స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి
ధర్మ్యాద్ది యుద్ధాచ్ఛ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే॥
(భగవద్గీత 2-31)
తన ధర్మాన్ని తాను విస్మరించకుండా దాన్ని నిబద్ధతతో నిర్వహించడమే అసలైన మానవ ధర్మం. తన ధర్మాన్ని మనిషి ఆచరించనప్పుడే సమాజం అనేక విధాలుగా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అర్జునుడు సుక్షత్రియుడు. ధర్మరక్షణ చేయవలసిన బాధ్యత కలిగినవాడు. చేయవలసిన ధర్మం పట్ల వికలుడై విస్మరించే స్థితికి చేరి క్షత్రియ ధర్మమైన యుద్ధాన్ని చేయలేనన్నాడు. శ్రీకృష్ణుడితో విషయం చెప్పి రణరంగం నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు స్వయంగా పూనుకొని అర్జునుడికి స్వధర్మ రక్షణ గురించి బోధిస్తూ ‘అర్జునా! నువ్వు క్షత్రియుడివి. ధర్మం కోసం ధర్మయుద్ధం చేయడమే నీ స్వధర్మం. అంతేగాక యుద్ధం చేయడం కన్నా శ్రేయస్సును కలిగించేది మరొకటి నీకు సరిపడదు. కాబట్టి దానిగురించి దుఃఖించాల్సిన అవసరం లేదు’ అని స్పష్టంగా కర్తవ్యబోధ చేశాడు.
ప్రపంచం ధర్మమార్గంలో సాగవలసినప్పుడు సమాజంలోని వ్యక్తులు, పాలకులు అందరూ స్వధర్మ నిర్వహణ చేయవలసిందే. ధర్మ జీవనం వ్యక్తికి, సమాజానికి కూడా శ్రేయస్సును కలిగిస్తుంది. మనిషి ఏదో ఒకటి చేయాలనుకొని తన ధర్మాన్ని పక్కనబెట్టి ప్రవర్తించడం వల్ల అన్ని అనర్థాలూ జరుగుతాయి. కాబట్టి స్వధర్మనిష్ఠ శ్రేయస్కరం.
అర్జునుడు క్షత్రియుడు. కౌరవుల దుర్మార్గాలను, దుష్ట ప్రవర్తనలను రూపుమాపవలసిన సందర్భంలో యుద్ధం చేయడం అతని ధర్మం. ధర్మాచరణ చేయవలసిన సందర్భంలో వెనుకంజ వేయడం అనేక ప్రమాదాలకు హేతువై నిలుస్తుంది. దుష్టశిక్షణ ప్రభువు కర్తవ్యం. అవి మరచి భీరువై ప్రవర్తిస్తున్న ధీరునికి సత్యావిష్కరణ చేస్తున్న స్వామివారి మాటలు అన్ని కాలాలకూ వర్తించే శాశ్వత సత్యాలు. జ్ఞానవంతుడైన మానవుడి ప్రవర్తన ఎలా ఉండాలో బోధిస్తున్న మాటలు. ఆత్మ శాశ్వతమనీ, దేహం అనిత్యమని, ధర్మనిష్ఠ బాధ్యత అని, దుఃఖం అనవసరమని పరిపరి విధాలుగా శ్రీకృష్ణ భగవానుడు అర్జున ముఖంగా మానవజాతికి సందేశాన్ని అందించాడు.
ప్రతి మనిషికి ఒక మనసు, బుద్ధి ఉంటాయన్నది అందరికీ తెలిసిన సత్యం. మనసును తన అధీనంలోకి తెచ్చుకొని, స్వబుద్ధితో ఆలోచించి కార్య నిర్వహణ చేయాలి. తన బుద్ధిని రుజుమార్గంలో ప్రవర్తించేవిధంగా మలుచుకొన్నప్పుడు మనిషి ధర్మమార్గం తప్పడు. తనను తాను రక్షించుకుంటూనే సమాజాన్ని కూడా రక్షించవలసిన గురుతర బాధ్యత తన మీద ఉన్నదని తెలుసుకొని తన చర్యలను క్రమపద్ధతిలో నిర్వహించే ప్రయత్నం చేయాలి. అర్జునుడి వంటి యోధుడు ఎలాంటి వినాశనం జరగకుండా సమాజాన్ని కాపాడాలి. అది అతనికి విధించిన ధర్మం. ధర్మాచరణ సందర్భంలో తాను విముఖుడైతే అది అతని ప్రజలకు క్షేమ కారకం కాదు. ఇక్కడ వ్యక్తిగత ఆరాటాలకు ఎటువంటి స్థానం లేదు. వీరుడైనవాడు వాటికి దూరంగా ఆలోచించాలి. అప్పుడే అధర్మాన్ని అడ్డుకునేందుకు ఆత్మవిశ్వాసంతో, దృఢ నిశ్చయంతో ఆలోచించే అవకాశం ఉంటుంది.
ధర్మయుద్ధానికి ధనంజయుడు సిద్ధపడాలన్న శ్రీకృష్ణుడి కాంక్ష నెరవేరాలంటే ఈ బోధనలు అవసరమే. కురు రాజ్యాన్ని పాలించే అర్హత సుయోధనుడిలో లేదు. తండ్రి ధృతరాష్ర్టుని రాజ్యార్హతే ప్రశ్నార్థకమైనప్పుడు, దుర్యోధనుడి అర్హత గురించి విచారణే అనవసరం. అంతేగాక అధర్మవర్తనుడై ప్రవర్తించేవాడు రాజ్యానికి పాలకుడు కావడం తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అర్జునుడిపై ఉంది. అటువంటి అనివార్యమైన సందర్భంలో అర్జునుడు మహా విషాదంలో పడిపోయినందున స్వయంగా జగద్గురువే బోధించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ బోధన సార్వకాలికం, సార్వజనీనం.
– గన్నమరాజు గిరిజా మనోహరబాబు
99490 13448