ఆధునిక తెలుగు సాహిత్యంలో పుంఖాను పుంఖాలుగా రచనలు వెలువడుతున్నప్పటికీ మహాకావ్యాల రచనలు చాలా తక్కువ. ఆ లోటును తీర్చేందుకు శ్రీమద్రామాయణం మహాకావ్యాన్ని పరిపూర్ణ పద్య కావ్యంగా రాశారు శశికిరణ్ కొమండూర్. శ్రీమద్రామాయణానికి సర్వకాల సర్వావస్థల యందు ప్రాముఖ్యం ఉంటుంది. అటువంటి కథను ఎంచుకొని అత్యంత తేలికైన పదాలతో అసాధారణ పదవిన్యాసంతో అబ్బురపరిచే రీతిలో ఈ కావ్యాన్ని రచించారు శశికిరణ్.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శశి కిరణ్ శ్రీమద్రామాయణంలో సంప్రదాయ చంధస్సులను విధిగా పాటిస్తూనే అనేక ప్రయోగాలు చేశారు. పద్యం అంటేనే భాష కొరకరాని కొయ్యలా ఉంటుందని, సంధులు సమాసాలతో కఠినంగా ఉం టుందనేది అందరి భావన. కానీ శశికిరణ్ సుదీర్ఘ సమాసాలు రాయటమే కాకుండా అందరూ అర్థం చేసుకునే వాడుక భాషకు ఈ కావ్యంలో పెద్దపీట వేశారు. కావ్య లక్షణాలను పాటిస్తూనే పట్టు విడుపులను విసంధిగా రాస్తూ అక్కడక్కడ సంప్రదాయ నియమాలను కాదని స్వరయుక్త అచ్చుకు యతివేశారు. దీంతో కావ్యం ఆద్యంతం అద్భుతమై న ధారలా సాగుతుంది.
పదాల పడికట్లలో, అద్భుతమైన తెలంగా ణ పల్లె పదాలను కూడా సందర్భోచితంగా పద్యాలలో అమర్చారు. సామాజిక స్పృహ తో దేశ కాల పరిస్థితుల్ని అత్యంత వాస్తవిక దృక్పథంతో కళ్ళకు కట్టినట్టు వివరించారు. తాను తెలంగాణ వాడినని నిబద్ధతకి బద్దుడిననీ సగర్వంగా చాటుకున్నారు. మొత్తం రామాయణాన్ని ఆరు కాండలుగా అద్భుతం గా మలిచారు. అవతారికలో హేతువాది నేను హేరామ అనలేదంటూ మొదలుపెట్టి వాడుక భాషను వాడుతూ వాడిగా కావ్య రచన చేశా రు. బాల కాండ మొదలు ఆరు కాండలు శ్రీకారంతో శ్రీరామతో మొదలు పెట్టారు. ముఖ్యమైన కథను సూటిగా రాస్తూ అంతర కథలను, అవాల్మీకాలను వదిలేశారు. బాలకాండలోఅయోధ్య నగరవర్ణన దశరథుని పాలనను అత్యద్భుతంగా ఆవిష్కరించారు.
అన్ని రసాలు పలికించిన శశికిరణ్ సీతా రాముల తొలి రేయిలో అద్భుతమైన హృద్యమైన శృంగారాన్ని పండించారు. అయోధ్య కాండ ఆద్యంతం చాలా గాఢతతో రాశారు. రాముడి భరతుడి ధర్మ సంవాదం, అరణ్య కాండలో సీతారాముల ధర్మ సంవాదం, ఇక కిష్కింధ కాండలో కథ ధారలా సాగుతుంది.
ఈ అసాధారణ పద్య కావ్యం ఆధునిక తె లుగు సాహిత్యంలో కలికితురాయిగా నిలచిపో తుందనడంలోఎటువంటి సందేహం లేదు.
– అన్వేషికా