స్త్రీ లేకపోతే మానవ జాతికి జననమే లేదు. స్త్రీ లేకుండా అసలు సృష్టే లేదు. నవ మాసాలు మోసి నూతన ప్రపంచ సృష్టిలో ప్రధాన భూమికను పోషిస్తున్నది స్త్రీ. అయితే ఇటీవల ప్రచురితమైన యూనిసెఫ్ నివేదిక ప్రకారం.. దేశంలో రోజుకు 2 వేలకు పైగా అనుమతి లేని లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఫలితంగా భ్రూణహత్యలు పెరుగుతున్నాయి. దీంతో 50 మిలియన్ల బాలికలు పిండస్థ దశలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దానివల్ల లింగ నిష్పత్తి తగ్గుతున్నది. మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు మాత్రమే ఉండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్నది. కాగా ఇతర దేశాల్లో 1000 మంది పురుషులకు 1050 మంది స్త్రీలతో అభిలషణీయమైన స్త్రీ పురుష నిష్పత్తి కొనసాగుతుండటం అభినందనీయం.
పురుషాధిక్య పునాదులపై నిర్మించబడ్డ భారతీయ సమాజంలో ఆధిపత్య భావజాలమే ప్రధాన అవరోధంగా మారింది. ఇదే బాలికల జననాన్ని అడ్డుకుంటుందనేది నిర్వివాదాంశం. మనుధర్మ స్మృతి ఆలంబనగా పుత్రులే వంశోద్ధారకులు. మరణానంతరం వారు చితికి నిప్పంటిస్తేనే పుణ్య లోకాలు లభిస్తాయనీ లేదంటే పున్నామ నరకం తప్పదనే భావజాలం మనది. పెరిగి పెద్దయిన తర్వాత పరాయి ఇంటికి వెళ్లి అక్కడే జీవితాంతం గడుపుతూ అత్తారింటి సేవకే అంకితమైతారు స్త్రీలు. వారు పుట్టింటికి వరకట్నంరూపంలో అప్పులకు కారణమౌతారన్నది మన భావన. వారు కుటుంబానికి ఆస్తిగా ఏనాడూ మారరని అనుకుంటారు. ఇవన్నీ బాలికల పుట్టుకతోపాటు వారి ఎదుగుదలకు అవసరమైన పోషణకు అడ్డొస్తున్నాయి.
నిజానికి ఆధునిక వైద్య శాస్త్ర విజ్ఞానమే స్త్రీలకు శాపంగా మారింది. పిండస్థ దశలోనే శిశువు ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం కోసం స్కానింగ్ చేస్తారు. ‘ప్రి కన్సీవ్ అండ్ ప్రి నాటల్ డయాగ్నోసిస్ టెస్ట్’ పేరుతో చేసే ఈ స్కానింగ్ గర్భస్థ శిశువులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అపూర్వమైన వరం. కానీ ఆచరణలో వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తూ స్కానింగ్ను స్వార్థానికి వాడుకుంటున్నారు. డబ్బుల కోసం దొడ్డిదారిన గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. బాలిక అని నిర్ధారించిన మరుక్షణమే గర్భస్రావం చేయిస్తున్నారు. అత్యంత కిరాతకంగా భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.
నిజానికి గర్భస్థ శిశువు ఏదైనా రోగం బారిన పడి ఎదుగుదల ఆగినప్పడు ఆ రుగ్మతను తెలుసుకోవడానికి స్కానింగ్ చేయాలి. ఈ క్రమంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేయడానికి ససేమిరా వీల్లేదు. మెడికల్ ఎథిక్స్ ప్రకారం కూడా గైనకాలజిస్ట్ , రేడియాలజిస్ట్, స్కానింగ్ సెంటర్ గానీ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేసి బాలిక లేదా బాలుడని తల్లిదండ్రులకు చెప్పడానికి వీల్లేదు.
