ఆడబిడ్డలను ఎలా గౌరవించాలో కూడా తెలువని నాయకులు దేశం కోసం, ధర్మం కోసం పాటుపడుతున్నామని ప్రగల్భాలు పలుకుతుండటం హాస్యాస్పదం. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ వ్యక్తిగత దూషణలు, మహిళల పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ కుసంస్కారం. బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ ఆ కోవకు చెందినవాడే అనడానికి ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు నిదర్శనం.
తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆలోచనే తప్ప.. బీజేపీకి ప్రజల బాధలు, ప్రజా సమస్యలు పట్టడం లేదు. అధిక రాష్ర్టాల్లో తామే అధికారంలో ఉన్నామంటూ బీజేపీ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇక మిగిలిన రాష్ర్టాల్లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయక త్వం కుటిల పన్నాగాలు పన్నుతున్నది. ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ప్రభుత్వాలను కూల్చివేసి బీజేపీ తన ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలోనూ అదే తీరులో అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నది. మునుగోడు ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న సాకుతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి విఫలమైంది. అయినా బీజేపీ మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం వీడటం లేదు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఉద్యమంలో పాల్గొ న్నది లేదు. ఉద్యమానికి దన్నుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తుంటే రాజీనామా చేయకుండా ఉద్యమానికి ద్రోహం చేసిన ఘనత బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిది. నేడు ఆయన నీతులు వళ్లించడం సిగ్గుచేటు. కనీసం తెలంగాణ కోసం నాటి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కూడా ఏ మాత్రం కృషిచేయని బీజేపీ నాయకులకు అసలు తెలంగాణలోనే చోటు లేదు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ అవిశ్రాంత పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కాంక్ష సాకారమైంది.
తెలంగాణలో ఏం చేసైనా అధికారంలోకి రావాలనే ఏకైక ఎజెండా బీజేపీది. ఆ విధానం వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. పాదయాత్రలు, ప్రలోభాలతో ఇతర పార్టీల నాయకులను బీజేపీలో చేర్చుకుంటూ తాము బలపడుతున్నామనే భ్రమలో అహంకారపూరిత మాటలు మాడ్లాడుతున్నారు. పైగా చెప్పుకోవడానికి రాష్ర్టానికి చేసిందేమీ లేకపోవడంతో ప్రతి విషయంలో కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రతి సందర్భంలో వ్యక్తిగతంగా దూషిస్తుం డటం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజల సంక్షేమం కోసం మాట్లాడటంలో తప్పు లేదు. కానీ ఇప్పటికీ తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులను వివక్షతో నిలిపివేసినా కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కేంద్రం తెలంగాణకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయ డం, వివక్షను ప్రదర్శించడాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఓవైపు ప్రభుత్వాలను కూలగొట్డి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ ఆయా రాష్ర్టాలలో అధికారంలోకి వస్తున్న బీజేపీ రాజకీయాల తీరును చూస్తున్నాం.
మహిళ అనే కనీస మర్యాద లేకుండా నిజామాబాద్ ఎంపీ అరవింద్ తన మాటల్లో అహంకారాన్ని ప్రదర్శించడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. నోరున్నది కదా అని ఇష్టారీతిన మాట్లాడితే ప్రజలు సరైన సమయంలో, సరైనరీతిలో జవాబు చెప్తారనడంలో సందేహం లేదు. దానికి ఎంపీ ధర్మపురి అరవింద్ అతీతుడేం కాదు. ఈ విషయం ఆయన గుర్తుంచుకుంటే ఆయనకే మంచిది.
తెలంగాణలో అటువంటి కుట్ర రాజకీయాలకు తావు లేదు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు నిత్య చైతన్యవంతులు. దీంతో ఏం చేయలేక వ్యక్తిగతంగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడాన్ని సమాజం ఆలోచించాలి. కేసీఆర్ కుటుంబాన్ని దూషించే సమయంలో ఆడబిడ్డ అనే కనీస అవగాహన లేకుండా ఎమ్మెల్సీ కవితను వ్యక్తిగతంగా వివర్శించడం బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనం.తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మహిళాలోకాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో కవిత చేసిన కృషి యావత్ సమాజానికి తెలుసు. తాను స్వయంగా కదనరంగంలోకి దూకి ఉద్యమించిన తీరును అభినందించకుండా ఉండలేం.
విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అద్భుతమైన భవిష్యత్తు ఉన్నప్పటికీ.. తెలంగాణ నాలుగున్నర కోట్ల సబ్బండ వర్గాల భవిష్యత్తు కోసం తండ్రి కేసీఆర్ బాటలో ఉద్యమజెండాఎత్తుకున్న వీర వనిత కల్వకుంట్ల కవి త. తెలంగాణ జాగృతితో పది జిల్లాలలో ఆమె మహి ళా లోకాన్ని ఉద్యమంలో నడిపించిన తీరును గుర్తుంచుకోవాలి. తెలంగాణ సంస్కృతిలో గొప్ప పండుగ అయిన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితకు దక్కుతుంది. బతుకమ్మను కూడా ఉద్యమంలో భాగం చేసి మహిళల్లో చైతన్యం నింపారు. ఎన్నిసార్లు అక్రమ అరెస్టులు చేసినా భయపడకుండా ఉద్యమిం చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు మహిళాలోకం తరుఫున తమ గళాన్ని వినిపించారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అంతేకాకుండా రాష్ర్టానికి రావాల్సిన నిధుల గురించి, విభజన హామీల గురించి పార్లమెంట్లో గళమెత్తిన చరిత్ర ఆమెది. అలాంటి నాయకురాలిని దూషించడం సరికాదు. కేసీఆర్, కేటీఆర్, కవితలపై ఆరోపణలు చేస్తూ… వారి గౌరవాన్ని దెబ్బతీస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం బీజేపీ కుటిల ప్రయత్నమే. ఇటీవల ఓ స్కాం అంటూ ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి ఆమె గౌరవాన్ని దెబ్బతీయాలని చూసిన బీజేపీ శ్రేణులు దానిపై నిరాధార ఆరోపణలు చేసి కన్పించకుండా పోయారు. తెలంగాణ సాధించిన పార్టీ… రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తున్న పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వంతో అభివృద్ధి పనులు చేయించాలే తప్ప.. నిరాధార ఆరోపణలు చేస్తూ.. ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదు.
(వ్యాసకర్త: దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు)
సంపత్ గడ్డం
78933 03516