బాదామి చాళుక్యుల కాలం నాటి వాస్తు, శిల్ప ప్రతిభకు కర్ణాటకలోని బాదామి గుహాలయాలు, ఐహోళే, పట్టడకల్ తార్కాణంగా నిలిస్తే, అలంపూర్ మన తెలంగాణలో తలమానికంగా ఉంది. బాదామి చాళుక్య కాలంలో వైదిక మతంలో మార్పులు, పెరుగుతున్న శైవ మత ప్రభావం, తదనుగుణంగా శిల్పరీతిలో, లక్షణాల్లో వచ్చిన అభివృద్ధికి అలంపూర్ మ్యూజియం వంటిది. తొలి చారిత్రక యుగంలో మొదలైన అమ్మ తల్లి ఆరాధన నుంచి శైవం, శాక్తేయం వరకు వచ్చిన మార్పుల కాలనాళిక అలంపురం, దాని చుట్టుపక్కల ప్రాంతం. ఆ తర్వాత వచ్చిన రాష్ట్రకూట, కల్యాణి చాళుక్య, కాకతీయ, విజయనగర, కుతుబ్షాహీల వరకు శాసనాలు, కట్టడాల రూపంలో ఇక్కడ ఆధారాలున్నాయి.
ఆలంపూర్ పేరు ఇక్ష్వాకుల ‘హల’ నుంచి వచ్చిన హలంపురమా లేక ఇక్కడి గ్రామ దేవత ఎల్లమ్మ నుంచి వచ్చినదా అనేది చర్చనీయాంశమే. గడియారం రామకృష్ణ శర్మ ఎల్లమపురం అలంపురం అయిందని, అందుకే స్థల పురాణంలో ఉన్న హేమలాపురం ఎల్లమపురం సంస్కృత రూపమే కావచ్చునని భావించారు. దానికి సాక్ష్యంగా దగ్గరలో ఉన్న ఉండవెల్లి గ్రామంలో ‘హేమల’ పేరుతో ఒక తలను పూజిస్తారని చెప్పారు.
గ్రామీణ మతంలో ఎల్లమ్మ కథ తెలియని తెలంగాణ పల్లె లేదు. జమదగ్ని భార్య రేణుకను తండ్రి ఆజ్ఞపై చంపిన పరశురాముడి కథలో వేరుపడ్డ తల ఎల్లమ్మగా, మొండెం భాగం భూదేవిగా పూజిస్తున్నారు. ఎల్లమ్మ పూజ బ్రాహ్మణీయ వైదిక మతం కంటే గ్రామీణ మతంగా ఎదిగింది. మరొకవైపు శాతవాహన, ఇక్ష్వాకు కాలం నుంచి కనిపిస్తున్న ‘లజ్జా గౌరి’ లేక ‘నగ్న కబంధ’ అనే తల లేని స్త్రీ విగ్రహం ‘పునరుత్పత్తి’ దేవతగా ఉంది. ఈ విగ్రహానికి తలకు బదులు తామర పువ్వు ఉంటుంది. ఇప్పటివరకు అలంపూర్లోనే ఇలాంటి శిల్పాలు నాలుగు బయటపడ్డాయి. ఒక విగ్రహం ఆలయంలో పూజలందుకుంటున్నది.
అలంపూర్ క్షేత్ర దేవత జోగులాంబ. ఇప్పుడున్న బ్రహ్మేశ్వరాలయంలో జోగులాంబ ప్రధాన దేవత అని ‘శైవులీమెను లాగి వైచి ఆ చోట బ్రహ్మేశ్వరుని ప్రతిష్ఠించి ఉన్నారు’ అని గడియారం రామకృష్ణ శర్మ రాశారు. అందుకే బ్రహ్మేశ్వరాలయ ద్వార పాలికలుగా చండిక ముండిక శిల్పాలున్నాయని భావించారు. పునరుత్పత్తి సంకేతమైన అమ్మ తల్లి పూజ రూపమే జోగులాంబ కావాలి. ఈమె క్రమంగా సంస్కృతీకరణ చెంది అష్టాదశ శక్తి రూపాల్లో భాగమైందని భావించవచ్చు. అలంపూర్ మొదట నుంచి ఎల్లమ్మ స్థానంగా ఉండి, ఆ తర్వాత నవబ్రహ్మల ఆలయాల నిర్మాణం జరిగి ఉంటుందని, ఆ క్రమంలోనే ‘అమ్మ తల్లి ఆరాధన’పై శైవం ఎదిగిందనిపిస్తుంది.
