ఉద్యమ నాయకుడే ప్రభుత్వ సారథి కావడం వల్ల అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ధికి నోచుకోని సమూహాలు సరికొత్త జీవన మార్గంలోకి వెళ్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన మూడేండ్లలోనే వెనుకబడిన ప్రాంతాల స్వరూప స్వభావాలు మారడం ప్రారంభమయ్యాయి. ప్రధానంగా నల్లమల ప్రాంతం గురించి చెప్పుకోవాలి.
తరతరాలుగా అడవికే పరిమితమై అభివృద్ధికి ఆమడదూరాన ఉన్న చెంచు జాతి ప్రజల పునరుజ్జీవనానికి కేసీఆర్ పునాదులు వేస్తున్నారు. కొద్దిరోజుల కింద దట్టమైన నల్లమల అడివిలోకి 20 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేసి కొమ్మెనపెంట అనే చెంచు గ్రామంలో ఓ రాత్రి ఉన్నాను. నాతోపాటు ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, చెంచు సామాజిక పరిశోధకుడు, జర్నలిస్ట్ మిత్రుడు వర్దెల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. జర్నలిస్టుగానే కాకుండా పాలమూరు వాసిగా కూడా వారి జీవితాల గురించి కొంత అవగాహన నాకు ఉన్నది. అందువల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పును సులభంగానే గుర్తించగలిగాను. వారి జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ఇంకాస్త లోతుల్లోకి వెళ్లాను.
ఒకప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లా, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో 88 చెంచుపెంటలున్నాయి. వారి జనాభా సుమారు ఎనిమిది వేలకుపైగానే ఉంటుంది. కుటుంబాలవారిగా తీసుకుంటే 2,500కు పైగా ఉన్నాయి. చెంచుల జీవితాల్లో వచ్చిన మౌలిక మార్పుల గురించి కుమ్మెన పెంట పెద్దమనిషి ఆర్తి అంజన్నతో పాటు మరి కొందరితో మాట్లాడాను. వారు చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రధాన స్రవంతి ప్రజలు పొందుతున్నట్లుగానే తామూ ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరిస్తూ.. ‘మా జీవితాలు అడవిలో చెట్టు లాంటివి. ఆకురాలిన చెట్టులా ఉండేవాళ్లం. అడవిని ఆగం చేస్తరు తప్ప ఎవరూ ఇంతదాకా పట్టించుకోలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎండిన చెట్టు చిగురేసినట్టు, పుట్ట తేనె చేతికి అందినట్టు, మొదుగు.. రేల పువ్వులు మా పెంటలను అల్లుకున్నట్లు తయారైనవి మా జీవితాలు’ అని చెప్పారు. తమ జీవితాల్లో వచ్చిన మార్పును ఇంతటి కవితాత్మకంగా చెప్పడం చూసి నేనే కాదు, నాతోపాటు ఉన్న మిత్రులూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇంతలా ఆయన స్పందించడానికి కారణం.. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరడమే. 1930ల నుంచి 1940ల మధ్య కాలంలో నాటి నిజాం ప్రభుత్వం చెంచులపై విదేశీ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్తో ఒక అధ్యయనం నిర్వహింపజేసింది. ఆ తర్వాతే చెంచులపై పరిశోధనలు పెరిగాయి. 2010 తర్వాత వర్దెల్లి వెంకటేశ్వర్లు రాసిన ‘మరణం అంచున’ పుస్తకం చెంచులపై ప్రభుత్వాల్లో, ప్రజల్లో, ప్రజాసంఘాల్లో విస్తృతమైన చర్చకు దారి తీసింది.
1990ల నుంచి వీరి జనాభా క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. 2000 నాటికి 15 వేలున్న వీరి జనాభా 2015 నాటికి 8 వేలకు తగ్గింది. కారణం పౌష్టికాహార లోపం. మాతా శిశుమరణాలు. చిన్న చిన్న అవసరాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం. అధిక వడ్డీల కింద అటవీ ఉత్పత్తులు అమ్ముకోవాల్సి రావడం. కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కడగండ్లతోనే కన్నుమూసే దుర్భర స్థితి చెంచులది. ఇప్పుడా దృశ్యం మారుతున్నది. అందుకే కొమ్మెన పెంట పెద్దమనిషి అట్లా స్పందించాడు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవన ప్రమాణాలనే కాదు ఆయుఃప్రమాణాలను కూడా పెంచుతున్నాయి.
