చాలా చారిత్రక ప్రదేశాల పేర్లు మనం ఇప్పుడు పిలుచుకుంటున్నవి కావు. ఇక్ష్వాకుల శాసనాలు నాటి కొన్ని పేర్లను మనకు అందించాయి. మొదటిది విజయపురి, ఇక్ష్వాకుల రాజధాని. రెండోది ఇప్పుడు మనం ఫణిగిరిగా పిలుచుకుంటున్న ధమ్మచక్క పురం (ధర్మచక్రం పురం). ఈ పేరు ఫణిగిరిలో దొరికిన స్తంభంపై ఉన్న శాసనంలో ఉన్నది. ఇక మూడోది ఏలేశ్వరం. ఇది బహుశా మూడో ఇక్ష్వాకుల రాజు ఎహువల చాంతమూల సేనాపతి ఎలిసిరి పేరిట వచ్చిందేమో. కృష్ణా నది ఇచ్చిన బౌద్ధ వారసత్వం గురించి రాబోయే వ్యాసాల్లో విస్తృతంగా చర్చించుకుందాం. ఇప్పటికే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో మునిగిన వారసత్వం గురించి ఇంకేం చేయలేం. కృష్ణా తీరంలో, పరీవాహక ప్రాంతంలో, దాని ఉపనదులు, ఏరుల పొంటి ఇంకా ఎంతో ఇక్ష్వాకుల చరిత్ర దాగి ఉన్నది. ఇప్పుడు దానిగురించే పురావస్తు శాఖలు, ఆర్కియాలజిస్టులూ, చరిత్రకారులు ఆలోచించాల్సి ఉన్నది.
కొత్త రాతియుగంలో వృత్తాకార ఇండ్ల నుంచి ఇక్ష్వాకుల కాలానికి వచ్చేసరికి ఇండ్ల నిర్మాణంలో నైపుణ్యం పెరిగింది. ఇక్ష్వాకుల నాటి ఇండ్ల నిర్మాణ కౌశల్యం శాతవాహన కాలంలో మొదలైనదే. అందుకే ధూళికట్ట (పెద్దపల్లి జిల్లా), పోలకొండ (జనగామ జిల్లా), క్యాతూరు (జోగులాంబ-గద్వాల జిల్లా అలంపూర్ దగ్గర) వంటి శాతవాహన కాలపు లేదా తొలి చారిత్రక కాలపు నిర్మాణాల్లో సారూప్యత, క్రమ అభివృద్ధి కనిపిస్తాయి. ప్రజల్లో సాధారణ ప్రజలు, సంపన్నులు అనే రెండు వర్గాలున్నాయి కాబట్టి ఇండ్ల నిర్మాణంలో కూడా ఆ తేడా కనిపిస్తుంది. ఏలేశ్వరం, నాగార్జునకొండ వంటి ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో ఎన్నో నివాసపు కట్టడాలు దొరికినయి.
