ఎస్జీటీగా పదోన్నతి పొందేందుకు టెట్ పేపర్- 1, స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి కోసం పేపర్- 2లను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ విధానం వల్ల తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు అన్యాయం జరుగుతున్నది. టెట్లో ఉన్న లోపాలను సవరించి డీఈడీ, బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలి. టెట్ పేపర్- 2లో తెలుగు భాషా పండితులకు సంబంధం లేని సోషల్ సబ్జెక్టు నుంచి 60 మార్కులు ఉండటం వల్ల చాలామంది నష్టపోతున్నారు. భాషా పండితుల కోసం ప్రత్యేకంగా టెట్ తెలుగు పేపర్- 3 నిర్వహించాలి. పేపర్- 1 నుంచి 8వ తరగతిలోపు, పేపర్- 2లో 10వ తరగతిలోపు ఉండేలా చూడాలి. ఏపీలో ఉన్న విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలి.
రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ దరఖాస్తులు, ఫిర్యాదులను పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి. ఇండ్ల స్థలాల అక్రమణల గురించి రెవెన్యూ అధికారులు, పోలీసుల చుట్టూ తిరిగి తిరిగి చాలామంది విసిగివేసారి పోతున్నారు. దరఖాస్తుదారుల్లో ఎంతో మంది వికలాంగులు, మహిళలు, ఎస్టీ, ఎస్సీలు ఉన్నారు. ఆక్రమణదారులపై ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల చట్టం కింద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఓ ఆక్రమణకు సంబంధించి గతేడాది ఏప్రిల్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోలేదు. రశీదు నెంబర్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారే తప్ప సమస్యను పరిష్కరించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఎత్తివేయనున్నదనే పత్రికా కథనాలు రైతులను గందరగోళ పరుస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి బ్యాంకుల నుంచి రెండు లక్షల రుణాలు తీసుకోవాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మొట్టమొదట రుణమాఫీ చేస్తామని గప్పాలు కొట్టాడు. ఆయన మాటలు విని రైతులు బ్యాంకులకు క్యూ కట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సుమారు 4 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం రుణమాఫీ ఊసే ఎత్తడం లేదు. ఇక రుణమాఫీ ఉండదనే వరుస కథనాలతో ప్రజలు డోలాయమానంలో ఉన్నారు.