బతుకమ్మ పాటల మీద జరిగిన పరిశోధన.. ‘కాముని పున్నమి’ సందర్భంగా పిల్లలు పాడే జాజిరి పాటల మీద, స్త్రీల పాటలు, పెద్దలు ఆడుతూ పాడే కోలాటం పాటల మీద జరిగిందో లేదో తెలియదు. శ్రీలక్ష్మీ, రావి ప్రేమలత ఒకటో, రెండో పరిశోధనా పత్రాలు సమర్పించారని ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి చెప్పారు. మాదాడి నారాయణ రెడ్డి ‘ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు’ పేరుతో ఒక పుస్తకం వెలువరించినట్టు సమాచారం ఉన్నది. ఆ పుస్తకం ఇప్పుడు అలభ్యం. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రాంతంలో ‘కాముని పున్నమి’కి పిల్లలు పాడే కోలాటం, జాజిరి, స్త్రీల పాటలు ఇప్పటికీ యాదికున్నాయి. ఆ పాటల్లో ఒకటి, రెండు..
రింగిసు బిళ్ల రూపాయి దండ/ దండ గాదురా దామెర మొగ్గ
మొగ్గ గాదురా మోదుగు నీడ/ నీడ గాదురా నిమ్మలబాయి,
బాయి గాదురా బల్సింత కూర/ కూర గాదురా గుమ్మడిపండు
పండు గాదురా పాపిట మీసం/ మీసం గాదురా మిరియాల పొట్టు
పొట్టు గాదురా పోరని జుట్టు/ పోరని జుట్టుకు దారం గట్టి గిరగిరా దిప్పి బండకు గొట్టు.. ఏది చెప్పినా కాదు అని చెప్పే ఆగం పోరడిపై కోపంతో చివరి వాక్యం అల్లినారేమో అనిపిస్తుంది.
కోతి పుట్టుడెందుకు? కొమ్మలెగురతందుకు
కొమ్మలెగురుడెందుకు? నార జీరతందుకు
నార జీరుడెందుకు? రథం కట్టేతందుకు
రథం కట్టుడెందుకు? రాముడెక్కేతందుకు
రాముడెక్కుడెందుకు? ఆన వడేతందుకు
ఆన వడుడెందుకు? అడ్లు వండేతందుకు
అడ్లు వండుడెందుకు? బువ్వ తినేతందుకు
బువ్వ తినుడెందుకు? భూమిలో వోతందుకు.. ప్రశ్న జవాబు రూపంలో ఉండే ఈ పిల్లల జాజిరి పాట ముగింపు మనిషి చివరి మజిలీ వద్దకు తీసుకుపోతుంది. ఇలాంటి పాటలు ఎన్నో గ్రామాల్లో సజీవంగా ఉన్నాయి.
ఉసికెల పుట్టిన కామయ్యా ఉసికెల వెరిగిన కామయ్యా
నిను గన్నతల్లి లీల్లకు వోతే నిదురల్లేవోయ్ కామయ్యా
కామయ్యాకూ దోతూలాటా సై/ కామయ్యాకు దుప్పట్లాట సై
అందుకోయే చంద్రాగిరి సై/ కామయ్యా నువ్వే రారా ముత్యాల పందిరి కిందికీ.. అంటూ- కాముడి పున్నమి రోజున ఉదయం ఒక తాంబాలంలో బియ్యం పోసి ఒక బొమ్మను ఉంచి కన్నెపిల్లకు పూల బాసింగాలు కట్టి ఇంటింటికి తిరుగుతూ కామయ్యకు ఆహ్వానం పలుకుతూ పాడుతారు. సాయంత్రం కాముడిని కాలుస్తారు. ఉదయం కామునికి ఆహ్వానం పలికి సాయంత్రం దహనం చేసే దాని వెనుక తాత్త్వికత ఏమిటో విశ్లేషించాలి. నెల రోజులపాటు దొంగతనంగా జమచేసిన కట్టెలు, చేతితో చేసిన పిడకల దండలతో కాముడు పేర్చి దహనం చేసేవాళ్లం. ఔసలోళ్ల తాత శ్రీరామోజు గంగారాం ఒక మైథునం బొమ్మ గీసిచ్చేవారు. చిన్నపిల్లలం మాకు ఆ బొమ్మలో ఏముందో అర్థమయ్యేది కాదు. ఆ బొమ్మతో సహా కామ దహనం జరగాలని మాత్రమే తెలుసు. ఆ రోజుల్లో బోథ్ ప్రాంతంలో నల్లులు విపరీతంగా ఉండేవి. వాటిని సజీవంగా కాముడిలో దహనం చేస్తే నల్లులు నశించి పోతాయన్న నమ్మకంతో నల్లులను పట్టి తెచ్చి కాముడిలో వేసేవారు. బోథ్లో కాముడు పేర్చే స్థలం పేరు కాముడి బొగుడగా స్థిరపడిపోయింది.