నిర్మాణాలు వృత్తాకారం, చదరం, దీర్ఘ చతురస్త్రం ఆకారాల్లో ఉండేవి. పునాదులను కంకర రాళ్లతో, కొన్ని సందర్భాల్లో రాళ్లతో కట్టేవారు. గోడలు వాళ్ల ఆర్థిక స్థితిని తెలియజేస్తాయి. సంపన్నుల ఇండ్ల గోడలు ఇటుకలతో కడితే మామూలు ఇండ్ల గోడలు బంకమట్టి పూత పూసిన తడకలు మొదలు బంకమట్టి పెళ్లలతో కట్టిన గోడలున్నాయి. ఏలేశ్వరంలో దొరికిన ఎర్ర మట్టితో చేసిన వడంబాలు, గోడల నిర్మాణ కొలతల్లో వాడినదే. పేదల ఇంటి పైకప్పులు దూలాలపై రెల్లు గడ్డితో కప్పితే ధనికులు పెంకుల్ని వాడేవారు. ఇంటిలోపల కంకర పరిచి, సున్నం గచ్చువేసి, మట్టితో లేదా కంకర మట్టి క లిపి- ఇలా రకరకాల పదార్థాలు పరిచి దిమ్మిస చేసిన నేలలుండేవి. ఇక సామూహిక లేక ప్రజలందరికీ ఉపయోగపడే కట్టడాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కృష్ణ ఒడ్డున నిర్మించిన స్నానఘట్టాలు. నదిలోనికి మెట్లు కట్టిన ఈ నిర్మాణాలు ఏలేశ్వరం, నాగార్జునకొండ చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. నాగార్జునకొండ తవ్వకాల్లో కోట గోడ, చుట్టూ కందకం, కోట ప్రాంతంలో అశ్వమేధ శాల వంటి నిర్మాణాలున్నాయి. కోట ప్రాంతంలోనే ఎన్నో చోట్ల సామూహిక స్నానవాటికల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి.
ఏలేశ్వరంలో అయితే నది ఒడ్డున స్నాన ఘట్టానికి పైన 140.80 X 40.3 మీటర్ల కొలతలతో, సున్నపురాయి స్తంభాలతో నిర్మించిన మంటపం ఉన్నది. ఇది కూడా నది ఒడ్డున ప్రజలు సమావేశం కావడానికి కట్టిన ప్రజోపయోగమైన నిర్మాణమే. సిరి పర్వత ప్రాంతంలో దొరికిన స్వర్ణకారులు, శిల్పులు, దంతపు పనివాళ్లు, కుమ్మరులు వంటివారి కార్యశాలల (వర్క్షాప్స్) నిర్మాణ ఆధారాలు ఇక్ష్వాకుల కాలం నాటి చేతి పని వృత్తుల విస్తృతికి ఉదాహరణ.
క్రీడా స్థలం (యాంఫీ థియేటర్): ‘నభూతో’ అన్న పదానికి సరిగ్గా అతికేది ఇక్ష్వాకుల కాలం నాటి క్రీడా స్థల కట్టడం. సిరి పర్వత ప్రాంతం మనకు దేశంలోనే ఎన్నో మొదటి ఆధారాలను ఇచ్చింది. ప్రపంచ చరిత్రలో రోమన్ యాంఫీ థియేటర్ గురించి తెలుసు. భారత ఉపఖండంలో జరిగిన తవ్వకాల్లో ఇటువంటి క్రీడాస్థల నిర్మాణం ఎక్కడా దొరకలేదు. ఎహువల చాంతమూల పాలనలో కట్టిన ఇది ఒక యాంఫీ థియేటర్. మల్ల యుద్ధం వంటి క్రీడలు ఇక్కడ జరిగేవని చరిత్రకారుల భావన. కేవలం క్రీడలు కాకుండా రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఉపయోగపడి ఉండవచ్చు. 56 అడుగుల పొడవు 48 అడుగుల వెడల్పుతో ఉన్న ఖాళీ స్థలం నాలుగువైపులా ఆధునిక స్టేడియంలో ఉన్నట్టే అంచెలంచెలుగా మెట్లను రాతి పలకలతో నిర్మించారు. ఒక వైపున క్రీడాస్థలి ప్రవేశద్వారం, ఇంకోవైపు 15 అంచెల మెట్లు, ప్రత్యేకంగా కనిపించే గ్యాలరీలు నేటి స్టేడియాలకు ఏమీ తీసిపోకుండా నిలుస్తుంది. ఇంకో అద్భుతమేమంటే కొండవాలులో కట్టడం వల్ల ఇక్కడ ధ్వనిశాస్త్ర (అకౌస్టిక్స్) సూత్రాలను పాటించారు. ఈ యాంఫీ థియేటర్ బౌద్ధ మాతృదేవత హారీతి ఆలయానికి దగ్గరలో పశ్చిమ దిశలో ఉన్నందున, ఇది కేవలం క్రీడలకు కాకుండా హారీతి సంబంధిత కార్యక్రమాలు లేక సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఉపయోగపడిందేమో పరిశీలించాల్సి ఉన్నది.
