Kaleshwaram | ప్రపంచంలో ఏ ప్రాజెక్టుపై జరగనంత దాడి బహుశా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే జరిగి ఉండవచ్చు. తిప్పిపోతల పథకమని ఒకరు.. కరెంటు చార్జీలు భారమని మరొకరు.. తెల్ల ఏనుగని ఇంకొకరు.. లక్షల కోట్లు వృథా అని.. ఇలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది మొదలు ఇప్పటివరకు ప్రతి దశలోనూ, ప్రతి అడుగులోనూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సాంకేతిక కారణాలతో మేడిగడ్డ బరాజ్ కుంగుబాటునకు గురవడంతో ఇదే అదనుగా మరింత విష ప్రచారానికి పూనుకుంటున్నారు. ప్రాజెక్టు సమగ్ర స్వరూపం గురించి తెలియక కొందరు.. అది పూర్తిగా తెలిసినా కూడా రాజకీయ స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నవారు ఇంకొందరు. ఎవరి ప్రయోజనాలు వారివి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఆది నుంచీ ఏ ఆరోపణలనైతే చేసిందో, అధికారం చేపట్టిన తర్వాత కూడా అవే వాదనలు వినిపిస్తున్నది. అందుకనుగుణంగా ప్రాజెక్టు ప్రయోజనాలను చిన్నదిగా చేసి చూపేందుకు యత్నిస్తున్నది. శ్వేతపత్రం పేరిట, పర్యటనల పేరిట కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసేందుకు పూనుకున్నది. ప్రాజెక్టులో తలెత్తిన సాంకేతిక లోపాన్నే సాకుగా చూపి మొత్తంగా ప్రాజెక్టును మూలన పడేసే కుట్రకు తెరలేపింది. మరి వాస్తవం ఏమిటీ? కాళేశ్వరంతో తెలంగాణకు ఏ ప్రయోజనం లేదా? రీ డిజైన్ చేయకుండా పాత డిజైన్ ప్రకారమే కడితే లాభం జరిగేదా? కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత ఏమిటీ? దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏమిటీ? ప్రాజెక్టు నిజంగానే ఇప్పుడు పనికిరాదా? పునరుద్ధరించలేమా? అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత తెలంగాణవాదులపై, తెలంగాణ సోయి ఉన్నవాళ్లపై ఉన్నది. అది అవసరమే కాదు, అత్యంత ఆవశ్యకమైన అంశం కూడా. అందులో భాగంగానే నా ఈ వ్యాసం.
ఎగువన మహారాష్ట్ర ఇష్టారాజ్యంగా కేటీ వియర్లు, బరాజ్లు, బాబ్లీ ప్రాజెక్టును నిర్మించడంతో దిగువన ఉన్న తెలంగాణకు వరద రావడమే తగ్గిపోయింది. గోదావరి ఒడ్డున ఉన్న పల్లెలకు చుక్క నీరందని దుస్థితి. కేవలం ప్రాణహితలోనే ఏడాదిలో దాదాపు 10 నెలలకు పైగా ప్రవాహాలుంటాయి. అయినప్పటికీ ఏనాడూ ప్రాణహిత దిగువన ప్రాజెక్టును కట్టి తెలంగాణ ప్రాంతానికి నీరివ్వాలని భావించలేదు ఉమ్మడి పాలకులు. ఎంతసేపూ పడ్డ చినుకు పడ్డట్టుగా ధవళేశ్వరం చేరాలనేది వారి లక్ష్యం. ఈ కుట్రను పసిగట్టిన తెలంగాణవాదులు ప్రాణహిత దిగువన ప్రాజెక్టు కట్టాలనే డిమాండ్ను ముందుకు తీసుకువచ్చారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఇది మరింత జోరందుకున్నది. ఆ విధంగా ఉమ్మడి రాష్ట్ర పాలకులు అయిష్టంగానైనా జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించారు. అక్కడ బరాజ్ నిర్మించి మొత్తంగా 160 టీఎంసీలను 21 దశల్లో ఎత్తిపోసి 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. అయితే తుమ్మిడిహెట్టి దగ్గర లభ్యమయ్యే నీళ్లు 165 టీఎంసీలున్నా అందులో 63 టీఎంసీలు ఎగువన మహారాష్ట్ర వాడుకొనేవే. మహారాష్ట్ర ఆ జలాలను వాడుకుంటే నికరంగా అక్కడ లభించేది 102 టీఎంసీలే. అందులో మనం ఎత్తిపోసుకోగలిగేది 80 టీఎంసీలే. ఎందుకంటే 25 శాతం ఆవిరి, ప్రవాహ నష్టాలే ఉంటాయి. అది కూడా తుమ్మిడిహెట్టి బరాజ్ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తో కడితేనే. అంతకంటే