చాళుక్య విక్రమశకం-8, రుధిరోద్గారి సంవత్సరం ఉత్తరాయణ సంక్రాంతి సమయంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల దేవుని పాలనాకాలంలో వేములవాడలోని రాజేశ్వరస్వామికి సమర్పించిన దానాన్ని తెల్పుతూ వేయించిన శాసనం ఉంది. శాసనకాలం క్రీ.శ.1083.
శాసనం ‘శ్రీశ్రీశ్రీశ్రీ నమస్తుంగ శిరశ్చుంబి చంద్రచామర చారవే త్రైలోక్య నగరారంభ మూళస్తంభాయ శంభవే’ అని శివుడి ప్రార్థనతో ప్రారంభమైంది. ఆ తర్వాత చాళుక్య త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుడు ‘సమస్త భువనాశ్రయ శ్రీ పృథ్వీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర, పరమ భట్టారక, సత్యాశ్రయ కులతిక, చాళుక్యాభరణ శ్రీమత్త్రిభువనమల్లదేవర’ అని కీర్తించబడినాడు.
త్రిభువనమల్లని సామంతుడైన మహామండలేశ్వర రాజాదిత్యుడు తన ప్రభువు త్రిభువనమల్ల దేవుడు కళ్యాణిపురం రాజధానిగా పాలిస్తున్న సమయంలో అతని అనుమతితో లేంబులవాడ రాజధానిలో చబ్బి 2100 కొసవళ సవలఖ్ఖె య భాగం (ఒక లక్ష పాతిక) పాలిస్తుండగా తన పేరు మీదుగా వేములవాడలో రాజాదిత్యేశ్వర స్వామిని
ప్రతిష్టించి ఆలయం నిర్మించాడు.
స్వామి అంగభోగం, రంగభోగం, ఆలయ ఖండస్ఫుటిత జీర్ణోద్ధరణాది కార్యక్రమాలకు, తపోధనులకు, శైవమఠమందు ఉన్న విద్యార్థుల ఉచిత భోజన, వసతులకు, ఉపాధ్యాయుల జీతాలకు, సంకయపల్లిలో, రాజాదిత్య సముద్రం కింద భూమిని, అగ్రహారాన్ని దానం చేశాడు.
ఈ శాసనంలో రాజాదిత్యుడు ‘సమధిగత పంచ మహాశబ్ద మహా మండలేశ్వర విరోధి మండలిక, మదన మహేశ్వర తొండ మండలిక మండతి ఖాండవ పాండునందనం, సుకవి పిక నికర కోర కతి సహకార నందనం, నిజ విజయ భుజానిలతా నర్తన కీర్తన వినోదలావకం, కునింగల కోటాటవీ దావపావకం, రాజేంద్రచోళ కీర్తివల్లీ, పల్లవ నిదాహ సమయ దివసరం వివేకరత్న రత్నాకరా కుటుంబ కదంబ నిర్మూ… విజయరాయ విజయ సంహరణం, గండరాభ రణం, చోఱకటక సూరెకారం, పెర్మాడియంకకారం, కాంచీపుర ప్రబలపన్నగ వైనతేయం, వితరణ వినోద రాధేయ నరసక్కె కేసరి మండరిక దిక్కరి ప్రచండారి మండరికమణ శ్రీకృతాన్తంజోయి యన హన్మంత నామాది సమస్త ప్రశస్తి సహితం శ్రీమన్మహా మండలేశ్వరం రాజాదిత్య’ అని కీర్తించబడినాడు.
ఇతడు చొండమండలాధిపతులను ఓడించాడు, కునింగిల వనదుర్గాన్ని కాల్చివేసి రాజేంద్రచోళుని కీర్తిని తగ్గించాడు. కురుంబులను అణచివేశాడు. విజయరాయ విజయుని సంహరించాడు. కాంచీపురాన్ని, చోళదేశాన్ని దోచుకున్నాడు. ఈ శాసనం వల్ల రాజాదిత్యుని పరాక్రమ శౌర్యాలు, అతని దాన నిరతి తెలుస్తున్నాయి.
ఈ దానఫలాన్ని కాపాడినవారు వారణాసిలో చతుర్వేద పండితులను, కోటి ఆవులను పోషించిన ఫలము, ఈ ధర్మాన్ని పాటించనివారు కాశీలో బ్రాహ్మణులను, గోవులను చంపిన దోషం పొందుతారని చెప్పిబడింది. శాసనం చివరలో ‘శ్రీమన్మహా మండలేశ్వర రాజాదిత్య దేవర స్వహస్త లిఖితం’ అని చెప్పబడింది.
– భిన్నూరి మనోహరి