పులుల సంరక్షణ పేరుతో కేంద్రప్రభుత్వం చెంచులను వెంటాడింది. ఫారెస్ట్ అధికారులు తరిమి కొడుతుంటే సీఎం కేసీఆర్ అడ్డుపడ్డారు. అడవిలోనే వాళ్ల స్థిర నివాసానికి భరోసా ఇచ్చారు. అటవీ అధికారుల ఆగడాలను అదుపు చేశారు. చెంచులను అడవిలోంచి వెళ్లగొట్టే లక్ష్యంతో గత ప్రభుత్వాలు రద్దు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్న పథకాల వల్ల అడవిలోని పెంటల్లో (గ్రామాల్లో) ఎంతో మార్పు వచ్చింది. వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం వారికి అందుతున్నది. అంతేకాదు చెంచుల వివాహానికి పెద్ద ఖర్చులుండవు. వరకట్న ఆచారం లేదు. బంగారు చెవి కమ్మలు మాత్రమే పెళ్లి కూతురుకు ఆభరణాలుగా పెడతారు. దీనివల్ల, రాష్ట్రప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం కింద ఇస్తున్న లక్షా నూట పదహారు రూపాయల్లో వారికి ఎంతో మిగిలి సహాయకారిగా ఉంటున్నది.
మైదానప్రాంత రైతులకు మాదిరిగానే చెంచులకూ రైతుబంధు అందుతున్నది. రైతు బీమా కూడా వారు అందుకుంటున్నారు. ఆసరా పింఛన్లు తీసుకుంటున్న వారూ చెంచు పెంటల్లో ఉన్నారు. మల్లాపూర్, అప్పాపూర్, ఎల్లూరు, ఎనుముల పెంట, పుల్లయాపల్లి, అమరగిరి తదితర చెంచు పెంటల్లో సౌరశక్తి ద్వారా కరెంటు సరఫరా అవుతున్నది. గతంలో చీకట్లో మగ్గిన ఆ ప్రాంతాలు ప్రస్తుతం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్నాయి. అలాగే అక్కడి పిల్లలు సమీప ప్రాంతాల్లోని గురుకులాలకు వెళ్లి నేరుగా అడ్మిషన్ పొంది విద్యాబుద్దులు నేర్చుకుంటున్నారు. గర్భిణీలకు వైద్య సదుపాయాల్ని ప్రభుత్వం కల్పిస్తున్నది. చెంచులు మరిన్ని అడుగులు వేయటానికి సిద్ధపడుతున్నారు. తమకు వ్యవసాయం చేసుకోవడానికి ట్రాక్టర్లు ఇవ్వాలని కోరుతున్నారు. ట్రాక్టరు అందుబాటులో ఉంటే, వ్యవసాయ పనులకు ఉపయోగపడటంతోపాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎవరినైనా దవాఖానకు తీసుకెళ్లటానికి పనికొస్తుందని చెబుతున్నారు. దాంతోపాటు అందరికీ అంత్యోదయ కార్డులు ఇచ్చి రేషన్ అందించాలని కూడా వారు కోరుతున్నారు.
చెంచుల్లో ఒకరిద్దరు చెప్పిన మాటలు కొన్ని నాకు ఆశ్చర్యం కలిగించాయి. వనవాసి కళ్యాణ్ ఆశ్రమం కార్యకర్తలు, గిరిజన మోర్చా కార్యకర్తలు అడవుల్లోకి ప్రవేశించి ఆదివాసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రప్రభుత్వ పథకాలుగా చెప్పి చెంచులను నమ్మిస్తున్న స్థితి కనిపించింది. ఇటువంటి ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలె. చెంచుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ఆ పని రాష్ట్రప్రభుత్వం చేస్తున్నది. ఇంకా చేయాల్సి ఉన్నదన్న విషయం క్షేత్రస్థాయి పరిశీలనలో తెలియవచ్చింది.
అడవికి వందనం.. అడివి బిడ్డలకు అభివందనం
– ఆస్కాని మారుతి సాగర్, 90107 56666
( టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి)