మీడియా స్వాతంత్య్రంపై, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడుల గురించి
ఇప్పటికే చాలా చెప్పుకోవడం జరిగింది. కానీ తాజాగా బీబీసీ మీద జరిగిన దాడి మూడు ప్రధాన అంశాలను ముందుకు తెస్తున్నది.
ఢిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు జరిగిన గంట లోపే ఈ బ్రిటిష్ వార్తా సంస్థపై బీజేపీ చవకబారు విమర్శలు చేసింది. బీబీసీని ‘భ్రష్ట్ బక్వాస్ కార్పొరేషన్’ అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విరుచుకుపడ్డారు. ఆ వార్తా సంస్థ గతంలో ఫలానా తప్పులు చేసిందంటూ విచిత్రమైన రీతిలో ఏకరువు పెట్టారు. 1946లో దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో మహాత్మాగాంధీ విఫలమైనట్టు బీబీసీ వ్యాఖ్యానించింది అంటూ తప్పు పట్టింది బీజేపీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఆ మరుసటి ఏడాదే. అందువల్ల బీబీసీ చెప్పినదాంట్లో భారత్ను అవమానించింది ఏమీ లేదు. 2002లో గుజరాత్లో జరిగిన హింసాకాండలో నరేంద్ర మోదీ అభ్యంతరకర పాత్ర పోషించారనే విధంగా డాక్యుమెంటరీని రూపొందించడం ద్వారా బీబీసీ సుప్రీంకోర్టును అవమానించిందని ఇతర బీజేపీ నాయకులు ఆరోపించారు. బీబీసీ డాక్యుమెంటరీ రూపకల్పనకు, ఐటీ దాడులకు సంబంధం లేదని బీజేపీ నాయకులు అనధికారికంగా అంటున్నారు. మరి ఈ దాడి ఎందుకు జరిగిందనే సందేహాన్ని ఈ ఆరోపణల ద్వారా బీజేపీ నేతలే నివృత్తి చేశారు. డాక్యుమెంటరీ విడుదలైన నెల రోజుల లోపే బీబీసీ పన్ను ఎగవేత ఆధారాలు లభించాయని వాదించే వారు మూర్ఖులైనా అయి ఉండాలి, లేదా అడ్డగోలుగా ప్రభుత్వాన్ని సమర్థించేవారయినా అయి ఉండాలి. ఇక ఈ దాడికి సంబంధించిన మూడు ప్రధానాంశాలను చెప్పుకుందాం.
మొదటి అంశం: చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో మోదీకి విలువల సారూప్యం ఉన్నప్పటికీ వ్యాపార ప్రయోజనాల కోసం పాశ్చాత్యదేశాలు భారత్తో రాజీపడుతున్నాయనేది. పాశ్చాత్య ప్రజాస్వామ్య రాజ్యాలు పత్రికా స్వాతంత్య్రం, ఉమ్మడి విలువల ప్రాధాన్యం గురించి మాట్లాడుతుంటాయి. కానీ భారత్తో వ్యాపార సంబంధాలు, భౌగోళిక, రాజకీయ అనుకూలతలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. బీబీసీ బ్రిటిష్ ప్రజల యాజమాన్యం కింద నడుస్తున్న సంస్థ. బీబీసీపై మోదీ కఠినంగా వ్యవహరిస్తే అక్కడి ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావలసింది. కానీ విమానాల కొనుగోలు ఒప్పందానికి భారత్ నుంచి భారీ ఆర్డరు లభించటమే బ్రిటన్ ప్రధాని రిషి సునక్కు ప్రధానమై పోయింది. బీబీసీపై దాడులు జరిగిన రోజు అమెరికా, ఫ్రాన్స్ నాయకులు మోదీతో మాట్లాడారు. నిజానికి ఈ వార్తాసంస్థతో వారికి సంబంధం లేదు. కానీ మిగతా మీడియా సంస్థలపై కూడా దాడులు జరుగుతాయేమో అని వారు ఆరా తీశారు. ఇప్పటికే భారత్లో పని చేసే ఫ్రెంచి విలేకరులు తమ వీసాల కోసం కష్టపడాల్సి వచ్చింది. అమెరికా విలేకరి ఒకరిని తగిన పత్రాలు ఉన్నప్పటికీ మన దేశంలోకి అనుమతించలేదు. అయినప్పటికీ, బ్రిటిష్ ప్రధాని మాదిరిగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ నేత మాక్రాన్ మన దేశంలో పత్రికా స్వాతంత్య్రం ఏ విధంగా ఉందనే విషయం పట్టించుకోనేలేదు. జీ-20 విదేశాంగ మంత్రుల సదస్సు జరగడానికి పక్షం రోజుల ముందు బీబీసీపై దాడులు జరిగాయంటే, పాశ్చాత్య దేశాలు మౌనంగా ఉంటాయని మోదీ ఎంత విశ్వాసంతో ఉన్నారో తెలుస్తున్నది.
