శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలంటారు. కరోనా మహమ్మారి రెండవ తాకిడిని తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కారణం నిరంతర అప్రమత్తత, ముందుచూపు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ దవాఖానలు, పడకలు మొదలైనవి భారీగా పెరిగిపోయాయి. ఆక్సిజన్ పడకల సంఖ్యయితే యాభై రెట్లు పెరిగింది. సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందనడానికి రోగుల సంఖ్య భారీగా పెరగడమే సాక్ష్యం. గతంలో ఎన్నడూ లేనివిధంగా డయాలసిస్ సౌకర్యం ఉచితంగా కల్పించడంతో, వేలాది మంది కిడ్నీ రోగులు ఊరట పొందుతున్నారు.
వాస్తవాలను గుర్తించి, నిర్మాణాత్మక సహకారాన్ని అందించకుండా, గోతికాడ నక్కలా కాచుకొని ఉండటం ప్రతిపక్షాలకు అలవాటే. గిట్టని మీడియా సృష్టించిన అపోహలకు గురైన కొందరు బుద్ధిజీవులు కూడా రాష్ట్ర ప్రభుత్వ సమర్థతను శంకిస్తున్నారు. ఇటువంటి అనుమానపు పక్షులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టి దుస్థితిని, ఇప్పటి పరిస్థితులకు బేరీజు వేసి చూసుకోవచ్చు. లేదా ఇతర రాష్ర్టాలలో కరోనాను ఎదుర్కొంటున్న తీరును తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న కృషితో పోల్చి చూసుకోవచ్చు. నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా మనకున్న వ్యవస్థలు సాధారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రూపొందించినవై ఉంటాయి. ఎంత పటిష్ఠమైన వ్యవస్థలైనా ప్రకృతి బీభత్సాలు, కొవిడ్ వంటి మహమ్మారులను ఎదుర్కొనడానికి పూర్తిగా సరిపోవు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కొంటున్న తీరు ప్రశంసనీయమైనది.
మన రాష్ట్రంలో నెలకొన్న ఉన్నత ప్రమాణాల చికిత్స మూలంగా ఇతర రాష్ర్టాల నుంచి రోగులు వచ్చి మన దవాఖానలలో చేరుతున్నారు. మన ప్రభుత్వ దవాఖానలలో ఉన్న రోగుల్లో నలభై శాతం మంది ఇతర రాష్ర్టాల వారే! మరోవైపు ఇతర రాష్ర్టాలలో ఆక్సిజన్ కోసం లూటీలు సాగుతున్నాయి. ఆక్సిజన్ నిలువ, తరలింపు సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసిన అగత్యం ఏర్పడింది. దేశవ్యాప్త పరిస్థితికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వ్యవహరించడం వల్ల రాష్ట్రంలో రోగులకు ఆక్సిజన్ కొరత లేదు. గతంలో పల్లెల నుంచి రోగులు చికిత్స కోసం నగరానికి వచ్చేవారు. నాణ్యమైన చికిత్స అంటే నగరంలోనే ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లోనే ఉన్నత స్థాయి వైద్యం అందించడం వల్ల నగర దవాఖానలపై ఒత్తిడి తగ్గింది. ఇవన్నీ గణాంకాల ఆధారంగా చెప్తున్న వాస్తవాలు. ఆత్మవంచన లేకుండా ఆలోచిస్తే ఎవరికైనా వాస్తవాలు కనిపిస్తాయి. కరోనా బాధితులకు సర్కారు దవాఖానలలో అన్నిర కాల వసతులు లభిస్తున్నాయి. అబద్ధాలకోర్ల మాటలు నమ్మి రోగులు మనో ధైర్యం కోల్పోకూడదు.