ఆధునిక వైద్యశాస్త్ర విజ్ఞానంలో మానవ మేధస్సు కనుగొన్న వినూత్న పరికరమే అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషిన్. తల్లి గర్భంలో పిండంగా ఉన్న గర్భస్థ శిశువులు శరీర నిర్మాణం తెలుసుకోవడానికి స్కానింగ్ అవసరం. దానికోసం కార్పొరేట్ వైద్య సంస్థలు అనివార్యంగా స్కానింగ్ సెంటర్లను నెలకొల్పడం గమనార్హం. కానీ ఆచరణలో మాత్రం మెజారిటీ వైద్య సంస్థలు, స్కానింగ్ సెంటర్లు తమ లాభాల కోసం, డబ్బుల కక్కుర్తితో గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ చేస్తున్నారు. ఫలితంగా బాలికలు భ్రూణహత్యలకు గురవుతున్నారు. గర్భస్థ శిశు హత్యలను ఆపాలనే సంకల్పంతో ప్రభుత్వం 1994లోనే ఓ సమ గ్ర చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని ఉటంకిస్తూ అన్ని దవాఖానలు, స్కానింగ్ కేంద్రాల్లో హెచ్చరికల బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీచేసింది. కానీ అవేవీ అమలు కావడం లేదు.
ఆడపిల్ల వద్దు మగపిల్లవాడే ముద్దు అనే సంప్రదాయం వదలాలి. అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా దూసుకువెళ్తున్న మహిళలను గుర్తించాలి. తద్వారా స్త్రీ పురుషుల నిష్పత్తిని అభిలషణీయమైన స్థాయికి చేరుకునేలా మద్దతు ఇవ్వాలి.
మహిళలు గర్భస్థ శిశువు దశనుంచే జెండర్ వివక్షతో పోరాడుతున్నారు. తమ పెంపకంలోనూ, పోషణలోనూ కుటుంబంలో అత్యంత దురదృష్టకరమైన వివక్షకు గురవుతున్నారు. అయినా ఓ వైపు తల్లిగా, అత్తగా, కూతురిగా, కోడలిగా కుటుంబ పరమైన బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు అత్యున్నత విద్యను ఆర్జిస్తూ అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.
రాజకీయ , పాలనారంగంలో.. చివరికి సైన్యంలోనూ అత్యున్నత స్థాయికి ఎదుగుతూ పురుషుల కంటే తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అయినా ఆధునిక సమాజానికి ఇరుసులా వ్యవహరించే కుటుంబ వ్యవస్థ ఇంకా సంప్రదాయ ఆలోచనలతో ఇంకా జెండర్ వివక్షను వీడటం లేదు.
మానవ జాతి పునరుత్పత్తిలో సమాన భాగస్వామిగా ఉన్న స్త్రీ జాతిపై వివక్ష కొనసాగుతూనే ఉన్నది. దీనివల్ల భ్రూణ హత్యలు పెరుగుతున్నాయి. దీన్ని నివారించాలంటే ముందు తల్లిదండ్రుల వైఖరి మారాలి. ఆడపిల్ల వద్దు మగపిల్లవాడే ముద్దు అనే సంప్రదాయం వదలాలి. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకువెళ్తున్న మహిళలను గుర్తించాలి. తద్వారా స్త్రీ పురుషుల నిష్పత్తిని అభిలషణీయమైన స్థాయికి చేరుకునేలా మద్దతు ఇవ్వాలి. భ్రూణ హత్యలను నిరోధించే బాధ్యత ప్రభుత్వానిదేననే భావన విడనాడాలి. కుటుంబమే కేంద్ర బింధువుగా పౌర సమాజం ఈ సామాజిక రుగ్మతపై పోరాడాలి. ఇది జరిగినప్పుడే స్త్రీ-పురుషుల సమానత్వంతో ఓ ఆదర్శ సమా జ నిర్మాణం జరుగుతుంది.
డాక్టర్ నీలం సంపత్: 98667 67471