ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆత్మబంధువుగా అడుగడుగునా ఆదుకుంటున్నారు. పుష్కలంగా సాగునీరు, నిరంతర కరెంటు, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెనా ధాన్యలక్ష్మి నర్తిస్తున్నది. వ్యవసాయం ప్రణాళికాబద్ధంగా సాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం అధికారాలను కేంద్రీకరించుకుంటున్నదే కానీ, తదనుగుణమైన బాధ్యతను నిర్వర్తించడం లేదు. రైతుల పంటలకు లాభదాయకమైన ధర లభించేలా చేయడం, దేశంలో ఆహార ధరలను స్థిరీకరించడం, ప్రజా పంపిణీ వ్యవస్థకు ధాన్యం అందించడం వంటి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఎఫ్సీఐని సాధనంగా వాడుకోవడమే లేదు. కేంద్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. రాష్ర్టాలతో కలుపుగోలుగా ఉంటూ చర్చించడం లేదు.
ధాన్యం సేకరణ మీద కేంద్రసర్కారు ఆలోచనలు మారుతున్నాయి. మన దేశ ఆహార వ్యవస్థలో ప్రభుత్వం పాత్ర ఉండాల్సిందే. దీంట్లో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)ది కీలక పాత్ర. అయితే, ఆ సంస్థ పని తీరు బాగా లేదని నివేదికలు చెబుతున్నాయి. ఎఫ్సీఐ పనితీరు వల్ల ఆర్థికంగా నష్టం వస్తుందని, ఆ సంస్థలో అసమర్థత, అవినీతి పెరిగిందని భారీ ఎత్తున ఆహార ధాన్యాలు వ్యర్థం అవుతున్నాయనేది జగమెరిగిన సత్యం. ఇదివరకు ఎఫ్సీఐని మూసేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. 1979లో జనతాపార్టీ హయాంలో ఒకసారి, 1990ల ప్రారంభంలో మరోసారి దాని మూసివేత గురించి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎఫ్సీఐని ప్రక్షాళన చేయాల్సిందిపోయి దానిని ప్రైవేటీకరణ చేసే దిశగానే ఆలోచన చేస్తున్నది.
ఎఫ్సీఐ పునర్వ్యవస్థీకరణకు 2014లో కేంద్రప్రభుత్వం శాంతకుమార్ నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 2015లో ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎఫ్సీఐ తన లక్ష్యాలను నెరవేర్చటంలో విఫలమైంది. ఆ సంస్థ ద్వారా జరిగే ఆహారధాన్యాల సేకరణ కొన్ని రాష్ర్టాలకే పరిమితమై కేవలం 6 శాతం రైతులకే ఆ ప్రయోజనాలు లభించాయి. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థలో లీకేజీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్సీఐని పునర్ వ్యవస్థీకరణకు ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సులలో మొట్టమొదటిది: గోధుమలు, వరి తదితర పంట ఉత్పత్తుల సేకరణ కార్యకలాపాల విషయంలో తగినంత అనుభవం సంపాదించి, తగిన వసతులను ఏర్పాటు చేసుకున్న రాష్ర్టాలకు ఆ సేకరణ బాధ్యతలను అప్పగించాలి. ఈ విషయంలో తగిన మౌలిక సదుపాయాలున్న (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ర్టాలకు ఈ బాధ్యతను ఇవ్వాలి. రాష్ర్టాల అవసరాలను మినహాయించిన తరువాత కేవలం మిగులును మాత్రమే ఎఫ్సీఐ తీసుకోవాలి. ఈ మిగులును ధాన్యం లోటు ఉన్న రాష్ర్టాలకు ఎఫ్సీఐ తరలించాలి. రైస్ మిల్లర్లపై లెవీని తొలగించాలి. పంట మార్పిడిని ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలకు మెరుగైన మద్దతుధర అందించాలి. పేద కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి ఇప్పుడు ఇస్తున్న 5 కిలోల ఆహారధాన్యాల బదులు 7 కిలోలు ఇవ్వాలి. పంట సేకరణలో పప్పులు, నూనె గింజలను జోడిస్తూ సేకరణ స్థాయిని పెంచాలి. ఇవీ శాంతకుమార్ కమిటీ సిఫార్సులు.
ఎఫ్సీఐ అసమర్థత రైతులకు శాపంగా మారింది. దాదాపు 1,42,000 మంది కార్మికులతో (కాంట్రాక్ట్ కార్మికులతో సహా), 21,181 సిబ్బందితో, 11 మంది ఐఏఎస్ అధికారులతో నిండి ఉన్న ఎఫ్సీఐలో ఇంకా 20,857 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ నివేదిక చెబుతున్నది. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న ఎఫ్సీఐ నేరుగా చేస్తున్న సేకరణ కేవలం సుమారు 1 శాతం వరి, 10 శాతం గోధుమలు. మిగిలిన సేకరణ ఆయా రాష్ట్రప్రభుత్వ సంస్థలు చేస్తున్నాయి. ఎఫ్సీఐ గోడౌన్లు సెప్టెంబర్, 2019 నాటికి 64 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలతో (గోధుమలు, బియ్యం) నిండిపోయాయి. ఉండాల్సిన 23 మిలియన్ టన్నుల కంటే 40 మిలియన్ టన్నులు ఎక్కువ ఉన్నాయి. వీటిలోనూ బియ్యం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి (22 మిలియన్ టన్నులు బియ్యం, 18 మిలియన్ టన్నులు గోధుమలు). అధిక తిండి గింజల స్టాక్ విలువ ఒక దశలో రూ.2 లక్షల కోట్లు. ఈ నిల్వలను తగ్గించుకోవడానికి కూడా ఖర్చు అవుతుంది. ఎఫ్సీఐ 2019-20లో నేరుగా 16.12 మిలియన్ టన్నుల బియ్యం మార్కెట్లో అమ్మింది. 2020-21లో ఆగస్ట్ నాటికి కేవలం 5.2 మిలియన్ టన్నులు మాత్రమే అమ్మగలిగింది.
