వానల ద్రోహం, ఎండల దాహం మధ్య
రైతు నడక ఆగదు
భూమి ఒంటిపై పడిన ప్రతి చెమట చుక్క
కాలగర్భంలో నిలిచే విత్తు ఔతుంది.
పగలు తన పొలంలో తనే కూలీ శ్రమ,
రాత్రి కడుపునిండా తింటాననే భ్రమ
ఆశల అగ్గిపుల్లను ఆరనీయని గుండె రైతుదే.
అది నిశ్శబ్ద వీరత్వం.
తన కష్టానికి విలువ ఇవ్వని
రాజకీయాలకూ, సమాజానికీ
నిశ్శబ్దంగా సమాధానం చెప్పే వాడే రైతు.
పూచే పువ్వులోను, ఉడికే అన్నంలోను
అతని చెమట సువాసనే ఉంటుంది.
జాతి ఊపిరి అతనే, భూమి బిడ్డ అతనే
రైతు నిలిచి ఉన్నంత వరకూ
దేశం నిలబడి ఉంటుంది.
ఎండతో యుద్ధం, వానతో సందేహం,
సంతల్లో ఆరాటం యార్డుల్లో పోరాటం
అన్నీ అతని నిత్య సహచరాలు.
వెన్నెలలోనైనా, వానగాలిలోనైనా,
తన నేలతో విడిపోని మనిషి రైతు.
కాళ్లల్లో పగుళ్లు పడ్డా అతని గుడిసెల మీద
ఇంకా పేదరికపు లాంతరు వెలుగుతుంది.
మంచు పడితే పంట పాడవుతుంది,
ఎండ ఎక్కువైతే నేల ఎండిపోతుంది,
వానలు విరుచుకుపడితే వరదలు,
రైతు ప్రతిసారీ లేచి నిలబడతాడు,
మెట్టపొలంలో దేశపు శ్వాస నాటబడి ఉంటుంది.
అతని బాధకు బడ్జెట్లలో స్థానం – స్థానచలనమే!
రైతు మట్టికొట్టుకునే ‘వేళ్ల’ కు పుట్టినవాడు.