నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఐదు ప్రాంతాల్లో ఓటర్లు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. సమాఖ్యవాదం (ఫెడరలిజ ) అనేది భారత్లో భాగమని, ఏ ఒక్క రాజకీయపార్టీ లేదా వ్యక్తి ఓటర్ల మద్దతును గంపగుత్తగా కొల్లగొట్టలేరని మరోమారు నిరూపించారు. ‘ఒకే దేశం- ఒకే నేత’ సిద్ధాంతంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రచారాన్ని ఈ ఫలితాలతో ఓటర్లు తిరస్కరించారు.
అసోం, కేరళ రాష్ర్టాల్లో బీజేపీ, సీపీఎం విజయం సాధించాయి. అయితే ఈ ఫలితాలు పార్టీగా కంటే అక్కడి ప్రభుత్వాల పట్ల ప్రజలకున్న సానుకూల దృక్పథానికే నిదర్శనం. తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిల్లో ప్రాంతీయ కారణాలు, అక్కడ స్థానిక నాయకత్వాలే ఆయా పార్టీల గెలుపోటములను నిర్ధారించాయి.
21వ శతాబ్దం ప్రారంభం నుంచి సగటు భారతీయ ఓటరు దేశ రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు. తమకేం మంచిదో అర్థం చేసుకుంటున్నాడు. ఆ అవగాహనే ఇప్పుడు కేంద్రీకృత, ఏక వ్యక్తి పాలనను కాదని సమాఖ్యవాదాన్ని బలపరిచేలా చేసింది. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు దాన్ని మరోమారు రుజువు చేశాయి. బీహార్, యూపీ లాంటి రాష్ర్టాల్లో సంకీర్ణ భాగస్వాములకు కనీస గౌరవం బీజేపీ ఇవ్వడం లేదన్నది మనం చూస్తున్నదే.
దేశానికి ఇప్పుడు ‘టీమిండియా’ లాంటి ప్రభుత్వం కావాలి. దేశంలోని అన్ని ప్రాంతాలు, రాష్ర్టాలు, పార్టీల నేతలు అందులో భాగస్వాములై ఉండాలి. దేశంలో ప్రజల అలవాట్లు, ఆహారం, ఆచార వ్యవహారాలపై ఏ పార్టీ, ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు. ప్రజల సాధకబాధకాల పట్ల సానుభూతి, వారి అవసరాలు తీర్చే స్వభావం కలిగిన నేతలుండే టీమిండియా ప్రభుత్వం ఇప్పుడు దేశానికి అవసరం.
సమాఖ్యవాదం మళ్లీ బలపడుతున్న తరుణంలో, ఇక తర్వాత ఎన్నికలు జరగబోయే రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలపై ప్రజల దృష్టి పడింది.
దేశంలో అభివృద్ధి సంక్షేమాల్లో ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ సీఎం వైపు అందరూ చూస్తున్నారు. కేసీఆర్ దీక్షా దక్షతపై ఎనలేని విశ్వాసం ఏర్పడింది. మెట్ట ప్రాంతమే ఎక్కువగా ఉన్న తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చి సిరులు కురిపిస్తున్న కేసీఆర్ దార్శనికత ఎనలేనిది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలతో రాష్ర్టాన్ని కేసీఆర్ నందనవనంగా మార్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలో వ్యవసాయం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాలకు కొత్త ఊపిరులూదింది. ఇదిప్పుడు దేశంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, నవీన్ పట్నాయక్ తదితర నేతలు దేశ రాజకీయ భవితవ్యానికి కీలకం కానున్నారు. ఉన్నతమైన ఆలోచనలు, ప్రజా సమస్యల పట్ల సానుభూతి కలిగిన నాయకులు ఏకతాటికపైకి వచ్చి దేశాన్నిఅభివృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
పాల్వాయి రాఘవేంద్రరెడ్డి