రెండవ అంశం: మోదీ ప్రభుత్వంపై సాధారణ విమర్శలు వస్తే, దానికి ఓ మోస్తరు ప్రతీకార చర్యలు ఉంటాయి. కానీ మోదీపై వ్యక్తిగత దాడి జరిగితే మాత్రం తీవ్ర పరిణామలు ఉంటాయని దీనివల్ల తెలుస్తున్నది. బీబీసీ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని నిషేధించడానికి కారణం అందులో సుప్రీంకోర్టుపై అవమానకరమైన అంశాలు ఉండటం కాదు (నిజానికి అందులో అటువంటివేమీ లేవు). ఘనత వహించిన ఈ నాయకులు 2002లో నిర్వహించిన సిగ్గుచేటయిన పాత్రను ప్రపంచానికి గుర్తు చేసినందుకే కేంద్ర ప్రభుత్వానికి కోపం వచ్చింది. సుప్రీంకోర్టు మీద బీజేపీకి అంత ప్రేమే కనుక ఉంటే, గుజరాత్లో జరిగిన మారణకాండపై గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ వ్యవహరించిన తీరు మీద 2004లో న్యాయస్థానం ఏమి చెప్పిందే గుర్తు చేసుకోవాలి.
‘బెస్ట్ బేకరీలో అమాయక పిల్లలు, నిస్సహాయ మహిళలు దహనమైపోతుంటే ఆధునిక కాలపు నీరోలు మరోవైపు చూస్తుండిపోయారు. నేరస్థులను ఎలా కాపాడాలని చర్చించుకుంటున్నారేమో! చట్టం, న్యాయం ఈ ఆకతాయిల చేతుల్లో శలభాల్లా మారిపోయాయి. కంచే చేను మేయడం మొదలుపెడితే, ఇక శాంతి భద్రతలకు, సత్యానికి, న్యాయానికి మనుగడ ఉండదు. ప్రజా భద్రత, ప్రజా ప్రయోజనాలు స్మారక చిహ్నాల్లా మారిపోతాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జాకియా జాఫ్రి అనే పిటిషన్దారు కోరినట్టుగా మోదీపై కుట్రదారు అనే నేరారోపణ చేయడానికి ఆధారాలు తగినంతగా లేవని సుప్రీంకోర్టు 2002లో భావించింది. కానీ మైనారిటీలపై జరిగిన హింసను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన గౌరవప్రదంగా, నిజాయితీగా వ్యవహరించారని కాదు. దీనికి 2004లో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలోనే సమాధానం ఉంది. ఈ దాడులకు పాల్పడిన వారిని కాపాడటమే మోదీ ప్రాధాన్యమనేది భారత రాజకీయ, న్యాయ చరిత్రలో చెరుపరాని భాగమైంది. ఇప్పటికీ ఆ నెత్తుటి వాసన ఇంకా పోలేదు. షేక్స్పియర్ నాటకంలోని క్రూరమైన పాత్ర లేడీ మాక్బెత్ మాటల సరళిలో చెప్పాలంటే- జీ-20 పరిమళాలన్నీ కూడా ఈ చేతి వాసనను రూపుమాపలేవు.
ఒక చరిత్ర పాఠంగా కాకుండా, ప్రధానిగా మైనారిటీల వ్యతిరేక విధానాలు అవలంబించడానికి
నేపథ్యంగా, నైతిక రాజకీయ ప్రశ్నలు మోదీని వెంటాడుతూనే ఉంటాయని బీబీసీ డాక్యుమెంటరీ ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ డాక్యుమెంటరీ పట్ల ప్రభుత్వం మొదట నిశ్చేష్టురాలైంది.
