెచ్చరించారు. నా ఆలోచనని పోలీసు వర్గాలు, మీడియా స్వాగతించాయి. ఎస్టిమేట్స్ తయారుచేశాం. మూడు నెలలు గడిచిపోయాయి. ప్రాజెక్టు ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి పంపాం. వారాలు, నెలలు గడుస్తున్నాయి. నవంబరు ఆరంభంలో వరంగల్లో అధికారపార్టీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. ‘వంతెన నిర్మాణం ఎంతవరకు వచ్చింది’ అని అడిగారు. నేను జరిగిందంతా చెప్పాను. ‘నాకు ప్రభుత్వం స్వయంనిర్ణయాధికారం ఇవ్వలేదు. బడ్జెట్ ఆమోదం లేకుండా ఎలా పనులు మొదలుపెట్టగలను సర్?’ అన్నా. ‘సీఎం మర్చిపోయి వుంటారు. మీరు చేయగలిగితే చేయండి. బడ్జెట్ విషయం సీఎంకు నేను చెబుతాను. నేనే ఆమోదం ఇచ్చేస్తాను. ప్లీజ్ గో అహెడ్’ అన్నారు మంత్రి తుమ్మల.
అంటే, ప్రభుత్వ ఆమోదం లేకుండా నేను దాదాపు రూ.రెండు కోట్ల (ఇప్పుడైతే రూ.4-5 కోట్ల) వ్యయం కాగల వంతెనను నా సొంత జవాబుదారీ మీద నిర్మించాలి. అది కూడా మిగిలిన నవంబరు, డిసెంబరు, జనవరి అంటే మూడు మాసాల్లో. నాలో నేనే తరించుకున్నా. ప్రభుత్వ ఆమోదం లేకుండా ప్రాజెక్టు అమలు చేయడమంటే ఎంత రిస్కో నాకు తెలుసు. అయినా దృఢ నిర్ణయం తీసుకున్నా. ఒక ప్రకటన మీడియాకు విడుదల చేశాను. ‘జంపన్నవాగుపై 110 మీటర్ల పొడవైన వంతెనను 80 రోజుల్లో నిర్మించాలి. ఆసక్తి గలవారు శుక్రవారం వచ్చి ఈ కమిటీని సమావేశం హాలులో కలవండి- జిల్లా కలెక్టరు’. ఐదుగురు ఐఏఎస్ అధికారులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ శాఖల నుంచి ముగ్గురు ఇంజినీర్లతో ఆ కమిటీ ఏర్పాటు చేశాను. టెండర్ల ఎంపికను చూడటానికి మీడియాను ఆహ్వానించాను. వచ్చిన వారిలో ఒక కాంట్రాక్టరే అంచనా వ్యయం మీద 12 శాతం ఎకువిస్తే చాలనడంతో కమిటీ ఆమోదించింది. ప్రభుత్వానికి తెలియజేశాం. ఈ విషయం పత్రికలన్నింటిలో ప్రముఖంగా వచ్చేలా చూశాను. ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి జె.రాంబా బు ఫోన్ చేసి, నా శ్రేయస్సు కోరి చాలా చెప్పారు.
‘ప్రభాకర్, నీ ప్రతిపాదన చూశాను. చాలా దూకుడుగా వెళ్తున్నావ్?.. ఎందుకింత రిస్ తీసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను బైపాస్ చేసి, ముందుకెళ్లటం చాలా ప్రమాదం. నీ కెరీర్లో ఒక మచ్చగా మిగిలిపోతుంది. సస్పెండ్ అవుతావు…’ ఈ హెచ్చరికల సంభాషణ చాలాసేపు జరిగింది. కానీ, నా కళ్ల ముందు ఒకటే కనబడుతోంది. జాతర మొదలయ్యే లోపల జంపన్న వాగు మీద వంతెన. అకస్మాత్తుగా డిసెంబరు 20న మంత్రి తుమ్మల ఫోన్ చేశారు. ‘మీ టెండర్ల ప్రక్రియ బాగుంది. కానీ, ఇంత పెద్దమొత్తంతో అంచనాని ఆమోదించే అధికారం నాకు లేదట. మంత్రివర్గమే తీర్మానించాలట. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రం కొన్నిరకాల పనులు చేయటానికి కలెక్టరుకి అధికారం ఉంటుందట’.. ఇలా చెప్పారు.