తక్కువ ఎత్తుతో కడితే నీటి మళ్లింపు సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇక ఈ ప్రాజెక్టులో మరో కుట్ర కూడా దాగి ఉన్నది. ప్రాజెక్టు మొత్తంలో నీటి నిల్వ సామర్థ్యం 14 టీఎంసీలే. అంటే నిరంతరాయంగా మోటర్లు నడిస్తే తప్పితే ఆయకట్టుకు నీరు అందించలేమన్న మాట. ఎక్కడన్నా ఒక దగ్గర పంపు చెడిపోయిందంటే.. మొత్తం నీటి సరఫరా ఆగిపోతది. ఆ ఉద్దేశంతోనే కుట్రపూరితంగానే నాటి ఉమ్మడి పాలకులు ప్రాజెక్టును నీటి సామర్థ్యం లేకుండా అక్కడ ప్రతిపాదించారు. ఆ తర్వాత అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో బరాజ్ నిర్మాణమే ముందుకు కొనసాగలేదు.
ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి లభ్యత తదితర అంశాలన్నింటిపై కూలంకషంగా అధ్యయనం చేయించారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టును రెండు భాగాలుగా విడగొట్టి రీ డిజైన్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టును కేవలం ఉమ్మడి ఆదిలాబాద్లో 2 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ను నిర్మించి మరో 16.25 లక్షల ఆయకట్టుకు మొత్తంగా 18.25 లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించారు. ఎస్సారెస్పీతో పాటు, నిజాంసాగర్, వరద కాలువ, సింగూరు తదితర ప్రాజెక్టుల కింద మొత్తంగా మరో 18.82 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టును కూడా దీనిద్వారా స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు కాళేశ్వరం అని నామకరణం చేశారు. సూటిగా చెప్పాలంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మినహా ప్రాణహితకు, కాళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంకుకు, అక్కడి నుంచి మిడ్ మానేరు రిజర్వాయర్కు, మిడ్ మానేరు నుంచి దిగువన లోయర్ మానేరు డ్యామ్కు, ఎగువన మలక్పేట, అప్పర్ మానేరు, మిడ్మానేరు నుంచి అనంతగిరి, అక్కడి నుంచి రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్నసాగర్కు, అక్కడినుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కు, దాంతోపాటు గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లలోకి నీళ్లను తరలించడమంతా ఎక్కువ భాగం పాత ప్లాన్ ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రకారమే కొనసాగింది. నిర్మాణ, ఎత్తిపోతల దశల్లో, నీటి సరఫరా పద్ధతిలో రెండింటికీ మధ్య స్వల్ప వ్యత్యాసమే. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయాల్సి ఉండగా, దానికి బదులు సాంకేతిక కారణాల రీత్యానే మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. ముంపు, సాగుభూములు, బొగ్గు గనుల రక్షణ కోసమే తప్ప మరొకటి ఇందులో లేదు. ఇక ప్రాణహితలో 14 టీఎంసీల స్టోరేజీ మాత్రమే ఉండగా కాళేశ్వరంలో అది 141 టీఎంసీలకు పెంచారు. ఇక పూడికతో నీటి నిల్వ సామర్థ్యం పడిపోతున్న నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను సైతం కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానం చేయడం విశేషం. వేలాది చెరువులను ప్రాజెక్టుకు అనుసంధానం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ను నిర్మించినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మినహా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన కెనాల్ సిస్టమ్నే యథావిధిగా వినియోగించుకోవాలి. ఇదే సత్యం. అయినా లక్షల కోట్లు వృథా అని ప్రచారం చేయడమే ఇక్కడ విచారకరం.