సామూహిక అవసరాల కోసం కట్టిన నిర్మాణాలు మతపరమైనవి కాకపోయినా చారిత్రక ఆధారాలను తమలో నిలుపుకొంటాయి. చరిత్ర అంటే రాజులూ, రాణుల చరిత్ర, యుద్ధాల వర్ణన కాదు. మామూలు మనుషుల జీవితం ఎట్ల ఉండేది? వాళ్ల ఇండ్లు ఎట్లుండె? సామాజిక జీవితం ఎట్లా సాగింది? ఇది తెలుసుకోకపోతే చరిత్ర పాక్షికమే. ఇలాంటి ప్రశ్నలకు పురావస్తు తవ్వకాలు సమాధానం ఇస్తాయి. ఈ నిర్మాణాలన్నింటినీ రెండుగా చూడొచ్చు. ఒకటి లౌకికమైనవి అంటే మతపరమైన కట్టడాలు కానివి. రెండోది మతపరమైన నిర్మాణాలు.
దేశంలో వైదిక ఆలయ సమూహం: ఈ విషయంలో కూడా కృష్ణా లోయ ప్రత్యేకమే. ఇక్కడే దేశంలోని తొలి వైదిక ఆలయాల ఆధారాలు విస్తృతంగా దొరికాయి. దీనికితోడు ఆలయ నిర్మాణ ప్రక్రియలో క్రమంగా జరుగుతున్న అభివృద్ధి కూడా కనిపిస్తున్నది. కట్టెలు, స్లాబ్, ఇటుకలు, ప్లాస్టర్ చేసిన ఇటుకలు – ఇలా అన్నిరకాల పదార్థాలను వాడిన గుళ్ళు ఇక్కడ కనిపిస్తాయి.
ఆ గుళ్ళ నిర్మాణాల్లో కూడా ప్రత్యేకతలున్నాయి. ఉదాహరణకు పుష్పభద్ర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం, అష్టభుజస్వామి ఆలయంలో వేదికలు (ప్లాట్ఫామ్స్) వంటివి. మొదటిరాజు సిరి చాంతమూల కాలంలో వైదిక సంస్కృతికి చెందిన అశ్వమేధ శాల వంటివి తప్ప ఆలయ ని ర్మాణం జరిగిన ఆధారాల్లేవు. అంటే ఈ కాలాన్ని వైదిక క్రతువులకు, ఆలయ-కేంద్రిత సంస్కృతికి మధ్య సంధికాలం అనాలేమో. ఆ తర్వాత వచ్చిన వీర పురుషదత్త పాలనాకాలంలో బౌద్ధ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగినయి. ఇక 3వ రాజు ఎహువల చాంతమూల కాలంలో పుష్పభద్ర స్వామి, సర్వదేవ, నోడగిరీశ్వర, కార్తికేయ, కుబేర, నవగ్రహ ఆలయాల నిర్మాణం జరిగింది. చివరి రాజైన రుద్రపురుషదత్తుడి కాలంలో అష్టభుజ స్వామి, హారీతి ఆలయాలను కట్టినట్టు శాసన ఆధారాలున్నాయి. ఇవేకాకుండా ఏ రాజు కాలంలో కట్టించారో ఆధారాల్లేని కార్తికేయ ఆలయం, ఆయన దేవేరి అయిన దేవసేనల ఆలయాలను కూడా తవ్వకాల్లో గుర్తించారు. కొన్ని ఆలయాలకు అనుసంధానంగా మంటపాలు, రంగ మంటపాలు వంటి నిర్మాణాలు తవ్వకాల్లో దొరికాయి.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000