కాలుష్యం ప్రాణాలను కబళిస్తూనే ఉన్నా.. మానవాళిలో ఇసుమంతైనా మార్పురావడం లేదు. ప్రపంచంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో సగానికిపైగా మన దేశంలోని నగరాలే కావటం గమనార్హం. దేశంలో కొన్ని నగరాలు నివాసయోగ్యం కానివిగా మారాయంటే కాలుష్య ప్రమాదం ఎంతున్నదో ఊహించవచ్చు.
పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాలే కాకుండా అనేక పరిశ్రమల స్థాపన, మానవ వ్యర్థాలు, విసర్జితాలు వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. ‘ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్’ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం… చమురుతో నడిచే ఆటోల వల్ల బెంగళూరులో రోజుకు 1,224 టన్నుల కార్బన్డయాక్సైడ్, 4 టన్నుల నైట్రోజన్ ఆక్సైడ్ విడుదలవుతున్నది. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీని ‘వాయు కాలుష్యం’తో చూస్తుంటే నరకమే నయమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు కాలుష్య తీవ్రతను తెలియజేస్తున్నది.
ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కలిగిన మన దేశంలో వివిధ రకాల వాహనాలు 28 కోట్లకు పైగా ఉన్నాయి. ఇవిలా ఉంటే రోజుకు మరో 52 వేల కొత్త వాహనాలు రోడ్డుపైకి చేరుతున్నాయి. దీనిద్వారా ఏడాదికి 305 కోట్ల టన్నుల కాలుష్యంతో పాటు, చమురు దిగుమతికి భారీస్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాలను పెద్దసంఖ్యలో ఉత్పత్తి, వినియోగం చేసినప్పుడే కాలుష్యాన్ని రూపుమాపటంతో పాటు, హరిత రవాణాకు మార్గం సుగమమవుతుంది.
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ‘ఈవీ పాలసీ’ని తీసుకువచ్చింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాయితీలు ప్రకటించి ప్రోత్సహిస్తున్నది. మరోవైపు విద్యుత్ వాహనాల కొనుగోలుదారులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘టెస్లా’కు పోటీదారైన అమెరికా ఈవీ దిగ్గజ సంస్థ ‘ట్రై టాన్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్’తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో రాష్ట్రంలో 2,100 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లో తయారీ విభాగాన్ని ఏర్పాటుచేయబోతున్నది. తాజాగా ‘ఒలెక్ట్రా గ్రీన్ టెక్’ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల తయారీకి హైదరాబాద్ శివారులో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించింది. ఈ ప్లాంట్ అతి తక్కువ మానవ ప్రమేయం, పూర్తిస్థాయి ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో నెలకొల్పుతుండటం విశేషం. వీటితోపాటు పెద్ద కంపెనీలకు దీటుగా ‘టీ హబ్’లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ జీఎం డబ్ల్యూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీకిగాను ఇటీవల రూ.3 వేల కోట్ల పెట్టుబడులను సేకరించింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఛార్జింగ్ కేంద్రాలు స్థాపించేవారికి అవసరమైన భూమి, వ్యవస్థాపకత వ్యయంలో 20 శాతం పెట్టుబడి, విద్యుత్ చార్జీల్లో 25 శాతం రాయితీలు ఇస్తున్నది. అలాగే రాష్ట్ర జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుముల్లో మినహాయింపు ఇస్తున్నది. దీంతోపాటు మొదటి రెండు లక్షల ద్విచక్ర వాహనాలు, రెండు వేల ఆటోలు, పది వేల లైట్ గూడ్స్ వాహనాలు, ఐదువేల ఎలక్ట్రిక్ కార్లు, 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపునివ్వడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఈవీ పాలసీ’తో పాటు ‘ఎనర్జీ స్టోరేజ్ పాలసీ’ని అమల్లోకి తీసుకువచ్చింది. ఢిల్లీ, గుజరాత్ తర్వాత ఈ పాలసీని రూపొందించిన మూడవ రాష్ట్రం తెలంగాణే. రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు తోడుగా కేంద్రం కూడా ఇటీవల 20 వేల కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక రాయితీ (పీఎల్ఐ) పథకాన్ని ప్రకటించింది. దీనివల్ల ఒక్కో వాహనానికి తయారీ ఖర్చులో 50% వరకు రాయితీల రూపంలో కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు త్వరగా ఛార్జ్ కావడానికి ‘ఫాస్ట్ చార్జర్’ ప్రోటోటైప్ను అభివృద్ధి పరచడం ద్వారా ఛార్జింగ్ సమస్యలు తీరుస్తున్నది. దీంతో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది.
పెట్రోల్ డీజిల్ ఆధారంగా నడిచే వాహనానికి రెండు వేల విడిభాగాలుంటాయి. కానీ విద్యుత్ వాహనాలకు ఇరవై విడిభాగాలు మాత్రమే ఉంటాయి. ఈవీల అభివృద్ధిలో ప్రధాన సమస్య బ్యాటరీ సాంకేతికత, ఛార్జింగ్ కేంద్రాలు ఎక్కువగా లేకపోవడమే. ‘లీథియం అయాన్ బ్యాటరీ’లతో ‘ఈవీ’లు పనిచేస్తాయి. ద్విచక్ర వాహనాల ధరలో బ్యాటరీ ఖరీదు 70 శాతం కాగా, నాలుగు చక్రాల వాహనాల్లో దాని ఖరీదు 50 శాతం. 2030 నాటికి దేశంలో సగం వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలంటే లీథియం, కోబాల్ట్లతో పెద్దగా అవసరం లేకుండానే ప్రత్యామ్నాయ ముడి వనరులతో ఈవీ బ్యాటరీలను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. విదేశాల్లో తయారుచేసిన వాహనాలను భారత్కు దిగుమతి చేసుకొని విక్రయించేందుకు వీలుగా దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలి. విద్యుత్ వాహనాలను అధికంగా వాడటం వల్ల ఏర్పడే విద్యుత్ డిమాండ్ను తట్టుకోడానికి పునరుత్పాదక వనరులైన పవన, సౌరశక్తి లాంటి ‘క్లీన్ ఎనర్జీ’ల తయారీ పెరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు.
(వ్యాసకర్త: ప్రిన్సిపల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆలేరు)
–డాక్టర్ చల్ల ప్రభాకర్ రెడ్డి
90597 34830