లక్షల కోట్లు వెచ్చించినా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. ఏ ప్రాజెక్టులోనైనా మొదట హెడ్వర్క్స్ను అంటే, నీటి నిల్వకు కావాల్సిన డ్యాంలు, బరాజ్లు, ఎత్తిపోసేందుకు పంప్హౌజ్లు, నీటి తరలింపునకు ప్రధాన కాలువలు, ఆ తర్వాత పంట పొలాలకు సాగునీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ, మైనర్లు, సబ్మైనర్లు, ఫీల్డ్ చానెళ్లను నిర్మిస్తారు. ఇది రివాజు. ఎవరికీ తెలియంది కాదు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టును నిర్మించిన పన్నెండేండ్ల తర్వాత గానీ సాగునీటిని అందించడం ప్రారంభం కాలేదనేది వాస్తవం. రాష్ట్ర ఏర్పాటు నాటికి కూడా స్టేజ్-1లో చివరి ఆయకట్టుకు సైతం నీరందలేదు. 1996లో ప్రారంభించిన స్టేజ్-2 పనులే పూర్తికాలేదు. అవేకాదు, నాగార్జునసాగర్, తుంగభద్ర డ్యాం ఇలా అనేక ప్రాజెక్టులే అందుకు సజీవ సాక్ష్యాలు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇందుకు పూర్తి భిన్నం. అత్యంత స్వల్పకాలంలోనే రైతులకు ప్రయోజనాలను అందించిన ప్రాజెక్టు ఏదైనా ఉన్నదా అంటే అది కాళేశ్వరమే. అదే కేసీఆర్ వ్యూహం, గొప్పతనం. మైనర్లు, సబ్మైనర్లు, ఫీల్డ్ చానెళ్ల నిర్మాణం ఆలస్యమవుతుందని తెలుసు కాబట్టే ప్రాజెక్టును ఎక్కడికక్కడ తొలుత చెరువులతో అనుసంధానం చేశారు. తద్వారా చెరువులను నింపి దాని కింది ఆయకట్టుకు రెండు పంటలకు ఢోకా లేకుండా చేసి రైతాంగానికి సాగునీటి భరోసాను కల్పించారు. ఆ విధంగానే 18 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. చెరువుల ద్వారా మత్స్య పరిశ్రమ పెరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. కానీ, కాంగ్రెస్ సర్కారుకే కాదు, గుడ్డిగా విమర్శించే వారికిదేదీ కనపడదు.
ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల హెడ్వర్క్స్ను పూర్తి చేయకుండా, జేబులు నింపుకొనేందుకు కేవలం తేలికపాటి మట్టి పనులనే చేసి చేతులు దులుపుకొన్నది. అందుకు ప్రాణహిత ప్రాజెక్టే నిదర్శనం. కానీ, ఆ నేతలే ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరివ్వలేదని ప్రచారం చేయడమే ఆక్షేపణీయం. కాళేశ్వరంపై వారి కుట్రలకు నిదర్శనం.
ఇక కాళేశ్వరం తెలంగాణకు పెను భారమంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమూ అబద్ధమే. ప్రాజెక్టుపై సమగ్ర అవగాహన ఉన్న ఏ ఒక్కరూ ఆ వాదనను సమర్థించరు. ముందుకు తీసుకురారు. దూపైనప్పుడే బావి తవ్వుకుందాం అనేవాళ్లను తెలివిహీనులంటారు. అలాంటివారే కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఇంట్లో ఉన్న ఎక్స్ట్రా సిలిండర్ లాంటింది. సంసిద్ధంగా ఉన్న సైన్యం లాంటింది. యుద్ధం లేదు కదా సైన్యం ఎందుకు, వారికి జీతాలు ఎందుకు దండగా అంటామా? సిలిండర్ అయిపోకముందే ఎక్స్ట్రా బుక్ చేసుకోవడం ఎందుకు? డబ్బు దండగ అంటామా? ఇదీ అలానే. ఇకపోతే ప్రాజెక్టులోని అన్ని పంపులు ఒకేసారి నడిస్తేనే ఆ మాత్రం కరెంటు చార్జీలు వస్తాయి. అది సహజమే. కానీ, ఆ పరిస్థితులు రావనేది కూడా అంతే సత్యం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ నుంచి ఎత్తిపోసుకోవడం ఒక్కటే మార్గం కాదు. వరద సమయంలో ఎస్సారెస్పీ నుంచి జలాలను తరలించుకోవచ్చు. ఎల్లంపల్లి నుంచీ తీసుకోవచ్చు. అలాంటప్పుడు కాళేశ్వరం ఎందుకు? అని అడిగే మేధావులు కూడా ఉంటారు. ఎందుకంటే ప్రధాన గోదావరిలో నవంబర్ చివరి నాటికే ప్రవాహాలు తగ్గిపోతాయి. కానీ, ప్రాణహితలో మార్చి వరకు సూటిగా చెప్పాలంటే ఏడాదిలో గరిష్ఠంగా 10 నెలల పాటు నీటి ప్రవాహాలు కొనసాగుతాయి. అంటే ఆయకట్టుకు ఎప్పుడు, ఎక్కడ నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే ప్రాజెక్టు విశిష్టత. ఎప్పుడు, ఎలాంటి కరువొచ్చినా ఆదుకునే ఏకైక ప్రాజెక్టు ఇదే. ఇది అనుభవంలో ఉన్న సత్యం.
