ఏనుగంతటి సమస్యను వదిలిపెట్టి ఎలుకను పట్టుకున్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహారం. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రైతన్నల పరిస్థితి అటు చూస్తే నుయ్యి ఇటు చూస్తే గొయ్యి అన్నట్లుగా ఉంది. వారిని ఆదుకోవటానికి చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాల్సిన కేంద్రం.. రసాయన ఎరువుల సమస్య పరిష్కారానికి పూనుకోవటం విచిత్రం. ‘ప్రధానమంత్రి ప్రత్యామ్నాయ పోషకాల, వ్యవసాయ నిర్వహణ’ (పీఎం-ప్రణామ్) పేరిట కేంద్రం ఒక కొత్త పథకంపై కసరత్తు చేస్తోంది. రసాయన ఎరువుల వాడకాన్ని క్రమేణా తగ్గిస్తూ, సేంద్రియ ఎరువులను తీసుకురావాలని ఈ పథకం లక్ష్యంగా కేంద్రం చెబుతున్నది. అంతర్జాతీయంగా రసాయన ఎరువుల ధరలు గణనీయంగా తగ్గినా కూడా కేంద్రం ఆ ప్రయోజనం రైతులకు చేరకుండా, వారికిచ్చే సబ్సిడీలను తగ్గిస్తున్నది. గతంలో చమురు ధరల విషయంలోనూ ఇటువంటి ప్రక్రియనే అవలంబించింది. దీని ఫలితంగా, నేడు పెట్రో ధరలు ఏ స్థాయికి చేరాయో చూస్తున్నాం. అయినా కూడా అత్యంత కీలకమైన ఎరువుల విషయంలో కేంద్రం వైఖరి మారలేదు.
భూసారాన్ని కాపాడుకోవటం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవటంలో సేంద్రియ ఎరువులు కీలకం. ఇది నిర్వివాదాంశం. అయితే, సరైన ప్రణాళిక లేకుండా, హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు మంచివైనా అవి ఆశించిన ఫలితాలనివ్వవు. దీనికి శ్రీలంక అనుభవమే ఒక మంచి ఉదాహరణ. రసాయన ఎరువుల వాడకంపై ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స 2021లో హఠాత్తుగా నిషేధం విధించారు. సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలని ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల ఎరువుల దిగుమతులకు చేస్తున్న భారీ వ్యయం తగ్గుతుందని, వాటితో అనేక మంచి పనులు చేయవచ్చని నమ్మబలికారు. కానీ, దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. కేవలం ఆరునెలల్లో వరి ఉత్పత్తి 20 శాతం తగ్గింది. ధాన్యం విషయంలో స్వయంసమృద్ధి సాధించి, తన అవసరాలు తీర్చుకోవటమేగాక ఇతర దేశాలకు ఎగుమతులు చేసిన శ్రీలంక, ధాన్యాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దానికోసం ఎరువుల దిగుమతుల వ్యయం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టింది. శ్రీలంకకు సిరులు కురిపించే తేయాకు ఉత్పత్తి 18 శాతం తగ్గింది. ఇది చూసి రసాయన ఎరువుల విషయంలో కొన్ని మినహాయింపులను ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి ఇదొక ముఖ్య కారణం.
గతంలో ప్రధాని మోదీ హఠాత్తుగా తీసుకున్న నోట్లరద్దు, కరోనా లాక్డౌన్ వంటి నిర్ణయాలు దేశాన్ని ఎలా అతలాకుతలం చేశాయో చూ శాం. నిపుణులతో సంప్రదింపులు, మేధోమథనం, ప్రణాళిక లేకుండా తీసుకునే నిర్ణయాలు ఇలాంటి విపరిణామాల్నే కలిగిస్తాయి. నేడు మనదేశం ధాన్యం ఉత్పత్తిలో స్వావలంబన సాధించి, ఆకలి సమస్యను గణనీయంగా రూపుమాపగలిగిందంటే దానికి కారణం 1960ల నాటి హరిత విప్లవం. ఆ విప్లవానికి చోదకశక్తిలా రసాయన ఎరువులు పని చేశాయి. వాటితో పర్యావరణ సమస్య, దిగుమతుల వ్యయం అన్నది మరో కోణం. దానిని ఎలా పరిష్కరించాలన్న దానిపై ఆచితూచి అడుగులు వేయాలేగానీ, గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ఉండకూడదు.