ఒక చరిత్ర పాఠంగా కాకుండా, ప్రధానిగా మైనారిటీల వ్యతిరేక విధానాలు అవలంబించడానికి నేపథ్యంగా, నైతిక రాజకీయ ప్రశ్నలు మోదీని వెంటాడుతూనే ఉంటాయని బీబీసీ డాక్యుమెంటరీ ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ డాక్యుమెంటరీ పట్ల ప్రభుత్వం మొదట నిశ్చేష్టురాలైంది. వెంటనే దుర్భాషలు సాగాయి. ఆ తరువాత రాజ్యాంగ విరుద్ధమైన రీతిలో నిషేధం వచ్చింది. ఇప్పుడు ఐటీ దాడులు సాగాయి. ఇంతటితో ఆగకపోవచ్చు. ఇదే విధంగా మోదీకి వివాదాస్పద వ్యాపారి గౌతమ్ అదానీతో గల సంబంధం గురించి ప్రతిపక్షాలు చేసిన ప్రస్తావనలను పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించారు. బీజేపీ నాయకులు ఎడిటర్లకు ఫోన్ చేసి పార్లమెంటు చర్చ వార్తలలో మోదీ పేరు తొలగించాలని చెప్పారు. చాలా మంది ఈ ఆదేశాలను పాటించారు. పాటించని వారు ఫలితం అనుభవించవలసి రావచ్చు. మోదీ వ్యక్తి ఆరాధనలో మీడియా స్వేచ్ఛ బందీగా మారింది. ఇంకా దిగజారి పోవచ్చు కూడా.
మూడవ అంశం: బీబీసీ మీద దాడికి ‘ట్రాన్స్ఫర్ ప్రైసింగ్’ కారణమంటున్న అసమంజస వాదనను భారతీయ మీడియా ఏకరువు పెట్టింది. దీనిని బట్టి పత్రికా స్వేచ్ఛకు ఎడిటర్లు, యాజమాన్యాలు, విలేకరులే ప్రథమ శత్రువులని తేలుతున్నది. బీబీసీపై దాడి జరిగిన 48 గంటల వరకు ఇందుకు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కారణమనే వాదనను ఏ ప్రభుత్వ అధికారి లేదా మంత్రి తన మీదేసుకోలేదు. దీనిని బట్టి ఇదెంత బోగస్ వాదనో తెలుస్తున్నది. పన్నుల వ్యవహారాలకు సంబంధించిన ఏ న్యాయవాదితో ఐదు నిమిషాలు మాట్లాడినా ఈ దాడి దురుద్దేశంతో కూడుకున్నదని మీడియాకు చెప్పేవారు. అయినా టీవీ చానెల్స్, పత్రికలు ఈ ‘ఉత్తమమైన’ వివరణను ఎంతో విధేయతతో ప్రసారం చేశాయి. దేశంలోని బడా మీడియా యాజమాన్యాల వైఖరి తెలిసిన వారికి ఇది ఆశ్చర్యమనిపించదు. ఒక మీడియా యజమాని బహిరంగంగానే మోదీ, అమిత్ షాలను ప్రస్తుతించారు. 2024లో మోదీ ఏకంగా ప్రపంచానికే ప్రధాని అవుతారని ఒక టీవీ చానెల్ యాంకర్ ప్రకటించారు!
గుజరాత్ హింసాకాండ సాగినప్పుడు తాను మీడియాను తగినంతగా అదుపులో పెట్టుకోలేక పోయానని 2002లోనే బీబీసీకి మోదీ విచారంగా తెలిపారు. 21 ఏండ్ల తరువాత పట్టుబట్టి ఆ తప్పును చక్కదిద్దుకున్నారు! మీడియా సంస్థలపై వేధింపులు కొనసాగుతున్నాయి. ఇండీ మీడియా స్టార్టప్లకు నిధులు ఇచ్చే, స్వతంత్రంగా వ్యవహరించే పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండేషన్పై దర్యాప్తు నడిచింది. ఫ్యాక్ట్ చెకర్ మహమ్మద్ జుబైర్తో సహా పాత్రికేయులపై కక్ష సాధింపు చర్యలు నడుస్తున్నాయి. కశ్మీరీ విలేకరులు జైలు పాలయ్యారు. జర్నలిస్టులు విదేశాలకు వెళ్లకుండా దాదాపు నిషేధం ఉన్నది. ప్రజాస్వామ్య హననానికి స్వాగతం!
(‘ది వైర్’ సౌజన్యంతో..) సిద్ధార్థ్ వరదరాజన్ ఎడిటర్, ది వైర్