రాష్ట్రంలో మొత్తం 10,763 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఉపాధ్యాయులు 1.18 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు చెప్తారు. 20 కన్నా ఎక్కువ సిబ్బంది పనిచేస్తూ ఉంటే ఆయా యాజమాన్యాలు తమ వాటాగా ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించాల్సి ఉంటుంది. ఇది తప్పించుకోవడానికి అనేక పాఠశాలలు తమ వద్ద తక్కువ మంది పనిచేస్తున్నట్లు ప్రభుత్వాలకు లెక్కలు చూపుతున్నాయి. దీనితో అధికారిక లెక్కల్లో లేనివారు ప్రభుత్వం అందించే సాయానికి అనర్హులయ్యే ప్రమాదం ఏర్పడింది.
గత 14 నెలల నుంచీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల్లో పనిచేసే ప్రైవేట్ టీచర్లను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ప్రైవేట్ యాజమాన్యాలకు లేకపోవడం శోచనీయం.
ఏండ్ల తరబడి ప్రైవేట్ టీచర్లు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఒకే యాజమాన్యం పరిధిలో పనిచేసేవారు ఐక్యంగా ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, వివిధ మేనేజ్మెంట్ల కింద పనిచేయడం వల్ల ప్రైవేట్ టీచర్లలో ఐక్యత లోపిస్తున్నది. ఒకవేళ ఐక్యంగా ఉండాల్సి వస్తే అలాంటివారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. అందువల్ల టీచర్లు తప్పనిసరి పరిస్థితుల్లో వారి కుటుంబాల కోసం యాజమాన్యాలు చెప్పినట్లు చేయాల్సి వస్తున్నది. తమ కుటుంబ పోషణ కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తున్నది. కరోనా ప్రభావం వల్ల అనేక పాఠశాలల్లో టీచర్లతో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తూ వారికి నామమాత్రపు జీతాలిస్తున్నారు. బయటకు వెళ్లి పనిచేసుకునే పరిస్థితులు లేక తప్పనిసరి పరిస్థితుల్లో యాజమాన్యాల చేతుల్లో శ్రమ దోపిడీకి గురవుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో జీవో నం-1 అమలవుతున్నదో లేదో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. సరైన బోధన, క్వాలిఫికేషన్, ప్రతిభ, అనుభవం కలిగిన ప్రైవేట్ టీచర్లు ఆయా పాఠశాలల్లో మంచి ఫలితాలు తీసుకొస్తున్నారు. లాభాలు మాత్రం యాజమాన్యాలు తీసుకొని, జీతాలు మాత్రం అం తంత మాత్రమే ఇవ్వటం శ్రమ దోపిడీకి నిదర్శనం. ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు నిర్వహిస్తున్నామని చెప్తున్నా పరిశీలిస్తే అనేక లొసుగులు బయటపడతాయి. ప్రైవేట్ టీచర్లు విధిలేని పరిస్థితుల్లో పనిచేయాల్సిన దుస్థితిలో ఉంటున్నారు.
గత 14 నెలల నుంచీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల్లో పనిచేసే ప్రైవేట్ టీచర్లను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ప్రైవేట్ యాజమాన్యాలకు లేకపోవడం శోచనీయం. వేతనాల కోసం, వాటి పెంపు కోసం ప్రైవేట్ టీచర్లు పోరాటం చేస్తే యాజమాన్యాలు అనేక విధాలుగా అణచివేస్తున్నాయి. కక్ష సాధింపునకు పాల్పడుతున్నాయి. నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణకు అనేక విధి విధానాలను పాటించాలి. పేరుకే గవర్నింగ్ బాడి, పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ వంటి కమిటీలు ఉంటాయి. వాటివల్ల ప్రైవేట్ టీచర్లకు ఒరిగేదేమి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రైవేట్ టీచర్ల వేతనాలు పాతాళంలో ఉన్నాయి. ఏటా టీచర్లతో ఒప్పంద పత్రాలు రాయించుకొని, తగువిధంగా వేతనాలు మాత్రం ఇవ్వడం లేదు.
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సిండికేట్గా ఏర్పడి అత్యంత తక్కువ వేతనాలిస్తున్నారు. చాలా పాఠశాలల్లో అటెండర్లు ఉండరు. పనిచేసే టీచర్లే అటెండర్ స్థాయి నుంచి అన్ని పనులు చేసుకోవాలి. ఇక పీఎఫ్, ఈఎస్ఐ వంటివి కూడా టీచర్ల వేతనాల నుంచే చెల్లిస్తున్నారు. ప్రభుత్వానికి ఆన్లైన్లో చూపినట్లు విద్యార్థుల ఫీజులు వసూలు చేయరు. టీచర్ల జీతాలు కూడా ప్రభుత్వానికి చూపినవి అమలు చేయనే చేయరు. ఇక సెలవుల విషయంలో అయితే మరీ దారుణం. కొన్ని స్కూల్స్ నెలకు 2 సెలవులు ఇస్తే, చాలా పాఠశాలలు నెలకు ఒకటి మాత్రమే ఇస్తున్నాయి.
రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను పర్యవేక్షించి, ఆడిటింగ్ విషయాలను లోతుగా పరిశీలిస్తే వారి అక్రమాలు బయటపడతాయి. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారు. ప్రభుత్వం వెంటనే అధికారులచే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్ళను పర్యవేక్షించాలి. అప్పుడు మాత్రమే ప్రైవేట్ టీచర్లకు న్యాయం జరుగుతుంది.
(వ్యాసకర్త: ప్రైవేట్ ఉపాధ్యాయుడు)
కాళేశ్వర కృష్ణమూర్తి