ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఈడీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ వ్యూహాల్లో భాగంగానే ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైనా డాక్యుమెంట్లను అడిగితే.. నేరుగా వాటికి పంపించవద్దని ఆ మార్గదర్శకాల సారాంశం. రాష్ట్ర క్యాబినెట్ సెక్రెటరీ, విజిలెన్స్ను సంప్రదించి.. తగిన న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతే స్పందించాలని ఝార్ఖండ్ ప్రభుత్వం తేల్చిచెప్పడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నది. ఈడీ అనేది ఒక సమస్యగా మారడంతో దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ.
ED | కేంద్ర దర్యాప్తు సంస్థలకు బీజేపీ సర్కార్ ఎక్కువగా పని చెప్తుండటంతో నిరూపణ కాని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమంది ప్రతిపక్ష నేతలు జైలులో మగ్గుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ హయాంలో ఈడీ కేసులు గణనీయంగా పెరిగాయి. 2004-2014 మధ్యకాలంలో ఈడీ 112 కేసులు నమోదు చేయగా.. 2014-22 మధ్యకాలంలో ఈ సంఖ్య 3,010కి చేరింది. గతంతో పోలిస్తే ఇది 27 రెట్లు అధికం. మరోవైపు బీజేపీ పాలనలో రాజకీయ నేతలపై ఈడీ 121 కేసులను నమోదు చేయగా.. వారిలో 115 మంది (95 శాతం) ప్రతిపక్ష నాయకులే ఉన్నారు. అయితే కేసుల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ నేర నిరూపణ రేటు మాత్రం చాలా తక్కువగా ఉండటం శోచనీయం. గడిచిన 17 ఏండ్లలో పీఎంఎల్ఏ చట్టం కింద 5,400 కేసులు నమోదవగా.. వాటిలో 23 మాత్రమే నిరూపితమవడం గమనార్హం.
ప్రతిపక్ష నేతలనే కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలను బెదిరించి తమ దారిలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. విపక్ష నేతలు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, అభిషేక్ బెనర్జీ, సంజయ్సింగ్, మనీశ్ సిసోడియా తదితరులు ఈడీ బాధితులుగా మారడం విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అదే సమయంలో అధికార బీజేపీ నేతలు, మిత్రపక్షాల వైపు ఈడీతో సహా దర్యాప్తు సంస్థలేవీ కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పైగా ప్రతిపక్షంలో ఉండగా ఈడీ కేసులతో సతమతమైనవారు బీజేపీ తీర్థం పుచ్చుకోగానే, ఎన్డీయేలో చేరాక ఎటువంటి విచారణను ఎదుర్కోకపోవడం మనం చూస్తునే ఉన్నాం. హిమంత బిశ్వశర్మ, సువేందు అధికారి, జ్యోతిరాదిత్య సింధియా వైపు ఈడీ కన్నెతి చూడకపోవడమే అందుకు నిదర్శనం. ‘నేను బీజేపీ ఎంపీని కాబట్టి ఈడీ నా వెంట పడదు’ అని ఆ పార్టీ ఎంపీ సంజయ్ పాటిల్ పేర్కొన్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ.. ఇలాంటి కుట్రలకు తెరలేపిందనే వాదనలు ఉన్నాయి. ప్రతిపక్షంలోని ప్రధాన నేతలను ప్రచారానికి దూరం చేయాలన్నదే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల అరెస్టులకు ఇదే కారణమని విశ్లేషకులు అంటున్నారు. అవినీతి ఆరోపణలు, ఈడీ సోదాలు, అరెస్టుల కారణంగానే తాము ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని పలువురు బాహాటంగానే చెప్తున్నారు. ఇటీవల జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్కు రూ.508 కోట్లు బదిలీ చేసి ఉండొచ్చని ఎన్నికలకు ముందు ఈడీ బాంబు పేల్చింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రిపైనే అవినీతి ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చతికిలపడింది. తాజా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ పన్నుతున్న పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు ప్రతిపక్షాలు కూడా ప్రతివ్యూహాలు రచించక తప్పడం లేదు. ఈడీని ఎదుర్కొనేందుకు విపక్ష పాలిత రాష్ర్టాల్లోని ప్రభుత్వాలు కొత్త మార్గాలను వెతుకుతున్నాయి. అందులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే తమపై బీజేపీ సర్కార్ ఆరోపణలు చేయిస్తున్నదని, అవినీతిపరులనే ముద్ర వేస్తున్నదని ప్రజలకు వివరిస్తున్నారు. ఆందోళనలు, నిరసనల ద్వారా రోడ్డెక్కి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటున్నారు. దర్యాప్తు సంస్థలు అడుగుతున్న వివరాలను ఇవ్వకుండా అడ్డుకోవడం మరో వ్యూహం. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పేరడీ పాటలను విడుదల చేసింది. మరోవైపు సమన్లకు స్పందించకుంటే.. ఆ కారణంగా అరెస్టు చేసే అవకాశం లేకపోవడంతో కొంతమంది ఈడీ సమన్లకు స్పందించకుండా తాత్కాలికంగా తప్పించుకుంటున్నారు. సోదాలు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈడీని అదే పంథాలో ఎదుర్కోవడం మరో వ్యూహం. ప్రధానంగా విపక్ష పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. లంచం తీసుకున్నారనే ఆరోపణలపై రాజస్థాన్లో ఈడీ అధికారిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది. తమిళనాడులోని మదురైలో ఉన్న ఈడీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయడం అందులో భాగమే. మరోవైపు పశ్చిమబెంగాల్లో ఓ టీఎంసీ నేత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులపై ఓ మూక దాడికి పాల్పడటం దుమారం రేగింది.
విపక్ష పాలిత రాష్ర్టాలు అనుసరిస్తున్న ఈ వ్యూహాలు సరైనవేనా? అంటే, నిస్సహాయ స్థితిలో అలా చేయడం తప్ప వాటికి వేరే దారి కనిపించడం లేదనేది నూటికి నూరు పాళ్లు నిజం. అయితే ఎన్ని ప్రణాళికలు రచించినా విపక్ష నేతల అరెస్టులు మాత్రం తప్పడం లేదు.
ఈడీ దాడులతో బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాలు ఆ అంశాన్ని అనేక వేదికలపై ప్రస్తావిస్తున్నాయి. పార్లమెంట్లో ఆందోళన చేసినా, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినా, ప్రధాని, రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు. ఈ పరిస్థితిపై ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాష్ర్టాల్లో సీబీఐ విచారణ చేపట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈడీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అటువంటి అధికారం లేకపోవడంతో విపక్షాలు ఏమీ చేయలేకపోతున్నాయి’ అని ఆయన వాపోయారు. 2015-23 మధ్యకాలంలో విపక్ష పాలిత 10 రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో సీబీఐ విచారణకు కావాల్సిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోవడం గమనార్హం.
ప్రతిపక్ష నేతల అరెస్టులతో అధికారం చేజిక్కుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి. కానీ, అరెస్టుల వల్ల ప్రతిపక్షాలు బలహీనపడతాయన్నది వాస్తవం. దాంతో పాటు అధికార పక్షం మరింతగా ప్రచారంలో దూసుకుపోయేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకు తాజా ఉదాహరణ బంగ్లాదేశ్ ఉదంతం. వందల మంది ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి జైలు పాలు చేసిన షేక్ హసీనా ఎన్నికల్లో సునాయాసంగా గెలుపొందారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగిన బంగ్లా ఎన్నికల తీరును అమెరికా సహా అనేక దేశాలు ఖండించాయి. కానీ, భారత్ మాత్రం మౌనం వహించింది.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై పలు దేశాలు విమర్శలు గుప్పించినప్పటికీ.. ‘ఇది మా అంతర్గత విషయం’ అంటూ బీజేపీ సర్కార్ తెలివిగా తప్పించుకున్నది. అయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ప్రజాస్వామ్యమే కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత ఇప్పటికీ ప్రజలపైనే ఉన్నదనే విషయాన్ని మరువరాదు.
– మాలోతు సురేష్ 98856 79876