కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం జాతీయ నాయకుడు సీతారామ్ ఏచూరి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ర్టాన్ని వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. చరిత్ర పూటల్లోకి వెళ్తే ‘దొంగే, దొంగా… దొంగ’ అని అరిచినట్టుగా (ఉల్టా చోర్ కొత్వాల్ కో దాంటే) ఉంది బండి వాలకం. సీపీఎం, ఎంఐఎం పార్టీలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాయి. అంతే కానీ ఒకవైపు మద్దతు ఇచ్చి మరోవైపు గోతులు తీయలేదు. రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణకు టీడీపీ చేసిన ద్రోహాన్ని మరవకముందే 2014 ఎన్నికల్లోనే ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకొన్న విషయాన్ని బండి సంజయ్ మరిచిపోయారా?. ద్రోహులతో దోస్తీనా? అని బండి సంజయ్ చేసిన విమర్శ ఇంతకు ఏ పార్టీ గురించి?. తన పార్టీ గురించేనా?!
సమ్ థింగ్ ఫర్ సమ్ థింగ్ అనే పదాలకు ఇంగ్లీష్లో ‘క్విడ్ ప్రో కో’ అనే పేరుంది. ఈ పదానికి కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. ఈ పార్టీ గత అక్టోబర్లో మహబూబ్నగర్లో నిరుద్యోగ జంగ్ సైరన్ నిర్వహించింది. ఆ వేదికపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కాబోయే ముఖ్యమంత్రి అంటూ చిన్నారెడ్డి ఆకాశానికెత్తారు. ఆ తర్వాతనే చిన్నారెడ్డిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి వరించింది. అప్పటి వరకు ఈ పదవిలో కొనసాగిన కోదండరెడ్డి రాజీనామా చేయడంతో చిన్నారెడ్డిని నియమించారు. క్రమశిక్షణా కమిటీ స్వతంత్రంగా వ్యవహరించాలి అంతే తప్ప, టీపీసీసీ అధ్యక్షుడి చేతిలో దండంలా ఉండకూడదనీ ఈ పదవి నుంచి కోదండరెడ్డి తప్పుకొనే ముందు సన్నిహితులతో వాపోయారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఇటీవల క్రమ శిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. మరి పార్టీ జాతీయ నాయకుడు శశిథరూర్ పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నోటీసు ఎందుకు ఇవ్వలేదని జగ్గారెడ్డి ప్రశ్నించడంతో ‘డామిట్ కథ’ అడ్డం తిరిగింది. జగ్గారెడ్డి అన్నదాంట్లో తప్పేమీలేదంటూ సీనియర్లంతా సమర్థిస్తూ చిన్నారెడ్డిని తప్పుపట్టారు. ఆయన తనకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు, నేను కూడా ఆయన చెప్పిన పనులు చేసిపెట్టక తప్పదని చిన్నారెడ్డి సీనియర్ల వద్ద వాపోయారట. కొసమెరుపు ఏమిటంటే ‘ క్విడ్ ప్రో కో ’ పార్టీలో కొత్తేమీ కాదని. టీపీసీసీని రేవంత్రెడ్డికి ఇచ్చినప్పుడే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆ పోస్టుకు ఎంత ధర పలికిందో చెప్పారు కూడా.
తనకు తెలియకుండా తమ జిల్లాలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు పట్ల ఆగ్రహంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫోన్ చేసారు. అయితే ఆయన ఫోన్ ఎత్తలేదు. గతంలో కూడా రేవంత్రెడ్డి ఇదే విధంగా వ్యవహరించ డంతో జగ్గారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విరుచుకు పడ్డారు. పార్టీ విషయాలపై బాహాటంగా మాట్లాడ కూడదని పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ జగ్గారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రేవంత్రెడ్డి అలా చేయడం తప్పేనని కూడా ఠాకూర్ అంగీకరించారు. ఇక ముందు నేతల మధ్య గ్యాప్ రాకుండా చూసేందుకు మహేశ్కుమార్ గౌడ్ను టీపీసీసీ సమన్వయకర్తగా నియమించారు. రచ్చబండ విషయంలో సీన్ మళ్లీ రిపీట్ కావడంతో ఈ విషయాన్ని మహేశ్కుమార్ దృష్టికి జగ్గారెడ్డి తీసుకెళ్లారు. కానీ ఆయన కూడా తన ఫోన్ ఎత్తలేదని చావు కబురు చల్లగా చెప్పారు. తన పరిస్థితి డోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఉందని జగ్గారెడ్డి వాపోయారు.
–వెల్జాల