దిగంబర కవుల లాగానే వరంగల్లులో 1968-70 మధ్యకాలంలో ‘తిరగబడు కవులు’ఆవిర్భవించారు. వీళ్లేగాక 1969-73 మధ్యకాలంలో ‘ఉషస్సు రచయిత’ల పేరుతో హైదరాబాద్లో పాతబస్తీలో కొందరు ఏర్పడ్డారు. ‘తిరగబడు’ కవులు పదిమంది. వీరంతా తెలంగాణవారే. వరవరరావు, లోచన్, అశోక్, సంజీవరావు, సుధాకర్, యాదగిరిరావు, కిషన్, సుదర్శన్, ఎక్స్రే, ఐ.. ఈ పది మంది మొత్తం 38 కవితలతో ‘తిరగబడు’అనే కవితా సంకలనం తెచ్చారు. దీనికి ఉపశీర్షికగా ‘స్వచ్ఛంద కవితా సంకలనం’ అని పెట్టారు. ఇది 1969 డిసెంబర్లో హన్మకొండ నుంచి వెలువడింది.
తిరగబడు కవులు కలం పట్టేనాటికి దేశ రాజకీయాల్లో.. ‘నక్సల్బరీ ’, ‘నక్సలైట్’ అనే పదాలు ప్రవేశించాయి. నక్సల్బరీ పోరాటంతో భూస్వామ్య వర్గాలను ఎదుర్కొనే స్పష్టమైన మార్గం దేశ ప్రజలకు దొరికింది. దిగంబర కవులకు ఉన్న అస్పష్టత వీళ్లకు లేదు. కసిని, కోపాన్ని ఎవరి మీద, ఏ రూపంలో వ్యక్తం చేయాలో తిరగబడు కవులకు స్పష్టత ఉంది. వీరు పీడిత ప్రజల కోసం, వారి విముక్తి కోసం కలం పట్టారు.
‘ఈ అసమానతల వ్యవస్థను సమూలంగా నాశనం చెయ్..’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంత సూటిగా విప్లవానికి తెలుగు కవిత్వంలో పిలుపునివ్వటం ఇదే మొదటిసారి. ఈ స్పష్టమైన దృక్పథం కవులకు రావడానికి బెంగాల్లో వచ్చిన నక్సల్బరీ పోరాటమే కారణం. ఈ నక్సల్బరీ పోరాటం క్రమంగా శ్రీకాకుళం చేరుకున్నది. గిరిజనులు, ఆదివాసీలపై జరిగే దోపిడీ, పీడనల మీద వీరు ధ్వజమెత్తారు. పోరాట శక్తు ల్ని క్రియాశీలకం చేయటానికి సాయుధ పోరా టం కావలసి వచ్చింది. కవులు కవిత్వగానాలు, కవి సమ్మేళనాలు చేస్తూ పోరాటయోధుల సరసన నిలబడ్డారు. అటువంటి సాయుధ కవిత్వ ఉద్యమానికి ‘తిరగబడు కవుల’ సంకలనం తొలిపిలుపు.
‘నీ తల్లి పురిటి నొప్పుల బాధతో అరిచినప్పుడు..
ఈ నేల మీదకు ఏదో సాధించాలనే ఆకాంక్షతో..
గర్భం చీల్చుకొని వచ్చిన ఆ స్వప్నం సాధించే చేవ నీ చేతుల్లో లేదా..?’ అని వరవరరావు స్తబ్దంగా ఉన్న యువతను ప్రశ్నించాడు. వారిలో భావావేశం కలిగేలా రాశాడు. తెలుగు లో విప్లవ సాహిత్యానికి పునాది వేసింది తిరగబడు కవులే. విప్లవం కోసం.. సాయుధం కావాలని లోచన్ స్పష్టంగా రాశాడు.
