గతవారం అహ్మదాబాద్లో మూడురోజులున్నప్పుడు మెగాసిటీ అని చెప్పుకొనే ఈ నగరం హైదరాబాద్ నుంచి చాలా నేర్చుకోవాలనిపించింది! ముఖ్యంగా నగరంలో మెట్రోరైలు, పలు ఫ్లె ఓవర్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు పచ్చదనం నిర్వహణ అవసరం. ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ ఇటీవలే విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021’ (ఐఎఫ్ఎస్ఆర్) నివేదిక కూడా నా పరిశీలనతో సరిపోయేవిధంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అహ్మదాబాద్లో పలు ప్రాజెక్టుల నిర్మాణం చూస్తుంటే అనేక ప్రాంతాల్లో ఈ నగరం పచ్చదనాన్ని కోల్పోయిందనిపించింది. నేను మాట్లాడిన వివిధ వయో వర్గాలు, సామాజిక స్థాయిలకు చెందినవారంతా నగరం కాంక్రీట్ అడవిలా మారుతున్నదన్నారు. పచ్చదనాన్ని కాపాడే ప్రయత్నాలు ఎక్కడా కనపడలేదు.
2011 నుంచి ఈ పదేండ్లలో అహ్మదాబాద్లోని అటవీ విస్తీర్ణం 17.86 చదరపు కిలోమీటర్ల నుంచి 9.41 చదరపు కిలోమీటర్లకు పడిపోయిందని ‘ఐఎఫ్ఎస్ఆర్-2021’ నివేదిక తెలిపింది. ఇది సుమారు 48 శాతం నష్టం. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా, హైదరాబాద్ లాంటి నగరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దేశంలోని అత్యంత పిన్న వయసు రాష్ట్రంలో గల నగరం హైదరాబాద్ గత దశాబ్దకాలంలో 48.66 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెంచుకొని ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ నివేదిక తెలియజేసింది. మౌలిక సదుపాయాల విషయంలో హైదరాబాద్ గణనీయంగా మారుతున్నది. అహ్మదాబాద్ కంటే నిర్మాణ కార్యకలాపాలు చాలా ఎక్కువ. అయినా పార్కులతో నిండిన హైదరాబాద్.. తన పచ్చదనాన్ని కాపాడుకోవడమే కాకుండా 48.66 చ.కి.మీ. మేర వృక్ష సంపదను ఈ పదేండ్లలో పెంచింది. హైదరాబాద్లో పర్యావరణ సమతుల్యతను కాపాడటం ప్రభుత్వ యంత్రాంగ నిబద్ధతకు నిదర్శనం.
కేసీఆర్ కలలుగన్న ‘హరితహారం’ పచ్చదనం పెంపు లో కీలకపాత్ర పోషించింది. కానీ గుజరాత్లో తలపెట్టిన ‘మిషన్ మిలియన్ ప్లస్ ట్రీస్’ కార్యక్రమం కాగితాలకే పరిమితమైందని అహ్మదాబాద్ ప్రజలు చెప్తున్నారు. ఈ నగరం విస్తరిస్తూ, పెద్ద మొత్తంలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నా, పట్టణీకరణ స్థాయిలో పచ్చదనం పెంపు మాత్రం లేదు. గ్రీన్ బెల్ట్ పరిరక్షణ, పునరుత్థానం అనేవి ఈ ప్రపంచం ముందు ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ముఖ్యమైనవి. హైదరాబాద్లో జరుగుతున్నట్లుగా మున్సిపాలిటీలు, లేదా సంబంధిత పరిపాలనా విభాగాలు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంపై దృష్టిపెట్టకపోతే, భవిష్యత్తు తరాలకు అన్యాయం జరుగుతుంది.
హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద మెట్రో రైలు ఉన్నది. దేశంలోనే అత్యంత పొడవైన ఫ్లై ఓవర్ కూడా ఇక్కడే ఉంది. నగరంలో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ)లో భాగంగా అనేక ఫ్లై ఓవర్లు, రోడ్లు నిర్మించారు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి శరవేగంగా సాగుతుండగానే హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల తగినన్ని మొక్కల పెంపకం జరిగేలా చూడటం మర్చిపోలేదు. అభివృద్ధితో పాటు నివాసయోగ్యమైన నగరాలు కావాలంటే ప్రజానుకూల విధానాలే కీలకం. నగరాల్లో తగినంతగా పచ్చదనాన్ని పెంపొందించకపోతే ఇవి క్రమంగా గ్యాస్ ఛాంబర్లుగా మారిపోయి, చివరికి పీల్చుకునే గాలి కోసం ప్రజలు అల్లాడాల్సి వస్తుంది. మౌలిక సదుపాయాల వల్లే కాకుండా, ఇక్కడున్న నైపుణ్యాలు గల యువత కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారింది. పదేండ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. ప్రస్తుత గుజరాత్ సీఎంను హైదరాబాద్లోని అభివృద్ధి చూడటానికి ఒక బృందాన్ని పంపమని చెప్పాలి. హైదరాబాద్ నుంచి నేర్చుకోడానికి అహ్మదాబాద్కు చాలా పాఠాలున్నాయి!
(వ్యాసకర్త: పాల్వాయి రాఘవేంద్రరెడ్డి, రాజకీయ, కమ్యూనికేషన్ల నిపుణుడు)