ఢిల్లీ శివారు ప్రాంతంలో నిరసనోద్యమంలో ఉన్న రైతులపై ఒక కేంద్ర మంత్రి కుమారుడి కారు దూసుకుపోవడం, కొందరు మరణించడం, మరెందరో గాయపడటం అత్యంత విషాదకరం. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు ఏడాదికాలంగా రైతులు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ వ్యవసాయ విధానాలు లేదా రైతుల ఆందోళనలోని సహేతుకత గురించిన చర్చ వేరు. ఆ నిర్దిష్ట అంశంపైనే కేంద్రీకరించి పరిష్కారాలు అన్వేషించాలనేమీ లేదు. ఏడాది కాలంగా రైతులు ఆందోళన సాగిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరే తీవ్ర అభ్యంతరకరమైనది. కేంద్రం మొదటి నుంచి ఈ ఆందోళనను రాజకీయ కోణం నుంచే చూస్తున్నట్టుగా కనిపిస్తున్నది. నిరసనల వెనుక రాజకీయ పక్షాలు ఉండటం సాధారణమే. పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఈ ఆందోళనలను ప్రభావితం చేస్తుండవచ్చు. కానీ రాజకీయం పేరుతో వాస్తవ పరిస్థితులను గుర్తించ నిరాకరించకూడదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాలలో కొన్నేండ్లుగా ఏదో ఒక కారణంగా రైతుల ఆందోళనలు పెచ్చరిల్లుతున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలలో రైతుల ఆందోళనలు పెల్లుబికాయి. ఆందోళనలు తాత్కాలికంగా ఉపశమించినప్పటికీ, రైతులలో అశాంతి తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వ్యాపించిన రైతుల ఆందోళన ఈ వ్యవసాయ సంక్షోభాన్ని ప్రధాన చర్చనీయాంశంగా మార్చగలిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా తదనుగుణంగా స్పందించి సంక్షోభ పరిష్కారంపై దృష్టి సారించాల్సింది. సమస్య పరిష్కారంలో రాష్ర్టాల సహకారం తీసుకోవలసింది. దేశ జనాభాలో సగానికి పైగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నది. దేశ భద్రతకు తగినంత ఆహారం, సామాజిక శాంతి కనీస ప్రాతిపదికలు. ఇంత తీవ్రమైన సమస్యపై యాథాలాపంగా వ్యవహరించడం సబబుకాదు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడం ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణం. రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో ప్రజాస్వామిక ధోరణిని గమనించవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులకు ఎరువులు, విత్తనాలను అందించలేని నాటి ప్రభుత్వం పోలీసు స్టేషన్లనే సరఫరా కేంద్రాలుగా చేసుకున్నది. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత ఎరువులు, విత్తనాలు లభించడమనేది చిన్న విషయంగా మారిపోయింది. వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి సమగ్ర విధానమే అమలవుతున్నది. సాగునీరు, నిరంతర విద్యుత్ మొదలుకొని పెట్టుబడి ఖర్చు వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏ లోటు రానీయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే, జాతీయ స్థాయిలో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించినప్పుడు రైతుల ఆందోళనలు తలెత్తవు.