‘ఈసారి నీ సమాధానం
అరిగిన మాటల్లో కాదు
విరిగిన వెకిలి నవ్వులో కాదు
ట్రిగ్గర్ మీద పరిగెత్తే వేళ్లలోంచి
మండే కన్నుల్లోంచి
బుల్లెట్ శబ్దంలోంచి రావాలి
మరో మాట వద్దు
వేరే బాట వద్దు
బాయ్నెట్ పాయింట్ మీద
మాట్లాడమంటున్నా
ట్రిగ్గర్ మీద వేళ్లతో రమ్మంటున్నా..’
అంటూ తిరగబడు కవులు కవిత్వంతో యువతరం వేడి నెత్తురును పరుగెత్తించారు. తిరగబడు కవులు అందరూ కలిసి ఒక కవితా సంకలనమే గాక, ఒక్కొక్కరు వేర్వేరు కవితా సంకలనాలను కూడా తెచ్చారు.
‘చేతనావర్త’ కవులు వరంగల్ వాళ్లు. వీరు సమూహంగా ఏర్పడి అవినీతిని, అన్యాయాలను ఎదిరించారు. 1966లో ఏర్పడిన చేతనావర్త కవుల్లో సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, సంపత్కుమార, వే.నర్సింహారెడ్డి ఉన్నారు. వీరూ వచన కవిత్వమే రాశారు. అప్పుడే చేతనావర్తం’ పేరుతో రెండు కవితా సంపుటాలు తెచ్చారు. తిరగబడు కవులు సమాజంలో మార్పు కోసం తిరుగుబాటు అవసరం అని భావించగా, చేతనావర్త కవులు మానవుడు తన విజ్ఞాన బలంతో చైతన్యవంతుడై, తన ఉనికిని గుర్తించి, అభివృద్ధి చెందాలని భావించారు. చేతనావర్త కవులు మానవుడు దివ్యత్వం పొం ది చైతన్యవంతుడవుతాడంటారు. ఈ కవులకు సంప్రదాయ స్పృహ ఎక్కువ. వీరు మార్క్సిస్టు దృక్పథాన్ని స్వీకరించలేదు. వ్యవహారిక భాష లో ప్రాంతీయ నుడికారంతో కవిత్వం రాశారు. పేర్వారం జగన్నాథం కవిత్వంలో సామాజిక స్పృహతోపాటు వ్యంగ్య చమత్కారాలుంటా యి. ఆయన ‘సాగర సంగీతం’ కావ్యాన్ని ప్రచురించాడు. ఛందస్సు తెల్సిన కవి సంపత్కుమా ర. ఆధునిక సమస్యలను తాత్వికంగా వ్యక్తీకరించాడు. మానవుని సమగ్ర వికాసం సంప్రదా యం పునాదుల మీద జరుగుతుందని ఆశించే కవి వే.నర్సింహారెడ్డి.
ప్రగతివాదం కన్నా అంతరాత్మ ప్రబోధమే ఉన్నత విలువలకు ప్రేరణ ఇస్తుందని చేతనావర్త కవులు విశ్వసించారు. ఆధునిక భావ చైత న్యం.. వ్యక్తిని అభ్యుదయ పథంలో నడిపిస్తుందని వీరంటారు. కొంతవరకు ఈ కవులకు అరవిందుని తాత్వికత ఉన్నదని చెప్పవచ్చు. ఈ కాలంలోనే వరంగల్ నుంచి మాదిరాజు రంగారావు చాలా కవిత్వం రాశాడు. జీవ చైతన్యాన్ని ఆశించిన కవి ఇతడు. కవిత్వం ఎప్పుడూ సత్యాన్వేషణగా సాగాలని చెప్పే అనుభూతి కవుల్లో మాదిరాజు చేరాడు. 1970ల్లో ఏర్పడిన అనుభూతి కవుల్లో మాదిరాజు రంగారావు గాక మిగతావారు ఆంధ్రా ప్రాంతం వారు.
ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606