కొంతకాలంక్రితం బీజేపీలో చేరిన వివేక్, ఇటీవలే చేరిన ఈటల రాజేందర్ తమను తాము ప్రశ్నించుకొని ఆత్మవిమర్శ చేసుకుంటే తెలంగాణకు తాము చేస్తున్న ద్రోహమేంటో అర్థమవుతుంది.
స్వయంకృషితో రాష్ట్ర, దేశ స్థాయి నాయకులయ్యారు వివేక్ తండ్రి వెంకటస్వామి. కాంగ్రెస్లోఉంటూనే తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. కాంగ్రెస్ వాదిగానే మరణించారు. వివేక్కు రాజకీయ ఉన్నతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్కు బీజేపీకి సైద్ధాంతిక, రాజకీయ వైరుధ్యాలున్నాయి. కాంగ్రెస్ బలహీనపడిన స్థితిలో వివేక్ టీఆర్ఎస్లో చేరారు. మడమతిప్పని పోరాటంతో తెలంగాణ ప్రజల చిరకాలస్వప్నం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్లో చేరారంటే అర్థముంది. కానీ అందులో పదవి దక్కలేదనో, సరైన స్థానం లేదనో బీజేపీలో చేరడం ఏమిటి? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండిఉంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, దళిత బహుజన కులాలకు ఆ పార్టీ వ్యతిరేకమన్న విషయం వివేక్కు తెలియంది కాదు. అయినా సరే స్వప్రయోజనాలకోసం బీజేపీలో చేరి తెలంగాణకు అన్యాయం చేసేవారి జాబితాలో చేరిపోయారు.
ఇక ఈటల రాజేందర్ సంగతి. విద్యార్థిగా ఉన్నప్పుడు వామపక్ష సంఘాల్లో ఉన్నారయన. ఆ తర్వాత వ్యాపారిగా మారి ఓ స్థితికెదిగారు. టీఆర్ఎస్ ఏర్పడిన మూడేండ్ల తరువాత ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ తరఫున ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు మంత్రి పదవులు అనుభవించారు. బీసీలు, బహుజనులకు సంబంధించిన ఏ ఒక్క ప్రశ్ననూ లేవదీయకుండానే 18 సంవత్సరాలు రాజకీయాల్లో గడిపారు. అవినీతి ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీని విడిచి పెట్టి తాను బీసీనంటున్నారు. ఆత్మగౌరవం వంటి పదాలు వాడుతున్నారు. తాను మంత్రిగా ఉండి కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రగతి భవన్నే బానిసల భవన్ అంటూ విమర్శిస్తున్నారు. ఇదెంత బాధ్యతారాహిత్యం? తాను బీసీనని పదవి పోయిన తర్వాత చెప్పుకొంటున్న ఈటల రాజేందర్కు.. బీసీలకు కేసీఆర్ ఎంత అండదండగా ఉంటున్నారో తెలియదా? బీసీ రిజర్వేషన్లను బలపరిచిన మండల్ కమిషన్ నివేదికను అడ్డుకున్న బీజేపీలో చేరడం బీసీలను ఉద్ధరించడానికేనా? తెలంగాణను ఢిల్లీ పార్టీలకు తాకట్టు పెట్టడానికేనా బీజేపీలో చేరింది? దీంతో తెలంగాణ ఆత్మగౌరవం పోతుందా? వస్తుందా?
ఉత్తరాది పెత్తనం నుండి, జాతీయ పార్టీల వివక్షాపూరిత చర్యల నుండి, వలసాధిపత్యం నుండి ఓ రాజకీయావసరంగా ఉద్భవించిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ సమస్యలు తీర్చడం తెలంగాణ ఆత్మనెరిగిన కె.సి.ఆర్.కు తప్ప ఏ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల నాయకులకు సాధ్యం కాదు. ఈ విషయాలన్నీ ఈటల రాజేందర్ లాంటి నాయకులకు బాగా తెలుసు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదనీ తెలుసు. తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం బీజేపీలో చేరడం తెలంగాణకు న్యాయం చేయడమవుతుందో.. తెలంగాణపై ఢిల్లీ పెత్తనానికి స్వాగతం పలుకడమవుతుందో బీజేపీలో చేరేవారే సమాధానం చెప్పాలి.
డాక్టర్ కాలువ మల్లయ్య