ఏమైనా, రంగంలోకి పూర్తిగా దిగిపోయాను. పనులు మొదలై నెలవుతున్నది. అంతలో వాగుకి ఎగువనున్న లక్నవరం రిజర్వాయరులో నీటిని వానకాలం పంట కోసం వదిలారు. ‘నీటిని ఈ ఒకసారికి వాగులోకి వదలొద్దు’ అన్న నా ఆదేశాలను ఎవరో అతిక్రమించారు. పనులు 3-4 రోజులు ఆగిపోయాయి. ఈ లోపల రాజకీయనేతలు మీడియాలో విమర్శలు గుప్పించారు. ‘80 రోజుల్లో కట్టే ఈ వంతెన పనికిరాదు. వాగుకి వరద వస్తే, చెట్లు కొట్టుకొచ్చి పిల్లర్లను కూల్చేస్తాయి. కట్టిన స్తంభాలు, శ్లాబ్ క్యూరింగ్కే సమయం సరిపోదు. ఇది వచ్చే జాతర నాటికి ఉండేదా! పోయేదా!’.. ఇలా పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. వీటికి సమాధానంగా.. వంతెన నిర్మాణంలో వాడే కాంక్రీట్ బ్లాకుల్ని ఇంజినీరింగ్ నిపుణుల సమక్షంలో పరీక్ష చేయించాను.
వంతెన నిర్మాణ స్థలం అడవి మధ్యలో ఉంది. రాత్రి 9 నుంచి ఉదయం 9 దాకా అరణ్యం దారిలో ట్రాఫిక్ అనుమతించరు. సిమెంటు, కంకర వగైరా మెటీరియల్ తీసుకెళ్లే ట్రకులను ఆపేస్తున్నారు. ఈ విషయంలో అటవీశాఖ కన్జర్వేటర్ చంద్రమోహన్తో మాట్లాడాను. అతన్ని ఒప్పించడం పెద్ద పని. రూల్స్ అతిక్రమించాలంటే వాళ్లకూ భయమే. చివరికి వాళ్లు ఈ వంతెన మెటీరియల్ వాహనాలకు ‘ప్రత్యేక అనుమతి’ బోర్డులు పెట్టుకుని, రాత్రిపూట కూడా రవాణా సాగించే వెసులుబాటు కల్పించారు.
జనవరి వచ్చేసరికి వంతెన నిర్మాణం చాలా ముందుకెళ్లిపోయింది. అంతలో ఏదో నక్సల్స్ గ్రూపట. సంక్రాంతి సమయంలో కాంట్రాక్టరు పొక్లెయిన్ను పేల్చి వేశారు. దాని ఖరీదు 25 లక్షలు. స్థానిక మహిళలు బృందాలుగా వచ్చారు. ‘సర్, మేం వచ్చి, వంతెనకి కాపలా పడుకుంటాం. ఎవరొస్తారో చూస్తాం’ అంటూ నా ముందే సమ్మక మీద ప్రమాణం చేసి, రంగంలోకి దిగారు.
రాత్రింబవళ్లూ పనులు జరిగాయి. అప్రోచ్ రోడ్లు వేయటం ఓ పకన జరుగుతుండగా, ప్రధానమైన వంతెనపై దారి నిర్మాణం కేవలం 37 రోజుల్లో (ఫిబ్రవరి 5 నాటికి) పూర్తయింది. అంచనా వ్యయం కన్నా తకువలో వంతెన నిర్మాణం జరగటంతో మి గతా నిధులు ఖర్చు పెట్టి వాగులో స్నానాల ఘాట్లు, మరుగుదొడ్లు నిర్మించగలిగాను. వెదురుతో, తడకలతో అంగళ్లు పెట్టించాను. ప్లాస్టిక్ వాడకుండా కాగితం సంచుల్నే వినియోగించేలా చూశాను. ఆ ఏడాది జాతరలో లక్షలమంది భక్తులు నీళ్లలో దిగకుండా (స్నానాలకు తప్ప), ఆ వంతెన మీద నుంచి జం పన్నవాగు దాటుతుంటే, మనసు దూదిపింజలా గాలిలో తేలిపోయింది. శరీరం రోమాంఛితమైంది. ఆ మూడు నెలలపాటు నన్ను వెంటాడిన ఆందోళన, ఆదుర్దా మటుమాయమయ్యాయి. ఆ దేవతల శక్తే నడిపించిందా? ఏదేమైనా నా ఉద్యోగం పోలేదు. ప్రభుత్వం నన్ను సంజాయిషీ కూడా కోరలేదు.
-కె.ప్రభాకరరెడ్డి, 98491 99226
(వ్యాసకర్త: రిటైర్డ్ ఐఏఎస్)