స్త్రీలు కాముని పున్నమ రోజున రంగురంగుల శక్కరి పేర్లు (దండలు) తమ స్నేహితులు, బంధువుల ఇండ్లకు పంపి తమ ప్రేమాభిమానాన్ని చాటుకునేవారు. అవి ఆఖరికి పిల్లలకు పలారంగా దక్కేవి. కామ దహనం తెల్లవారి హోలీ నాడు ఇచ్చే బూతు నినాదాలు కూడా యాదికి వస్తున్నాయి. వాటిని ఇక్కడ రాయడం కుదరదు. వాటిని ఏ జంకూ గొంకు లేకుండా అరిచేవాళ్లం. వినేవాళ్లూ నవ్వుతూ సంతోషంగా స్వీకరించేవారు. వాళ్లూ తమ చిన్నతనంలో ఈ పని చేసినవారే కనుక.
తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా మల్లేపల్లి లక్ష్మయ్య పురమాయింపుతో హోలీ కేళీ కోలాటం అనే కార్యక్రమాన్ని తెలంగాణ రచయితల వేదిక తరపున 2005లో ప్రారంభించాం. మొదటగా బాగ్ లింగంపల్లి పార్క్లో చేశాం. అది విజయవంతమైంది. నాడు పార్కుకు వచ్చిన వారిని కోలాటం విశేషంగా ఆకర్షించింది. మరుసటి ఏడాది 2006లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిపాం. వైఎస్ఆర్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. పోలీసులు గుర్రాలతో మమ్ముల్ని చుట్టుముట్టారు. అనుమతి లేకుండా యూనివర్సిటీలో హోలీ కోలాటం జరపటానికి వీల్లేదన్నారు. వీసీ పర్మిషన్ ఇచ్చాడు, హోలీ జరుపుకోవడానికి పోలీసుల పర్మిషన్ అక్కర్లేదన్నాం. జయశంకర్ సార్, కేశవరావు జాదవ్ కోలాటం ప్రారంభించారు. జయశంకర్ సార్ తొందరగానే వెళ్లిపోయారు. కొన్ని నిముషాల్లోనే పోలీసులు లాఠీఛార్జ్ మొదలుపెట్టారు.
నేను, కేశవరావు జాదవ్, మల్లేపల్లి లక్ష్మయ్య ఇంకా కొందరు విద్యార్థులు అరెస్టయ్యాం. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు మమ్ముల్ని తరలించారు. కోలాటం భగ్నం చేసిన వార్త రాష్ట్రమంతా తెలిసిపోయింది. తెలంగాణలో పండుగ జరుపుకొనే సాంస్కృతిక స్వేచ్ఛ లేదా? అని తెలంగాణ అంతా ఉడికిపోయింది. దివంగత నేత నాయిని నరసింహారెడ్డి నాయకత్వంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు యూనివర్సిటీకి వచ్చి మమ్మలని విడిపించారు. ఆ తర్వాత కోలాటం రెండు గంటల పాటు అద్భుతంగా కొనసాగింది. కోలాటం వేయడానికి రామగుండం దగ్గర జనగామ నుంచి కళాకారులు వచ్చారు. మల్లేపల్లి రాజన్న నాయకత్వంలో పది మంది కళాకారులు యూనిఫాం, కాళ్లకు గజ్జెలు, కోలలతో ఆడిపాడారు. సాంప్రదాయిక కోలాటం పాటలతో పాటూ ఉద్యమ గీతాలను ఆలపించారు. కోలాటం పాటల్లో .. ‘నీయారు గుర్రాలు, నాయారు గుర్రాలు, పన్నెండు గుర్రాల బగ్గి వోతున్నాది- బగ్గిలో మేనత్త బిడ్డ వోతున్నాది’ అనే పాట పాపులరైంది.
కాముని పున్నమ సాహిత్య పరిశోధనలపై తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు ఇతర యూనివర్సిటీల్లోని తెలుగు శాఖలు దృష్టిసారించాలి.
హోలీ ఉత్తరభారతంలో ఘనంగా జరుపుకొనే పండుగ. తెలంగాణలో కాముని పున్నమి, రంగుల పున్నమి, బూడ్దుల పున్నమి అనే స్థానిక పేర్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. రంగుల పున్నమి సంప్రదాయం మనకు ఉత్తరం నుంచి దిగుమతి అయ్యింది అనేది అవాస్తవం. వందల ఏండ్లుగా రంగుల పున్నమికి తెలంగాణలో తనదైన ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయం ఉన్నది. అద్భుతమైన సాహిత్య సంపద ఉన్నది. కోలాటం, జడ కొప్పులు, చిరుతలు లాంటి కళారూపాలున్నయి. పూర్తిగా తెలంగాణ స్థానికత, వైవిధ్యం ఉన్న కాముని పున్నమి సాహిత్యం మీద బతుకమ్మ సాహిత్యం మీద జరిగినంత సమగ్ర పరిశోధన, విశ్లేషణ జరగకపోవడం ఆశ్చర్యం.