సృష్టిలో భాష ద్వారా భావ వ్యక్తీకరణ చేసే శక్తి ఒక్క మనిషికే ఉన్నది. పక్షులకు, జంతువులకూ, వృక్షాలకు జీవం ఉన్నది. వాటి మధ్యకూడా వాటికి అర్థమయ్యే భాష, భావం ఉన్నాయేమో! మనకు తెలియదు. మనకు తెలియనంత మాత్రాన వాటి మధ్య పరస్పర భావ ప్రసారం లేదని చెప్పలేం. సకల జీవరాశులో ఏక కణ జీవి నుంచి, నేటి మానవుడిగా మనిషి పరిణామం చెందాడు. ఆ క్రమంలో అతని మెదడు బాగా అభివృద్ధి చెందింది.
అది భౌతికరూపంలో మన తలలో కనిపించే, ఒక కొవ్వుముద్ద. ఒక మెత్తని పదార్థ్ధం. కంప్యూటర్లో ఉండే అతి సున్నితమైన ‘ప్రాసెసర్’ వంటిది. ఈ మెదడులో నుంచి ఉద్భవించే ఆలోచనలు, భావాలు, ఊహలు, కల్పనలు, వివేచన మన కంటికి కనిపించకున్నా, మనల్ని నడిపించేవి, కార్యోన్ముఖుడిని చేసేవే ఆ ఆలోచనలు. దీన్నే మనం ‘మనసు’ అని కూడా అంటాం. మనసు కంటికి కనిపించదు. అది మనోభావాల సముచ్ఛయం.అనుభవాల నుంచి ఏర్పడిన అనుభూతుల సారం(బంచ్ ఆఫ్ ఫీలింగ్స్).
అలాగే మనిషిలో ఉండే గుండెకాయ భౌతికంగా కనిపించే ఒక మాంసపు ముద్ద. ఒక కండరం. దాన్నే మనం ‘హృదయం’ అంటున్నాం. అయితే ఇది కంటికి కనిపించదు. మనం వాడుకలో మనసునూ, హృదయాన్ని పర్యాయ పదాలుగా వాడుతాం. నీకు మనసు లేదా? అనే భావాన్నే నీకు హృదయం లేదా? అంటూ సమానార్థకంగా, పర్యాయ పదాలుగా వాడుతాం. అయితే, ఈ మనసూ, హృదయం అనే పదాలు మనిషి సున్నిత భావాలను అనుభూతులను వ్యక్తం చేసే సందర్భంలో ఉపయోగిస్తాం.
ఇప్పుడు, మనిషికి ఉన్న ఈ ‘కనిపించని మనోభావాలను’ సమాజంలో తోటి మనుషులకు అర్థ్ధమయ్యేలా సైగలద్వారా, మౌనం ద్వారా, శారీరక అంగాల కదలికలతో, భాష(మాట్లాడటం) ద్వారా వ్యక్తపరుస్తాడు. ఈ భాష మాట (శబ్ధం) ద్వారా, రాత (లిపి) ద్వారా, లేదా ఇతర లలిత కళారూపాల్లో వ్యక్తమౌతుంది. కొన్నిసార్లు మౌనం కూడా భావ వ్యక్తీకరణకు,భావ ప్రసారానికి బలమైన సాధనంగా ఉపయోగపడుతుంది.
21వ శతాబ్దంలో మనిషి ‘నాగరికత’ను, ‘సంస్కృతి’ని సంతరించుకొని సంస్కార మానవుడిగా అభివృద్ధిని సాధించాడు.ఈ సంస్కృతి (అంతర్గతమైనది). మన ప్రవర్తన, మాటతీరు, ఉపయోగించే భాష, మన మనోభావాలు, నమ్మకాలు, విశ్వాసాలు మొదలైనవి ఈ సంస్కృతి ద్వారా వ్యక్తమౌతాయి. ఒక సంస్కృతి అనేక ఉప సంస్కృతుల సమ్మేళనం. మనిషి ఉపయోగించే భాష (మాటలు) యాస (ఉచ్ఛారణ) మన సంస్కృతిని, సభ్యతను, భాష సొగసును తెలియజేస్తుంది.
రాజ్యపాలనా సిద్ధాంతాలలో ప్రజాస్వామ్యం ఉత్తమమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థకు వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రం ప్రాణం వంటివి. అందుకే ప్రజాస్వామిక దేశాలు రాజ్యాంగ బద్ధంగా తమ పౌరులకు ఈ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రం, పత్రికా (మీడియా) స్వాతంత్య్రం అనే పౌరహక్కులను ప్రసాదించాయి.