ఇప్పుడు కాళేశ్వరంలోని ఏడో బ్లాక్లో 20వ నంబర్ పిల్లర్ కుంగింది. దానికి అటూఇటూ ఉన్న మరో రెండు పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. అయితే దానికే ‘కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు కళంకం. ఇక బరాజ్ ఏ మాత్రం పనికిరాదు, పూర్తిగా వృథా’ అంటూ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా బరాజ్లో జరిగిన ఘటన విచారకరం. దురదృష్టకరం. అదే సమయంలో సాంకేతిక ఇంజినీరింగ్ నిర్మాణాల్లో, మరీ ముఖ్యంగా ప్రాజెక్టుల్లో ఇలాంటి లోపాలు తలెత్తడం అత్యంత సహజం. అందుకు చరిత్రలో సాక్ష్యాలు కోకొల్లలు. నాగార్జునసాగర్ డ్యాం కుడివైపు కట్ట 1989లో పూర్తిగా కుంగిపోయింది. కడెం డ్యాం పరిస్థితి అంతే. ప్రకాశం బరాజ్, ఫరక్కా బరాజ్లోనూ అనేక సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇక మన కండ్ల ముందు జరిగినవి కూడా ఉన్నాయి. మిడ్మానేరు ప్రాజెక్టు నిర్మాణ దశలోనే బండ్తో సహా కొట్టుకుపోయింది. ఇది కాంగ్రెస్ హయాంలోనే. ఇక నిర్మాణానంతరం నీటి నిల్వ ప్రారంభించగానే ఎడమవైపున బండ్కు పెద్ద బుంగపడింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు, పాలెం ప్రాజెక్టు మరో ఉదాహరణ.
అంతవరకు ఎందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే నిధులను కేటాయిస్తూ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టే నిలువెత్తు సజీవ సాక్ష్యం. డ్యాంకు సంబంధించిన అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతిన్నది. వాటన్నింటినీ అలా వృథాగా మూలకు పడేశారా? నాటి పాలకులు కారణాలను అన్వేషించి పునరుద్ధరించారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును సైతం పునరుద్ధరించేందుకు గతేడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీ ఇంజినీర్లతో కసరత్తు చేస్తున్నది. మేడిగడ్డ బరాజ్ కూడా అంతే. కానీ, కాంగ్రెస్ పాలకులు ఆ పనిని మానేసి కేవలం ప్రాజెక్టును బదనాం చేయడమే లక్ష్యంగా ముందుకుసాగడమే ఇక్కడ విచారకరం.
మేడిగడ్డ పర్యటనంటూ, శ్వేతపత్రమంటూ అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇప్పటికైనా పాలకులు భేషజాలకు పోకుండా బరాజ్ పునరుద్ధరణపై దృష్టిపెట్టాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థల సహాయం తీసుకొని పిల్లర్ కుంగుబాటునకు గల కారణాలను అన్వేషించాలి. తగు నివారణ చర్యలు చేపట్టాలి. బరాజ్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. ఎందుకంటే, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల జీవనాడి. అది సత్యం. నేడు అది అబద్ధమని ప్రచారం చేసినా, రేపటి రోజున అనుభవంలోకి తప్పక వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.