ప్రపంచవ్యాప్తంగా మనుషుల అక్రమ రవాణా ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నది. వ్యభిచారం, వెట్టిచాకిరీ, భిక్షాటన, బలవంతపు పెళ్లి, మత్తుపదార్థాల రవాణా, పోర్నోగ్రఫీ లాంటి ఘోరమైన అనుభవాలను బాధితులు ఎదుర్కొంటున్నారు. దీనికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ‘మనుషుల అక్రమ రవాణా (నివారణ, రక్షణ, పునరావాసం) బిల్లు-2021’ని నేడు పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు.
దేశంలో మనుషుల అక్రమ రవాణాను నియంత్రించే చట్టాలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నా ఈ చట్టాలన్నీ కాలం చెల్లినవని, త్వరితగతిన శిక్షలు వేయడానికి సాధ్యపడదని ఎంతోకాలంగా విమర్శ ఉన్నది. ఈ నేపథ్యంలోనే కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. దీంట్లోని ముఖ్యాంశాలు..
బాధితులు కేంద్రంగా ఉండే విధానం: బాధితుల రక్షణ, పునరావాసం, హక్కులు, వారి సంక్షేమ విధానాలను బిల్లులో ప్రతిపాదించారు. బాధితుల కుటుంబసభ్యుల మృతి, శారీరకగాయాలు, యాసిడ్ దాడి, అవయవాలు తీసివేయడం నేరంగా పరిగణించారు. ఇవేకాకుండా బాధితులపై హార్మోన్ల ఉత్ప్రేరకాల ప్రయోగం లాంటి వాటిని నేరాలుగా పొందుపర్చారు. నేర విచారణను వేగంగా, సమర్థతతో పరిష్కరించేందుకు న్యాయస్థానాలు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని నిర్దేశించారు. సాక్షుల రక్షణ, వివరాల గోప్యతను పాటించే చర్యలున్నాయి. నిందితులకు కనీసం 10 ఏండ్ల జైలుశిక్ష ఆపైన జీవిత ఖైదుతోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే వీలుంది.
సంస్థాగతమైన నిర్మాణం: మనుషుల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు పలు సంస్థలను ఏర్పాటు చేసే వెసులుబాటును ఈ బిల్లు కల్పిస్తున్నది. దర్యాప్తు, విచారణ, ఇతర సంస్థలకు సాయం అందించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అవకాశం కల్పించింది.
నివారణ: జాతీయ, రాష్ట్ర, జిల్లా ఆధారిత అక్రమ రవాణా నిరోధక కమిటీలు సంస్థాగతంగా పనిచేస్తాయి. రవాణాను ప్రేరేపించే మూల కారణాలపై సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా చర్యలు చేపడతాయి. అక్రమ రవాణా నివారణకు ఆర్థిక మూలాల కోత అనే అంశం ఒక శక్తివంతమైన సాధనం. రవాణాదారుల బ్యాంకు ఖాతాలను నిలిపివేయడం ద్వారా వారి ఆర్థిక పునాదులను కూలగొట్టవచ్చు.
నేర నిరూపణ: మహిళలు, పిల్లలు, శారీరక, మానసిక దివ్యాంగులకు ఈ చట్టంలో అదనపు రక్షణ ఇచ్చారు. బాధితుల్లో వీరు ఉన్నట్టయితే అక్రమ రవాణాదారులను నేరస్థులుగానే పరిగణిస్తారు. విచారణ సందర్భంగా వారు తమ నిర్దోషిత్వాన్ని తామే నిరూపించుకోవాల్సి ఉం టుంది.
పునరావాసం: బాధితుల అవసరానికి తగినట్టుగా విచారణ సమయంలో ఆర్థిక పునరావాసం కల్పించే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 30రోజుల్లో పునరావాసం కల్పించాలి. ఎఫ్ఐఆర్ ప్రతిని జిల్లా మానవ అక్రమ రవాణా నిరోధక కమిటీకి ఇచ్చిన వెంటనే బాధితుల వైద్య, మానసిక అవసరాలపై దృష్టి పెడతారు.
అమలు: ఈ బిల్లులోని అంశాల అమలును జాతీయ మానవ అక్రమ రవాణా నిరోధక కమిటీ, సంబంధిత మంత్రిత్వశాఖలు, పరిపాలన శాఖలు, అధికారులు, రాజ్యాంగ సంస్థలు, రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రమ రవాణా నిరోధక కమిటీల సమన్వయంతో పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమస్థాయిలో నోడల్ అధికారిని, డైరెక్టర్ స్థాయికి తగ్గకుండా నియమిస్తారు.
పోతుగంటి రాములు