మన దేశం 1947లో స్వాతంత్య్రం పొందిన తర్వాతడా. బీఆర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం భారత పౌరులందరికీ కుల, మత, భాష, ప్రాంతం, జాతి, రంగు, ధనిక, పేద, స్త్రీ, పురుష భేదం లేకుండా ఈ పౌర హక్కులను ప్రసాదించింది.
పరిమితులకు లోబడి ఈ పౌరహక్కులను పౌరులు ఉపయోగించాలి. వీటికి రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ఉన్నత న్యాయస్థానాలు హైకోర్టు, సుప్రీం కోర్టు వీటిని కాపాడుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నది. తమ భావాలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు.అయితే ఆ విమర్శలు నాగరికంగా రాజ్యాంగం నిర్ధేశించినట్టు మాత్రమే ఉపయోగించాలి. ఇతరుల గౌరవానికి భంగం కలుగరాదు. సామాన్య ప్రజలు మొదలు కొని ప్రజా ప్రతినిథుల వరకు తమ అభిప్రాయాలను, భావాలను, ఆవేదనను వ్యక్తపరచటానికి పార్లమెంటరీ భాషను మాత్రమే ఉపయోగించాలి.
ఈ విమర్శలు వ్యక్తిగతం కాకుండా, గౌరవప్రదంగా తమ అభిప్రాయాలను గణాంక వివరాలతో లాజికల్గా మాట్లాడవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, గౌతు లచ్చన్న, వావిలాల గోపాలకృష్ణయ్య, జైపాల్రెడ్డి, వెంకయ్యనాయుడు, మొదలైన వారు శాసన సభల్లో, లేదా బహిరంగ సభల్లో ఏ ఆంశంపై మాట్లాడినా దానిలో ‘విషయం’ ఉండేది. హేతుబద్ధంగా (లాజికల్)గా మాట్లాడేవారు. వారి మాటల్లో నిజం, పదును, సూటితనం, ప్రజా సంక్షేమ దృష్టి ఉండేవి. అధికారపక్షం సైతం ఆ మాటలకు, విమర్శలకు గౌరవం ఇచ్చేవారు. అలా గే పార్లమెంటులో వాజపేయి, ఎల్కేఅద్వానీ, సుష్మాస్వరాజ్, జయప్రకాశ్ నారాయణ్, హరికిషన్ సింగ్ సుర్జీత్ మొదలైన వారి విమర్శలను, సలహాలను, సూచనలను ప్రధానమంత్రితో సహా అందరూ గౌరవంగా స్వీకరించేవారు.
ఇప్పుడు రోజులు మారాయి. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు చాలామంది ప్రజా ప్రతినిధులు అదుపు తప్పి దిగజారిన భాషనే మాట్లాడుతున్నారు. స్థాయిని మరిచి శాసనసభల్లోనూ, బహిరంగసభల్లోనూ, టీవీ చర్చల్లోనూ తిట్ల పురాణం మొదలెట్టారు. వ్యక్తిగత దూషణలు శృతి మించుతున్నాయి. కుటుంబ సభ్యులను కూడా బజారుకు లాగి కువిమర్శలు చేస్తున్నారు. బహిరంగ సభల్లో, పత్రికా సమావేశాల్లో సైతం తొడలు కొడుతూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వీటిని పోస్టులుగా పెడుతున్నారు. ఈ ప్రభావం యువతపై, చెడు ప్రభావాన్ని చూపుతున్నది. రాజకీయాలు అంటేనే బూతుపురాణం అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నా యి.
రానున్న ఎన్నికల్లో ఈ కాబోయే ప్రజాప్రతినిధులు. రాష్ర్టాలను ఏలే నేతలు భావితరాలకు ఇచ్చే సందేశం, సంస్కృతి ఇదేనా? వారి ప్రవర్తనలో మార్పు రా దా? ఇదేనా వారు అనుసరించే సభ్యత? సంస్కారం? మన మానవ నాగరికత, సాంస్కృతిక విలువలు, దేశ ప్రతిష్ఠను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మాట్లాడగలిగిన, చైతన్యం కలిగినవారు మౌనం దాల్చటం క్షంతవ్యం కాదు.