చాళుక్యులకు అమ్మ తల్లి సంస్కృతికి ఉన్న సంబంధం: శాసనాల్లో తాము హారీతీ పుత్రులమని- ‘సప్తలోక మాతృభిః సప్తమాతృభిరభివర్ధితానాం’ – సప్త మాతృకల వల్ల వృద్ధి చెందినామని వీరు చెప్పుకొన్నారు. గుళ్ళలో సప్తమాతృక శిల్పం ప్రముఖంగా కనిపించేది బాదామి చాళుక్య కాలం నుంచే. ఈ ఏడుగురు అమ్మ తల్లుల పేర్లు బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చంద్రాణి, చాముండి. వీరితో పాటు, సప్త మాతృకల శిలాఫలకంపై ఒకవైపు వీరభద్రుడు, చివరలో గణపతి ఉంటారు. అలంపూర్లో
సైతం సప్త మాతృకల శిల్పాలు దొరికాయి. ఇదంతా తొలినాళ్ల ‘అమ్మ దేవతల ఆరాధన’ గురించి, మన సంస్కృ తి మూలాల్లో ఉన్న స్థానిక విశ్వాసాలు రూపుదిద్దుకున్న క్రమాన్ని వివరిస్తాయి. అందుకే అలంపురం అమ్మ తల్లి పూజకు చారిత్రక ఆధారంగా ఉంది. ఆ క్రమంలోనే శాక్తేయ సంబంధమైన అష్టాదశ పీఠాల్లో అలంపూర్ జోగులాంబ కూడా ఒకటిగా మారింది.
ద్రావిడ-నగర వాస్తు రీతుల సంగమం: దక్కనులో బాదామి చాళుక్య రాజ్యంలో వచ్చిన వాస్తురీతి సరిగ్గా భౌగోళిక స్థితికి అద్దం పడుతుంది. ఉత్తర భారతదేశంలో ఎదుగుతున్న నగర వాస్తు రీతికి, దక్షిణాన విస్తరిస్తున్న ద్రావిడ శైలిని మేళవించి వచ్చిందే బాదామి చాళుక్య వాస్తు శిల్ప రీతి. ఈ చాళుక్య రీతిని వేసర రీతి అంటారు. ఈ వేసర శైలిని ఆ తర్వాత రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యులు మరింత అభివృద్ధి చేస్తే, కాకతీయుల కాలంలో ఈ శైలి మరిన్ని సొబగులు దిద్దుకొని పరాకాష్ఠకు చేరుకుంది.
నవబ్రహ్మ ఆలయాలు: ఉత్తరవాహిని అయిన తుంగభద్ర ఒడ్డున కోట మధ్య నెలకొన్న ఆలయ నగరం అలంపురం. ఇక్కడి శివాలయాల పేర్లు చాలా ప్రత్యేకమైనవి. గరుడ బ్రహ్మ, వీర బ్రహ్మ, పద్మ బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, కుమార బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, తారక బ్రహ్మ, అర్క బ్రహ్మ, బాల బ్రహ్మ- ఇలా తొమ్మిది ఆలయాలను కలిపి నవ బ్రహ్మ ఆలయాలని పేరు. ఇవన్నీ బాదామి చాళుక్య కాలంలో వేర్వేరు రాజుల కాలంలో కట్టినవే. శాసనాధారాల బట్టి చూస్తే మొదటి విక్రమాదిత్య కాలంలో (క్రీ.శ.654-681)
అర్క బ్రహ్మ ఆలయంలో లింగ ప్రతిష్ఠ చేసినట్లు తెలుస్తున్నది. బాల బ్రహ్మ ఆలయం క్రీ.శ.702 నుంచి ఇప్పటివరకు కాలానుగుణంగా వచ్చిన మార్పులతో నిరంతరంగా పూజలందుకుంటున్నది. ఇక్కడి ఆలయ నిర్మాణాలు, మార్పులు చేర్పులు క్రీ.శ.16వ శతాబ్దం వరకు కొనసాగాయి.
శిల్పరీతి విషయానికి వస్తే అలంపూర్ చాళుక్య శిల్పం వైదిక శిల్పరీతిలో ఒక ముఖ్యమైన మజిలీగా భావించాలి. ఇక్ష్వాకుల కాలంలో మొదలైన వైదిక ఆలయ నిర్మాణం, గుప్తకాలంలో ఎదిగి స్పష్టమైన శిల్ప లక్షణాలను సంతరించుకున్నది. అది పల్లవ, బాదామి చాళుక్య కాలం నాటికి మరింత సౌందర్యాన్ని సొంతం చేసుకున్నది. అందుకే వైదిక మతంలో వస్తున్న మార్పులు, కథలను శిల్పంలో ఇముడ్చుకున్నది చాళుక్య శిల్ప రీతి. కర్ణాటకలోని బాదామి, ఐహోళే, పట్టడకల్, మన అలంపురం ఆలయ సముదాయాలు బాదామి చాళుక్య శిల్ప రీతికి అద్దం పడుతాయి.
అలంపూర్ అస్తిత్వం గడియారం రామకృష్ణ శర్మ
అలంపూర్ చరిత్రను ప్రచారం చేయడం మొదలు, కృష్ణ తుంగభద్రలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులలో అలంపూర్, చుట్టుపక్కల ప్రాంతాల చరిత్ర జలసమాధి కాకుండా ఉండాలని గడియారం రామకృష్ణ శర్మ పడిన తపన అంతా ఇంతా కాదు. ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ను సారస్వత పరిషత్ సభల పేరిట అలంపూర్కు రప్పించి, అలంపూర్ను సంరక్షించే ప్రయత్నం చేశారు. ఈయన తపనకు అప్పటి ఆర్కియాలజీ శాఖ డైరెక్టర్ పి.శ్రీనివాసాచారి సహకారం, ప్రోత్సాహం తోడై అలంపూర్ను సజీవంగా నిలబెట్టాయి.
-డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000