అదనపు ధాన్యాన్ని నిల్వ చేయడానికి రూ.15,000 కోట్లు ఖర్చవుతుందని ఎఫ్సీఐ స్థూలంగా అంచనా వేసింది. 2011-12 నుంచి 2016-17 వరకు ఎఫ్సీఐ గోడౌన్లలో సుమారు 62,000 టన్నుల ఆహారధాన్యాలు, ప్రధానంగా బియ్యం, గోధుమలు దెబ్బతిన్నాయని అధికారిక సమాచారం. కాగా, 2019-20లో 1,930 మెట్రిక్ టన్నులు వరదల వల్ల పనికి రాకుండా పోయాయని ఎఫ్సీఐ ఇచ్చిన సమాచారం. ఎఫ్సీఐ గోదాముల్లో చీడపీడల బెడద, గోడౌన్లలో వర్షం నీళ్ళ లీకేజీలు, నాణ్యత లేని నిల్వ పద్ధతులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆహారధాన్యాలు పాడవుతున్నాయి. రవాణాలో ఏటా రూ.500 కోట్ల విలువైన ఆహారధాన్యాలు పాడవుతున్నాయి. 2014లో ఒక ఆర్టీఐ కార్యకర్తకు ఎఫ్సీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2005-2013 మధ్యకాలంలో దేశంలో 1.95 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి. వీటిలో సుమారు 84% బియ్యం, 14% గోధుమలు.
ఎఫ్సీఐ నిర్వహణ ఖర్చు కూడా తడిసి మోపెడవుతున్నది. జీతాలకు అయ్యే వ్యయం రూ.875 కోట్ల పైనే. ఆహారధాన్యాల సేకరణ, విక్రయంలో కూడా ఆ సంస్థ పాటిస్తున్న పద్ధతులు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. సేకరణ, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి 2020-21లో క్వింటాలుకు అయిన వ్యయం రూ.3,939. అదే, 2014-15లో ప్రతి క్వింటాలుకు వ్యయం రూ.2,943. రైతుకిచ్చే కనీస మద్దతుధర పోను అంతకంటే ఎక్కువ ఖర్చు ఎఫ్సీఐ చేస్తున్నది.
పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధర లభించేలా చేయడం, దేశంలో ఆహార ధరలను స్థిరీకరించడం, ప్రజాపంపిణీ వ్యవస్థకు ఆహారధాన్యాలను అందించడం ఎఫ్సీఐ ప్రాథమిక లక్ష్యాలు. ఆహారధాన్యాల సేకరణలో, రవాణాలో, నిల్వ చేయడంలో, పంపిణీలో ఉన్న అనేక గందరగోళ ప్రక్రియలతో ఎఫ్సీఐ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించటం లేదు. కొనుగోలు చేసే ధాన్యాల ధర, పరిమాణం, వాటి నాణ్యతపై ఎఫ్సీఐకి నియంత్రణ లేదు. అయితే, ఎఫ్సీఐని మూసివేయడం పరిష్కారం కాదు. రాష్ర్టాలకు ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ బాధ్యతలు అందించడం ద్వార వికేంద్రీకృత వ్యవస్థకు నాంది పలుకవచ్చు. కానీ కేంద్రప్రభుత్వం బఫర్స్టాక్ ఎక్కువగా ఉన్నదని, ఇప్పటికే ఎక్కువ సేకరణ జరిగిందని అంటూనే, వానాకాలం వరి సేకరణ చేస్తాం అని చెబుతున్నది. యాసంగి వరి పంట మాత్రం తీసుకోనంటున్నది. అయితే, భారీ వరి మిగులు అనే మాట ఎంతవరకు వాస్తవం?
బియ్యం నిల్వలు మార్చి 2022 నాటికి ఉండవు. ఇందులో, వానకాలం వరి సేకరణ కలుపలేదు. వానకాలం ధాన్యాన్ని ఎఫ్సీఐ సేకరిస్తే, అది మార్చి, 2022 నాటికి బియ్యం అవుతాయి. అయితే నవంబర్, 2021 నాటి నిల్వలు తీసుకుంటే, ప్రజలకు పంపిణీ చేసిన తర్వాత మార్చి, 2022 నాటికి బియ్యం నిల్వలు మిగిలి ఉండవు. ఆ ప్రకారం చూస్తే, ప్రస్తుత వరిధాన్యం సేకరణ భారం కాదు. నవంబర్, 2021 నాటికి ఎఫ్సీఐ దగ్గర ఇంకా 254.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి. వీటిని, మిల్లింగ్ చేస్తే దాదాపు 165.54 లక్షల టన్నుల బియ్యం వస్తుంది. ఎఫ్సీఐ వద్ద ఉన్న బఫర్స్టాక్ సూత్రం ప్రకారం 1 ఏప్రిల్ నాటికి బియ్యం నిలువలు 210 లక్షల టన్నులు. తెలంగాణ కోరుతున్న అదనపు 40 లక్షల టన్నుల వరి సేకరణ భారం కాదు.
డాక్టర్ దొంతి నరసింహారెడ్డి